ETV Bharat / state

పంట రుణాల కోసం.. రైతుల కాళ్లరుగుతున్నాయ్‌!

author img

By

Published : Jan 9, 2023, 8:41 AM IST

crop loans
crop loans

Crop Loans Issues: పంట రుణాల కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడూ వివిధ సాకులు చెబుతూ బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు అరకొరగానే యాసంగిలో పంట రుణాలు ఇచ్చాయి.

Crop Loans Issues: యాసంగి సీజన్‌లో ఇప్పటికే మూడు నెలలు గడచిపోయాయి. పంటరుణాల పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటికే 15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ నెలాఖరుతో విత్తనాలు, నాట్లు వేయడం పూర్తవుతుందని అంచనా. ప్రభుత్వం రైతుబంధు కింద సాయం చేసినా బ్యాంకులేమో పంట రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.వందకు రూ.2-5 దాకా వడ్డీ చెల్లించేలా ఒప్పంద పత్రాలు రాసి భూములను తాకట్టు రిజిస్ట్రేషన్‌ చేయిస్తేనే ప్రైవేటు వ్యాపారులు రైతులకు రుణాలిస్తున్నట్లు ‘తెలంగాణ రాష్ట్ర ఉపశమన కమిషన్‌’ అధ్యయనంలో తేలింది.

ఈ సీజన్‌లో రూ.27వేల కోట్లను పంటరుణాలుగా ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించింది. రుణాలను వేగంగా ఇస్తే సాగు పెట్టుబడులకు రైతులకు ఉపకరిస్తాయని తెలిపింది. క్షేత్రస్థాయిలో బ్యాంకులు సవాలక్ష కొర్రీలతో పంటరుణాలను సక్రమంగా ఇవ్వడం లేదు. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ 3 నెలల కాలం పంటసీజన్‌ పూర్తయినా రూ.9వేల కోట్ల వరకే ఇచ్చినట్లు అంచనా.

భూమి అమ్ముతున్నారని: పంటరుణం తీసుకునే రైతుల నుంచి రూ.లక్షన్నర వరకూ పూచీకత్తు అడగరాదని రిజర్వుబ్యాంకు గతంలో బ్యాంకులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పలు బ్యాంకులు దీన్ని అమలుచేయడం లేదు. రైతు నుంచి పట్టాదారు పాసుపుస్తకం తీసుకున్నాకే పంటరుణం ఇస్తున్నాయి. దీనికితోడు ధరణి పోర్టల్‌లో రైతు రెవెన్యూ ఖాతాను తెరిచి పంటరుణం ఇచ్చినట్లు నమోదు చేసి అకౌంట్‌ను స్తంభింప(ఫ్రీజ్‌) చేస్తున్నాయి.

అప్పుల పంపిణీ ఆలస్యం: ఆపై రుణం తీసుకున్న భూమిని ఎవరికీ అమ్మకూడదని స్పష్టం చేస్తున్నాయి. పంటరుణం తీసుకున్నాక ఇలా ఫ్రీజ్‌ చేసే అవకాశం ధరణిలో తమకు రావడం లేదంటూ కొన్ని బ్యాంకులు అప్పుల పంపిణీ ఆలస్యం చేస్తున్నాయి. ధరణి పోర్టల్‌ను తాము వినియోగించుకుని పంటరుణం ఇచ్చాక.. రైతు భూమి రెవెన్యూఖాతాను ఫ్రీజ్‌ చేసే సదుపాయం కల్పించాలని బ్యాంకర్లు రాష్ట్ర రెవెన్యూశాఖను కోరారు.

కొందరు రైతులు గతంలో పంటరుణం తీసుకున్నప్పుడు చూపిన భూమి విస్తీర్ణంకన్నా ధరణి పోర్టల్‌లో తక్కువగా కనిపిస్తోందని, వివరాలు సరిగా లేవని రుణాలివ్వకుండా తిరస్కరిస్తున్నారు. ఉదాహరణకు మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని ఒక బ్యాంకులో వెయ్యిమంది రైతులకు పంటరుణ ఖాతాలుంటే 150 మందికే ఈ యాసంగిలో రుణాలిచ్చినట్లు సిబ్బంది ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. పాత రుణం చెల్లించి రెన్యువల్‌ చేసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదని, రుణమాఫీ చేసేదాకా వచ్చేది లేదని చెపుతున్నారని ఆయన వివరించారు.

సింహభాగం చిన్నరైతులే..: రాష్ట్రంలో గత వానాకాలంలో 65 లక్షల మంది రైతులకు కోటీ 36లక్షల ఎకరాల భూములున్నట్లు వ్యవసాయశాఖ తాజాగా లెక్కలు తేల్చింది. వీరిలో ఎస్సీలు 8.54లక్షల మందికి 13.53లక్షల ఎకరాలు, గిరిజనులు 8.23లక్షల మంది వద్ద 19.29లక్షల ఎకరాలు, బీసీలు 34.81లక్షల మందికి 71.47లక్షల ఎకరాలున్నట్లు ఈ శాఖ వివరించింది.

వీరిలో అత్యధికశాతం పేదరైతులేనని.. రాష్ట్రంలో 16 లక్షల మందికి ఇంతవరకూ బ్యాంకులు ఒక్కసారి కూడా పంటరుణాలు ఇవ్వనందున అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులే తీసుకుని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. రుణమాఫీ లెక్కలు తీసుకున్నప్పుడు 36.68 లక్షల మందికే బ్యాంకులు రుణాలివ్వగా వీరిలో 5.66 లక్షల మంది రుణాల సొమ్మును ప్రభుత్వం బ్యాంకులకు తిరిగి చెల్లించింది. మిగిలిన 31 లక్షల మందిలో చాలామంది పాతరుణం కట్టి కొత్తగా తీసుకోవడం లేదని వారిని ఎగవేతదారుల జాబితాల్లో బ్యాంకులు చేర్చడం రుణాల పంపిణీ చాలా తక్కువగా ఉందని సీనియర్‌ అధికారి వివరించారు.

గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లోనూ నిర్దేశిత లక్ష్యం రూ.40,718 కోట్లలో రూ.23,793.15 కోట్లు(58.43 శాతమే) బ్యాంకులు పంపిణీ చేశాయి. గతేడాది(2021) వానాకాలం సీజన్‌లో రూ.24,898.25 కోట్లు ఇవ్వగా ఈ ఏడాది వానాకాలంలో అంతకన్నా రూ.1,105 కోట్లు తక్కువగా పంపిణీ చేయడం గమనార్హం.

ఇవీ చదవండి: ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్​ ఆవిర్భావ సభ.. అక్కడే ఎందుకు?

పోలీసులు ఇచ్చిన 'టీ'ని తిరస్కరించిన అఖిలేశ్​.. విషం కలిపారన్న అనుమానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.