ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

author img

By

Published : Oct 14, 2020, 7:47 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. వాగులు, వంకలు పొంగి.... గ్రామాలు, పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ తీగలు తెగిపడి పలుచోట్ల అంధకారం నెలకొంది.

heavy-rains-in-telangana
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వరద చేరడం వల్ల హైదరాబాద్- ముంబయి మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. అల్గోల్-జహీరాబాద్, బీదర్- జహీరాబాద్ రోడ్లపైకి వరద నీరు చేరడం వల్ల పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను కొనసాగించారు. కొత్తూరు నారింజ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షం కారణంగా అల్లం, చెరకు, అరటి, సోయా, పత్తి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం గర్భగుడి మునిగిపోయింది. సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‌-తెర్పోల్ వంతెనపైకి నీరు చేరింది. సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం వల్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మంజీరా నది ఉద్ధృతికి ఏడుపాయల ఆలయం నీటిలో చిక్కుకుంది . జహీరాబాద్ ముంపు కాలనీల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

నిలిచిన రాకపోకలు

వరంగల్ నగరం వరదలో చిక్కుకుంది. హన్మకొండలోని పలు కాలనీలు, ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. నాలాలపై నిర్మాణాలు చేపట్టడం వల్ల వరద రోడ్డుపైకి చేరింది. జనగామ జిల్లాలో పలుచోట్ల వాగులు రహదారులపై ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ-హైదరాబాద్ రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలను సూర్యాపేట వైపు మళ్లించారు. చీటూరు వాగు పొంగిపొర్లుతుండడం వల్ల జనగామ-పాలకుర్తికి రాకపోకలను నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు ఉద్ధృతికి తొర్రూరు -నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల చెరువులో చేపలు పట్టేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన వర్షాలకు ఖమ్మం-వరంగల్ రహదారిపై వృక్షాలు విరిగిపడ్డాయి. జాతీయరహదారిపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్‌లో పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన మేయర్ గుండా ప్రకాష్‌రావును కాంగ్రెస్‌శ్రేణులు అడ్డుకున్నారు. నాలాలను వెడల్పు చేసి కాలనీలు జలమయం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

ప్రవాహంలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారిపై గండిపడి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా నీటమునిగాయి. భూదాన్​ పోచంపల్లి నుంచి కొత్తగూడెం మార్గంలో మూసీప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకోవడం వల్ల ప్రయాణికులను దించారు. ఇందులోని 40 మంది ప్రయాణికుల్లో ఇద్దరు గల్లంతైనట్లు గుర్తించారు. నిడమనూరులో ఇళ్లలోకి వరద చేరడం వల్ల స్థానికులు పైకప్పులపైనే ఉన్నారు. మిర్యాలగూడ-దేవరకొండ మార్గంలో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడం వల్ల ఒక్కసారిగా వరద ఇళ్లలోకి వచ్చింది. మోతె మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెరలో మట్టిమిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వనపర్తి జిల్లా మైసమ్మ వాగులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభించగా మరొకరి కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో కూడవెళ్లి వాగు ఉద్ధృతి కారణంగా సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపేట మండలంలో పోచారం జలాశయం అలుగు పారుతుంది.

ఇవీ చూడండి: నిండుకుండల్లా చెరువులు.. పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.