ETV Bharat / state

Bachupally Road accident : చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు.. డ్రైవర్‌ నిర్లక్ష్యం, గుంతల రోడ్డుతో చిట్టి తల్లి ప్రాణాలు బలి

author img

By

Published : Aug 2, 2023, 5:14 PM IST

school student died in a road accident
school student died in a road accident

Delhi Public School student died in road accident : బుడిబుడి అడుగులు వేస్తూ నాన్నతో కలిసి స్కూల్‌కు బయళ్దేరిన ఆ చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో పలకరించింది. ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం, మాయదారి గుంతల రోడ్డు ఆ పసి హృదయం చావుకి కారణమయ్యాయి. మరికొద్ది నిమిషాల్లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవాల్సిన ఆ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. మాటలకందని ఈ విషాదం ఘటన కన్నవారిని ఎంతో కలచి వేసింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లిలో జరిగింది.

child died On hit by school bus At Bachupally : స్కూల్‌ బ్యాగ్‌ను వీపున ధరించి.. అమ్మ ఇచ్చిన లంచ్‌ బాక్సు తీసుకొని ముసిముసి నవ్వులతో ఆ చిన్నారి తల్లికి బాయ్‌ చెప్పింది. నాన్నతో కలిసి బుడిబుడి అడుగులతో స్కూల్‌కి బయళ్దేరింది. నాన్న చెప్పే కబుర్లును వింటూ ఈ స్కూటీపై ఎంచక్కా స్కూల్‌కు వెళ్తోంది. మరికొద్ది నిమిషాల్లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవాల్సి ఆ చిన్నారిని ఇంతలో ఓ స్కూల్‌ బస్సు మృత్యువు రూపంలో పలకరించింది. ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఆ చిన్నారి పసి హృదయం బస్సు చక్రాల కింద నలిగిపోయింది.

తన కళ్ల ముందు తన గారాల పట్టి బస్సు చక్రాల కింద నలిగిపోవడం చూసి ఆ కన్న తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ప్రమాదంలో తన చేతిని కోల్పోయినా సరై తన కుమార్తెను పట్టుకొని ఆ తండ్రి విలపించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. అప్పుడే తనను అప్యాయంగా కౌగిలించుకొని ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె మృత్యువాత పడటంతో ఆ తల్లిని ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించగా.. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని బాచుపల్లి పరిధిలో రెడ్డీస్‌ ల్యాబ్స్ కంపెనీ వద్ద కిశోర్‌ అనే వ్యక్తి తన కుమార్తెను పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. రోడ్లు గుంతలుగా మారడంతో బైక్‌ స్కిడ్‌ అయ్యి తండ్రి, కుమార్తె ఇద్దరూ కింద పడిపోయారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఏ స్కూల్‌ బస్సు చిన్నారి దీక్షతపై నుంచి వెళ్లిపోయింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

school student died in a road accident : దీక్షిత బౌరంపేట్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. ప్రమాదంలో కిశోర్‌కు కుడి చేయికి బలమైన గాయమైందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్ రహీంను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం, రోడ్లు గుంతలుగా మారడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Boinpally road accident : ఇదే తరహాలో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో జరిగిన ఘటనలో తండ్రీ, కుమార్తె తీవ్రంగా గాయపడగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్‌ఎన్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న వైష్ణవి తన తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తోంది. కొంపల్లి నుంచి బోయిన్‌పల్లి బస్టాప్‌ వరకు వెళ్తుండగా బోయిన్‌పల్లి ప్రియదర్శిని హోటల్ వద్ద వాహనం అదుపుతప్పింది.

ఈ క్రమంలో ఇద్దరూ కిందపడగా.. సుచిత్ర వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌ వీరి పైనుంచి వెళ్లింది. ప్రమాదంలో వైష్ణవి నడుము భాగం, తలకు తీవ్ర గాయాలు కావటంతో కోమాలోకి వెళ్లిపోయింది. వైష్ణవితో పాటు తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.