ETV Bharat / state

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Jul 16, 2021, 6:37 PM IST

Updated : Jul 16, 2021, 8:23 PM IST

cm kcr review
కృష్ణా, గోదావరి బోర్డు గెజిట్‌పై సమీక్ష

18:35 July 16

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రప్రభుత్వం గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు, తదితరులతో సీఎం ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. గెజిట్ నోటిఫికేషన్​లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గెజిట్​లోని అంశాలను, వివరాలను అధికారులు, న్యాయవాదులు ముఖ్యమంత్రికి వివరించారు. గెజిట్ అమలుతో చోటుచేసుకునే పరిణామాలు, ప్రాజెక్టుల నిర్వహణ, ప్రభావం తదితర అంశాల గురించి సీఎం చర్చించారు.

గెజిట్‌లోని అంశాలు

బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్‌ మనీ కింద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ వివరాలు పేర్కొంది.

బోర్డులదే పెత్తనం

కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది.  తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదాలను పంపించాయి.  

గెజిట్‌పై చర్చ

ప్రాజెక్టులవారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ.. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు తర్వాతే చేయాలని కోరగా, బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. దీనిపై చివరిసారిగా గత ఏడాది అక్టోబరులో కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఇద్దరు సీఎంల అభిప్రాయాల తర్వాత, బోర్డుల పరిధులపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ మేరకు తాజా నోటిఫికేషన్‌ విడుదలైంది. బోర్డు ఛైర్మన్‌, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండకూడదని అందులో పేర్కొన్నారు. ఈ గెజిట్‌లోని అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. నోటిఫికేషన్‌ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం సమాలోచనలు జరిపారు. 

ఇదీ చదవండి: CM KCR: 'చేనేత వర్గాలకు వంద శాతం ఉజ్వల భవిష్యత్​ అందిస్తా'

Last Updated :Jul 16, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.