ETV Bharat / state

'పరిధులు దాటనంతవరకు.. న్యాయ వ్యవస్థకు అందరూ మిత్రులే'

author img

By

Published : Jun 2, 2022, 7:46 PM IST

Updated : Jun 3, 2022, 2:14 AM IST

KCR
'ఏ ఒక్కరి కోసమో న్యాయవ్యవస్థ పనిచేయదు.. పరిధులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు'

రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు పాత పది జిల్లాల పరిధిలోనే రాష్ట్ర న్యాయవ్యవస్థ పనిచేస్తోంది. కొత్తగా ఏర్పడిన 33 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా కోర్టులను విభజించారు. హైదరాబాద్ కాకుండా 32 కొత్త జ్యుడీషియల్ జిల్లాలను హైకోర్టు ఆవరణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్​గా ప్రారంభించారు.

'పరిధులు దాటనంతవరకు.. న్యాయ వ్యవస్థకు అందరూ మిత్రులే'

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ. రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థను సీఎం కేసీఆర్‌తో కలిసి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. కోర్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త భవనాలకు 21 జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. కొత్త భవనాలకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. జ్యుడీషియల్‌ జిల్లాల ద్వారా సామాన్యులకు సత్వర న్యాయం అందనుంది.

చరిత్రలో నిలిచిపోతుంది: అన్ని వర్గాల వారు మహోన్నత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారని సీజేఐ పేర్కొన్నారు. ఉద్యమకారులు, మేధావులు, న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధికి కూడా ముఖ్యమని సీఎం అర్థం చేసుకున్నారని అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సూచించారు. తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యాయానికి తెర తీసిందని అన్నారు. పాలన వికేంద్రీకరణతో పాటు న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ కూడా జరుగుతోందని తెలిపారు. ఒకేసారి కొత్తగా 23 జిల్లా కోర్టులు ఏర్పాటు చేయటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

నిధులు మంజూరు చేయడం హర్షణీయం: జిల్లా కోర్టుల విభజన వల్ల ఉమ్మడి జిల్లా కోర్టులపై భారం తగ్గుతోందని స్పష్టం చేశారు. కోర్టుల సంఖ్యకు అనుగుణంగా న్యాయ సిబ్బందిని నియమించాలని అన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన న్యాయసదస్సులో కీలక అంశాలపై చర్చించామని తెలిపారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు పెరగాలని ప్రధానంగా సూచించామన్నారు. సీఎం కేసీఆర్‌ కొత్త కోర్టుల భవనాలకు నిధులు మంజూరు చేయటం హర్షణీయమని వెల్లడించారు. వికేంద్రీకరణ వల్ల న్యాయవ్యవస్థ పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, మహిళ న్యాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

''అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సీఎం సహకరించారు. అడిగిన వెంటనే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు భవనం, స్థలం కేటాయించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం కూడా దక్కాలి. కొత్త జ్యుడీషియల్‌ కోర్టులకు అనుగుణంగా సిబ్బంది కూడా పెరగాలి. కమర్షియల్‌ వివాదాల కోర్టులను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో క్రమపద్ధతిలో న్యాయవ్యవస్థ పటిష్టతకు కృషి జరుగుతోంది. ఐటీ రంగం సేవలను రాష్ట్ర న్యాయశాఖ వినియోగించుకోవాలి.'' - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

పరిధులు దాటొద్దు: న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదని ఈ సందర్భంగా సీజేఐ తెలిపారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్రబాష్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని స్పష్టం చేశారు. వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు కోర్టులను తప్పుబడుతున్నారని ఉద్ఘాటించారు. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సీజేఐ కొన్ని సూచనలు చేశారు.

సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ సూచనలు

  • న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయదు
  • వ్యవస్థ ప్రయోజనం, సమాజ శ్రేయస్సే న్యాయవ్యవవస్థకు ముఖ్యం
  • ఉన్నతస్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారు
  • పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే
  • పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం
  • ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం
  • నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరం

చాలా అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా ఉన్నామని స్పష్టం చేశారు. సీజేఐని కోరగానే హైకోర్టు జడ్జీల సంఖ్యను పెంచారని గుర్తు చేశారు. జిల్లా కోర్టుల విషయంలోనూ వెనువెంటనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

''ఉమ్మడి జిల్లాల్లో సెషన్స్‌ కోర్టులకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నాం. పటిష్టమైన న్యాయవ్యవస్థ ఉంటే న్యాయం వేగంగా చేకూరుతుంది. భారం ఎక్కువగా ఉన్న కోర్టులను విభజిస్తే మంచిది.'' -సీఎం కేసీఆర్‌

గతంలో 10 జ్యుడిషియల్‌ జిల్లాలుగా జిల్లా జడ్జీల కోర్టులుండటంతో ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉన్నవారు వ్యయ ప్రయాసలకోర్చి రావాల్సి వచ్చేది. ఇకముందు జిల్లా కోర్టు అందుబాటులోనే రానుండటంతో విచారణకు హాజరు కావడానికి సౌకర్యంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా కోర్టుల్లో పరిపాలనపరమైన ఇబ్బందులూ తొలగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ జరగడంతో సత్వర నిర్ణయాలతోపాటు కేసుల విచారణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవకాశాలున్నాయి. కొత్త పోస్టులతో ఉపాధి అవకాశాలూ పెరగనున్నాయి. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ భవనాలను నిర్మించిన తరువాత కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల జాప్యం జరుగుతుందని భావించిన హైకోర్టు సూచన మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లోనే వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది.

కొన్ని జిల్లాల్లో సొంత భవనాలుండగా మరికొన్ని జిల్లాల్లో అద్దెకు తీసుకుని కోర్టులను ప్రారంభిస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టు భవనాల నిమిత్తం 21 జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాల వరకు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించి ప్రభుత్వానికి వివరాలు పంపారు. ఈ భూమిని కోర్టు సముదాయాల నిర్మాణం కోసం కేటాయించడానికి చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్‌, నారాయణపేట, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 10 ఎకరాల చొప్పున, మెదక్‌లో 9.02 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 9.38, పెద్దపల్లిలో 7, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, ములుగుల్లో 5 ఎకరాల చొప్పున, సూర్యాపేటలో 6, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 2.2 ఎకరాలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది.

ఇవీ చూడండి:

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.1.65 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Last Updated :Jun 3, 2022, 2:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.