ETV Bharat / state

ముందు ఇది నిరూపించగలరా..? బండి సంజయ్​కు హరీశ్‌రావు సవాల్!

author img

By

Published : Mar 24, 2023, 3:30 PM IST

harishrao comments on bandi sanjay: తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్​లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలరా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమం గురించి బీజేపీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని విమర్శించారు

harishrao
harishrao

harishrao comments on bandi sanjay: కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్ బీమా యోజనాతో రైతులకు వచ్చే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదని తెలంంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. దేశంలోని పది రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారన్న ఆయన.. దీనిని బట్టే ఆ పథకం నామమాత్రంగా ఉందని అర్థం కావడం లేదా అని అన్నారు.

పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు పదివేలు చొప్పున 228 కోట్ల రూపాయాల సాయం ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని హరీశ్ రావు తెలిపారు. బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరమని... దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు అదానీ ఆదాయాన్ని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ.. నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర బీజేపీది అని ఆక్షేపించారు.

వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నాయకులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

పరిహారం జీవో జారీ...

ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక పంపబోమని ఇంతకుముందు పంపిన వాటికే.. బీజేపీ సర్కారు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో నష్టపోయిన పంట క్షేత్రాలను సీఎం స్వయంగా పరిశీలించారు.

సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ఎకరాకు పదివేల రూపాయాల పరిహారం జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి పంట నష్టపోయిన రైతులకు డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంట నష్టపోయిన వచ్చే పంటకు పెట్టుబడిగా పరిహారం డబ్బులు పనికొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.