ETV Bharat / state

రుణాలపై తొలగని సందిగ్ధం.. 'జూన్​' గండం గట్టెక్కేదెలా..?

author img

By

Published : May 31, 2022, 5:28 AM IST

రుణాలపై తొలగని సందిగ్ధం.. 'జూన్​' గండం గట్టెక్కేదెలా..?
రుణాలపై తొలగని సందిగ్ధం.. 'జూన్​' గండం గట్టెక్కేదెలా..?

అప్పులకు కేంద్రం నుంచి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరీక్షణ కొనసాగుతోంది. రుణాలపై అభ్యంతరాలకు వివరణలు, అడిగిన పూర్తి సమాచారం... ఇచ్చినప్పటికీ ఇంకా అనుమతులు లభించలేదు. దీంతో నిధుల సర్దుబాటు రాష్ట్ర సర్కార్‌కు సంక్లిష్టంగా మారింది. వానాకాలం రైతుబంధు చెల్లింపులు చేయాల్సిన నేపథ్యంలో జూన్ నెల మరింత భారం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వం రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల సంప్రదింపులు కొనసాగుతున్నా ఈ అంశం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో జూన్‌లో వేతనాలు చెల్లింపులతో పాటు విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణపై ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్‌లోనే సుమారు రూ.20 వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండటంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులతో పాటు సబ్సిడీలు సహా విధిగా ప్రతినెలా చెల్లింపులు చేయాల్సిన జాబితాలో ఉన్నాయి. వీటికే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతోపాటు వానాకాలం రైతుబంధుకు రూ.7600 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూన్‌లో రైతు బంధు ఇవ్వడం ద్వారా పెట్టుబడి తోడ్పాటు అందుతుందని భావించిన ప్రభుత్వం నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం సొంత రాబడులతో పాటు రుణాలపై ఆధారపడి బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఏడాది బడ్జెట్‌ పరిధిలో, బడ్జెట్‌ వెలుపల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్ల అభివృద్ధి రుణాలను సమీకరించుకోవడానికి ప్రతిపాదించింది. ఇందులో జూన్‌ నెలాఖరు నాటికి రూ.11 వేల కోట్లను బాండ్ల విక్రయం ద్వారా మార్కెట్‌ రుణాలను తీసుకునేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.270 కోట్లకు మించి సమీకరించలేకపోయింది. ఈ క్రమంలో సొంత పన్నుల రాబడి, కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటాతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతో పాటు ఇతర చెల్లింపులపై ప్రభావం పడింది. వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం నెలకొంది. దీంతో నెలలో మొదటివారం అంటేనే ఆర్థికశాఖ అధికారులు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పలు జిల్లాల్లో రెండో వారానికి గాని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా విధిగా చేయాల్సిన చెల్లింపులకు సర్దుబాట్లు తప్పడంలేదు.

రూ.10 వేల కోట్లకు మించని రాబడి

రాష్ట్రానికి ప్రధానంగా పన్నులు, పన్నేతర రాబడి ద్వారా మే నెలలో రూ.10 వేల కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అంచనా వేసింది. స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.1200 కోట్లు, వాణిజ్య పన్నులశాఖ ద్వారా రూ.5500 కోట్లు, ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.1100 కోట్లు, కేంద్ర పన్నులవాటా, కేంద్ర పథకాల ద్వారా రూ.1000 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా వ్యయం మాత్రం దాదాపు రెట్టింపుగా ఉండనుంది. పన్నేతర రాబడి నామమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌లో విధిగా వ్యయం చేయాల్సిన వాటికి నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. శాఖలవారీగా పన్నురాబడులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఇది నామమాత్రంగానే ఉంది. ఫలితంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలే కీలకంగా మారాయి. మే నెలాఖరులోనైనా రూ.2000 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా సమీకరించుకోవాలని భావించినా ప్రయత్నాలు ఫలించలేదు. జూన్‌ మొదటివారంలో బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతిస్తే రెండు విడతలుగా కనీసం రూ.4000 కోట్లు అంతకంటే ఎక్కువ సమీకరించుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ భావిస్తోంది. దళితబంధు, రైతు బంధు, రైతుబీమా, విద్యుత్‌ సబ్సిడీలు, ఆసరా, బియ్యం సబ్సిడీ, స్కాలర్‌షిప్‌లు, కల్యాణలక్ష్మిలతో పాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు అవసరం. ఈ నెల కూడా వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం తప్పేలాలేదని ఆర్థికశాఖ భావిస్తోంది. కేంద్రంతో సంప్రదిస్తున్నా స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్రప్రభుత్వం తరఫున అన్నిఅంశాలను వివరించినా సందిగ్ధం కొనసాగుతుండటంపట్ల ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ మొదటివారంలోనైనా స్పష్టత వచ్చేనా అని ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి..

Govt Loans: రుణాలకు అనుమతివ్వని కేంద్రం.. సందేహాల నివృత్తిలో రాష్ట్ర సర్కార్

వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్‌ పూలింగ్‌ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.