ETV Bharat / state

పంజా విసురుతోన్న సీజనల్​ వ్యాధులు.. కలవరపెడుతోన్న డెంగీ మహమ్మారి

author img

By

Published : Sep 3, 2022, 9:28 AM IST

Updated : Sep 3, 2022, 9:55 AM IST

DENGUE
DENGUE

DENGUE CASES IN TELANGANA: రాష్ట్రంపై సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా డెంగీ మహమ్మారి ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో ఈ రోగం బారినపడుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటికితోడు సాధారణ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. రోగాలతో చిన్నారులు మరింత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిపై ప్రత్యేక కథనం.

పంజా విసురుతోన్న సీజనల్​ వ్యాధులు.. కలవరపెడుతోన్న డెంగీ మహమ్మారి

DENGUE CASES IN TELANGANA: దోమలు కాటేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు ఇలా ప్రతి చోట దోమకాటుకు గురవుతున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 3000 పైగా డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నగరంలో ఇప్పటివరకు దాదాపు 13వేల వరకు డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 1500 మంది వరకు పాజిటివ్​గా తేలటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

అంటే సుమారు 12 శాతానికిపైగా పాజిటివిటీ రేట్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ సహా ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలపై డెంగీ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్న పరిస్థితి. ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితులు ఆస్పత్రులబాట పడుతున్నారు.

గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర బాధితులు: హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర బాధితులు వందల సంఖ్యలో వస్తున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే ఓపీ కింద నిత్యం దాదాపు వెయ్యి మంది వస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. గత నెలలో సుమారు 170మంది ఫీవర్ ఆస్పత్రిలో డెంగీకి చికిత్స పొందగా.. ప్రస్తుతం దాదాపు 40మంది డెంగీ రోగులు, మరో 120మంది జ్వర బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వార్డులు దాదాపు నిండిపోవటంతో ఇతర వార్డుల్లో రోగులను సర్దుబాటు చేస్తున్నారు.

చిన్నపిల్లలపై డెంగీ తీవ్ర ప్రభావం: చిన్నపిల్లలపైనా డెంగీ తీవ్ర ప్రభావం చూపుతోంది. నీలోఫర్ ఆస్పత్రికి ఈ రోగం లక్షణాలతో నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోనూ ఇటీవల ఓపీ పెరిగింది. డెంగీ పగటిపూట కుట్టే దోమలతోనే వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు.. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

"చాలామంది తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తాయి. ఇక్కడ చేరిన రోగులకు పరీక్షలు చేయగా డెంగీ కేసులు బయటపడుతున్నాయి." -డాక్టర్‌ శంకర్‌, ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ఇవీ చదవండి: రాష్ట్రంపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్

కుమారుడు లేడని.. ముగ్గురు కుమార్తెలను గొంతునులిమి చంపిన తల్లి

Last Updated :Sep 3, 2022, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.