ETV Bharat / state

Covid: చిన్నారులపై మహమ్మారి... మూడోదశలో 30 లక్షల మంది పిల్లలకు వైరస్‌!

author img

By

Published : Jun 4, 2021, 5:08 AM IST

Corona virus
చిన్నారులపై కొవిడ్ పడగ

కొవిడ్‌ (Covid) రెండోదశ ఉధ్ధృతి ఇంకా ముగియనే లేదు. అప్పుడే మూడోదశ (Third wave) గుబులు మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది.

కొవిడ్‌ రెండోదశ ఉధ్ధృతి ఇంకా ముగియనే లేదు. అప్పుడే మూడోదశ గుబులు మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇందులోనూ 1 శాతంమంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)’ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాలలకు మెరుగైన వైద్యసేవలందించడానికి సర్కారు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కొవిడ్‌ నిపుణుల కమిటీ సమావేశమై.. ముందస్తు సన్నాహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సర్కారు వైద్యం బలోపేతం
ప్రస్తుతం చిన్నారులకు ఏ కష్టమొచ్చినా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ లేదా గాంధీ ఆసుపత్రులకు వెళ్లాల్సిందే. బోధనాసుపత్రుల్లో మినహా జిల్లాల్లో అయితే ప్రత్యేకంగా పిల్లల వార్డులే లేవు. దీంతో ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వ రంగంలో పిల్లల పడకలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ పిల్లల వైద్యానికి అవసరమైన పడకల సంఖ్యను పెంచనున్నారు.

ఆగస్టులోపే ప్రమాదకర కేసులు

కొవిడ్‌ తొలిదశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. రెండోదశలో మాత్రం ముప్పు కొద్దిగా పెరిగింది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో తొలి, మలి దశల్లో మొత్తం 81,967 మంది పిల్లలు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ రెండు దశల్లోనూ ఒక శాతం కూడా ఆసుపత్రుల్లో ప్రమాదకర స్థితిలో చికిత్స పొందలేదని వైద్యవర్గాలు విశ్లేషించాయి. అయితే జూన్‌-ఆగస్టు మధ్య ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)’ కేసులు పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు నెలల్లోనే సుమారు 1000-1200 వరకూ ఈ కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తమవ్వాలని వైద్యశాఖ భావిస్తోంది. మూడోదశ కనీసం 2-3 నెలల పాటు ఉండే అవకాశం ఉంటుందని అంచనా.


మూడోదశలో సుమారు 30 లక్షల మంది వరకూ పిల్లలు కొవిడ్‌ బారినపడే అవకాశాలున్నాయని భావిస్తున్నా 24 లక్షలమందికి ఎటువంటి లక్షణాలూ ఉండకపోవచ్చని.. మధ్యస్థ లక్షణాలుండేవారు దాదాపు 6 లక్షలమంది ఉండవచ్చని అంచనా. వారిలోనూ ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం పడే వారు సుమారు 6000-8000 మంది వరకూ ఉండొచ్చని ఒక భావన. ఇన్ని వేలమంది బాలలకు ఐసీయూ సేవలు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యాప్తిని ముందుగానే నియంత్రించాలనే వ్యూహాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది.

ప్రత్యేకంగా 5,000 పడకలు
ప్రత్యేకంగా బాలల కోసం 5,000 పడకలను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 2000 వరకూ ఐసీయూ ఏర్పాట్లు ఉంటాయి. మిగిలినవాటిలో ఆక్సిజన్‌ సేవలు లభిస్తాయి. అధునాతన ప్రాణవాయు పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ కనీసం 20 ఆక్సిజన్‌ పడకలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 10 ఐసీయూ వెంటిలేటర్‌ పడకలుంటాయి. బోధనాసుపత్రుల్లో స్థాయిని, అవసరాలను బట్టి పడకల సంఖ్యను పెంచుతారు.

ఔషధాల కొరత లేకుండా..

ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, చిన్నారులకు అవసరమయ్యే మందులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా విషమ పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందే వారికి ప్రత్యేకంగా ఇచ్చే ఔషధాల్లో ‘ఇమ్యునో గ్లోబ్యులిన్‌’ ముఖ్యమైంది. బహుళ అవయవాలపై దుష్ప్రభావాన్ని తగ్గించడానికి దీనిని ఇస్తారు. వాటి ఖరీదు ఒక డోసు సుమారు రూ. 10 వేల వరకూ ఉంటుంది. ఒక్కోటి 5 గ్రాముల మోతాదులో ఉంటుంది. పిల్లల బరువును బట్టి ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కరికే సుమారు రూ. 40-50 వేల వరకూ ఇమ్యునో గ్లోబ్యులిన్‌కే ఖర్చవుతుంది. మున్ముందు వీటికి డిమాండ్‌ పెరిగే అవకాశాలుండడంతో.. ఇప్పుడే వీటిని సమకూర్చుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. దీన్ని ప్లాస్మా నుంచి తయారు చేయాల్సి ఉండడంతో.. సాధారణ ఔషధం మాదిరిగా భారీ సంఖ్యలో వెంటవెంటనే ఉత్పత్తి చేసే అవకాశం ఉండదు.

ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో. ముందుగానే సుమారు 25,000 డోసుల వరకూ కొనిపెట్టాలని ఆరోగ్యశాఖ తీర్మానించింది. 12 ఏళ్లు పైబడినవారికి అవసరమైతే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఇస్తారు. అందుకే 2,000 వరకూ ఆ ఇంజక్షన్లను బాలల కోసం సమకూర్చాలని నిపుణుల కమిటీ సూచించింది. 10 వేల విటమిన్‌ సి మాత్రలను, 2 వేల విటమిన్‌ డి చుక్కల మందును, ఇంకా పారాసెటమాల్‌ తదితర సుమారు 12 రకాల ఔషధాలను, 20 రకాల పరికరాలు, వస్తువులను కొననున్నారు. చిన్నారుల్లో బ్లాక్‌ ఫంగస్‌ను దృష్టిలో పెట్టుకొని కూడా ఔషధాలను ప్రత్యేకంగా ఉంచాలని నిర్ణయించారు.

పోస్టుల భర్తీకి చర్యలు

మూడోదశ ఉధ్ధృతికి ముందే.. అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో పిల్లల వైద్య నిపుణుల పోస్టులను భర్తీ చేసుకోవడం, అవసరం లేనిచోటు నుంచి సర్దుబాటు చేసుకోవడం, ఎక్కువమంది అవసరమయ్యేచోట్ల అదనంగా భర్తీ చేయడం, పిల్లల ఐసీయూలో వైద్యసేవలందించేందుకు నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది.

నిలోఫర్‌లో ఇప్పటికే 82 మంది..

ప్పటికే నిలోఫర్‌లో 82 మంది చిన్నారులు కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది నవజాత శిశువులే. ప్రసవ సమయంలో తల్లి ద్వారా వీరికి వైరస్‌ సోకింది. మరో 70 మంది 1-12 ఏళ్ల వయస్కులు. వీరుకాకుండా మరో 34 మంది ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)’తో చికిత్స తీసుకుంటున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా తగ్గిన 3-6 వారాలకు పిల్లల్లో ఎంఐఎస్‌-సి సమస్య బయట పడుతోంది. రెండోదశ ప్రారంభమై 2 నెలలు దాటడంతో ఈ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గాక నెలన్నరలో పిల్లల్లో తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బడం, కాళ్ల వాపు, నాలుక, పెదాలు గులాబి రంగులోకి మారటం, తీవ్ర నీరసం, ఆకలి లేకపోవడం తదితర ఇబ్బందులు గుర్తిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. సాధారణ జ్వరమే కదా.. అని జాప్యం చేస్తే అది తీవ్ర ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి : Super‌ Spiders: 'వ్యాక్సిన్​ కోసం ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాల్సిందే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.