ETV Bharat / state

కారు జోరు ఎందుకు తగ్గింది?

author img

By

Published : Dec 5, 2020, 5:14 AM IST

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్​ఎంసీ) పోరులో ఆశించిన స్థానాలు రాకపోవడం, స్థానాల సంఖ్య బాగా తగ్గడానికి కారణాలేమిటన్న దానిపై తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్మథనం మొదలైంది. 17 మంది మంత్రులు, 16 మంది పార్లమెంట్ సభ్యులు, 35 మంది ఎమ్మెల్సీలు, 104 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, జడ్పీ ఛైర్మన్లు, పెద్ద సంఖ్యలో సుశిక్షిత కార్యకర్తలు ఎన్నికలపై పనిచేసినా అనుకున్న ఫలితాలు రాకపోవడం పార్టీ అధిష్ఠానానికి మింగుడు పడటంలేదు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు విస్తృత పర్యటనలు... తెరాస సంక్షేమ పథకాలు, నగరంలో పెద్ద ఎత్తున సాగిన అభివృద్ధి పనులు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు... ఇలా ఎన్నో అస్త్రశస్త్రాలున్నా అనూహ్య ఫలితాలు రావడం, సిట్టింగ్ స్థానాల్లోనూ ఓటమి ఎదురుకావడం పార్టీకి ఒకింత ఇబ్బందనే అభిప్రాయం అంతర్గతంగా వ్యక్తమవుతోంది.

కారు జోరు ఎందుకు తగ్గింది?
కారు జోరు ఎందుకు తగ్గింది?

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు ఊహించని ఫలితం వచ్చింది. పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దాన్నుంచి కోలుకోవాలనే సంకల్పంతోనే అధికార పార్టీ వెనువెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడం, నగరంలో పార్టీ బలంగా ఉందనే నమ్మకంలో తప్పనిసరిగా 50 శాతానికి పైగా స్థానాలను సాధించి మేయర్, ఉపమేయర్​ స్థానాలను గెలుస్తామని ధీమాతో ముందుకెళ్లింది.

ఆ సన్నాహాల్లో భాగంగానే ఎన్నికల నిర్వహణకు ముందు మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్​ఎంసీ చట్ట సవరణ చేసింది. శాసనసభను సమావేశపరిచి వాటికి ఆమోదం తీసుకుంది. జీహెచ్​ఎంసీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ ఇవ్వడంతోపాటు, వరద సాయం పంపిణీకి దరఖాస్తులు కోరింది. సమాంతరంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసింది. సీఎం నుంచి సంకేతాలు రావడంతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై వారికి డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ఆ వెనువెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.

పక్కా ప్రణాళిక.. అయినా ఫలించక...

మొత్తం 150 డివిజన్లలో పోటీచేసిన తెరాస 105 స్థానాల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించింది. 26 మంది సిట్టింగులను మార్చి మిగిలిన వారికి టికెట్లు ఇచ్చింది. ముఖ్యంగా అన్ని పార్టీల కన్నాముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడును ప్రదర్శించింది. మొత్తంగా 105 స్థానాల పైనే ఎక్కువగా దృష్టిసారించి, ఆ స్థానాలను గెలిచేందుకు పక్కా ప్రణాళిక రచించింది.

అందుకు అనుగుణంగా డివిజన్ మంత్రి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి, వారిని రంగంలోకి దింపింది. ఇంటింటి ప్రచారం నిర్వహించేలా వారికి మార్గదర్శనం చేసింది. ఆ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికల ఇన్​ఛార్జిగా వ్యవహరించిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ రామారావు ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ నేతలను సమన్వయ పరిచారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రచార శంఖారావాన్ని పూరించారు. భాజపా జాతీయ స్థాయి నేతల్ని రంగంలోకి దింపినా, తెరాస తరఫు కేటీఆర్ ఒక్కరే నగరమంతా ప్రచారం నిర్వహించారు.

సీఎం ప్రత్యేక శ్రద్ధ...

ఆరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న రాజధానిలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. తెరాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్వీయ పర్యవేక్షణలో ఎన్నికల ప్రణాళికను రూపొందించడంతో పాటు స్వయంగా ప్రకటించారు. ప్రచారం చివరి దశలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సర్వేలపై గురి ఉన్న సీఎం ఈసారీ వాటికి ప్రాధాన్యమిచ్చారు. దాదాపు ఆరు సార్లు సర్వేలు చేయించారు. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేశారు.

తలకిందులైన అంచనాలు...

పథకాలు తమకు లాభిస్తాయని ఫలితాల ముందు వరకు తెరాస అధినాయకత్వం ఎంతో ధీమాగా ఉంది. భాజపా దూకుడుగా వ్యవహరించినా తాము దాన్ని సమర్థంగా తిప్పికొట్టగలిగామని, ప్రజల మద్దతు తమకే లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ వచ్చింది. తమకు దాదాపు 100 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అనూహ్యంగా 60 కన్నా తక్కువ స్థానాలకే పరిమితమైంది. మంత్రులు ఇన్​ఛార్జీలుగా పనిచేసిన నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. బలమైన అభ్యర్థులున్న చోటా ఓటమి తప్పలేదు. భాజపా, కాంగ్రెస్ విజయం సాధించిన స్థానాల్లో అధికం తెరాసవే కావడం, చాలా చోట్ల సిట్టింగ్ కార్పొరేటర్లు ఓడిపోవడం అధిష్ఠానాన్ని ఆలోచనలో పడేసింది.

కారణాలేంటి?

ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీలో విస్తృతస్థాయి చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా భాజపా దూకుడును ఆశించిన స్థాయిలో అడ్డుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగిందనే భావన తెరాసలో వ్యక్తమైంది. ముఖ్యంగా మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ చేసిన ' సమాధుల కూల్చివేత' వ్యాఖ్యలు భాజపాకు మేలు చేశాయని అధికార పార్టీ భావిస్తోంది. నగరంలో స్థిరపడిన ఉత్తర భారతీయుల ఓట్ల సమీకరణలోనూ పార్టీ విఫలమైనట్టు విశ్లేషిస్తోంది. మొత్తంగా దూకుడు వైఖరితో ఆరెండు పార్టీలు లబ్ధిపొందాయని, తాము నష్టపోయామని విశ్వసిస్తోంది. భాజపా భారీగా పార్టీ శ్రేణులను మోహరించడం, ప్రధాని, కేంద్రమంత్రులు హైదరాబాద్​ రావడం ఆ పార్టీకి లాభించిందని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వంపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని పలు సందర్భాల్లో స్పష్టమైంది. దుబ్బాక ఉపఎన్నికలోనూ తెరాసకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఓటు వేశారనే ప్రచారం జరిగింది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించినట్టు పలితాలు చెప్పకనే చెప్పాయి. నిరుద్యోగ యువతలో పార్టీపై ఉన్న అసంతృప్తి దానికి తోడైంది. భాజపా వైపు యువత ఆకర్షితులవుతున్నారనే సమాచారం ప్రభుత్వానికి అందింది. బస్తీ వాసులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తల మద్దతుతో ఈ లోటుభర్తీ అవుతుందని తెరాస నమ్మింది. అది జరగలేదని ఫలితాలు వెల్లడిస్తున్నాయని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

హామీల ప్రభావమెంత?

హైదరాబాద్​ వరదలు అతలాకుతలం చేయగా సీఎం కేసీఆర్ స్పందించి రూ.550 కోట్ల సాయాన్ని ప్రకటించి, బాధితులకు తలా రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సాయం పంపిణీ సరిగా జరగలేదు. పేదల కంటే దళారులు లాభపడ్డారనే విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక పంపి కొనసాగించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అది బస్తీవాసుల్లో తెరాసపై అసంతృప్తికి కారణమైంది. ఆస్తి పన్ను సగానికి తగ్గింపు. 20 వేల లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా, వివిధ వర్గాలకు రాయితీలు వంటి హామీల ప్రభావం అన్ని డివిజన్లలో కనిపించలేదు. అసలు ఆ హామీలపై విస్తృత స్థాయిలో ప్రచారం జరగలేదు. ఇవన్నీ ప్రతికూల పలితాలకు కారణమయ్యాయని పార్టీవర్గాలు అంటున్నాయి.

సయోధ్య ఏదీ?

గత ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కొందరు కార్పొరేటర్లు సరిగా విధులు నిర్వర్తించలేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా వివాదాలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం తదితర కారణాల వల్ల వారిపై వ్యతిరేకత ఏర్పడింది. ఎన్నికలకు ముందు మంత్రి కేటీ రామారావు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి, అలాంటి వారికి ముందస్తు హెచ్చరికలు చేశారు. అయినా కొందరిలో మార్పు రాలేదు.

'ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు, కార్పొరేటరకు మధ్య సయోధ్య లోపించింది. ఎన్నికల ప్రచారంలో అది స్పష్టంగా కనిపించింది. కార్పొరేటర్లను మార్చాలని వారు డిమాండ్ చేశారు. అది జరగలేదు. దీంతో ఎమ్మెల్యేలు అభ్యర్ధులకు సహకరించలేదు. మరోవైపు అభ్యర్థులు ఎమ్మెల్యేలకు బదులుగా డివిజన్ ఇన్​ఛార్జులపై ఆధారపడ్డారు. ఉప్పల్, ఎల్బీనగర్ తదితర నియోజకవర్గాల పరిధిలో ఫలితాలపై ఇది ప్రభావం చూపింది' అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పుడేం చేద్దాం...

ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే భావన పార్టీ వర్గాల్లో ప్రస్తుతం వ్యక్తమవుతోంది. వచ్చే మార్చిలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్, వరంగల్ -నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. మార్చిలోనే వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ప్రస్తుతం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ నియోజకవర్గం భాజపా సిట్టింగ్ స్థానం. మరోవైపు భాజపా వరంగలలోనూ కొంత బలంగా ఉంది. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ దూకుడు వ్యూహంతో పోతుందని తెరాస అంచనా వేస్తోంది. దీనిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ ఎన్ని వ్యూహం అవసరమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది.

ఇవీచూడండి: మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.