ETV Bharat / state

నేడే లోకేశ్‌ యువగళానికి తొలి అడుగు.. ఉదయం 11.03 గంటలకు ముహూర్తం

author img

By

Published : Jan 27, 2023, 9:16 AM IST

yuva galam
యువగళం

LOKESH YUVAGALAM PADAYATRA : ప్రజల గుండె చప్పుడు వినేందుకు.. వారి కష్టాలు తెలుసుకుని, కన్నీళ్లు తుడిచి.. భరోసా ఇచ్చేందుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సిద్ధమయ్యారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా చూసేందుకు ఆయన పయనమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ నేతా తిరగనంత స్థాయిలో ఏకంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు నేడు శ్రీకారం చుడుతున్నారు.

LOKESH YUVAGALAM PADAYATRA : తెలుగు తమ్ముళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న.. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకుని.. ఒకరోజు ముందే కుప్పం చేరకున్నారు. లోకేశ్‌కు.. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం వద్ద పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.

మహిళా కార్యకర్తలు.. హారతులిచ్చారు. లోకేశ్‌ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. యాత్రను పురస్కరించుకుని.. కుప్పం పట్టణం ఇప్పటికే పసుపుమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. పండగ వాతావరణం నెలకొంది. పాదయాత్ర తొలి అడుగువేసే వరదరాజస్వామి గుడి పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి.

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్‌ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద తొలి అడుగు వేయనున్నారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఏపీలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలిరానున్నారు. సభ నిర్వహణకు వారం కిందటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పాలకొల్లు, రేపల్లె ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌, టీడీపీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. పాదయాత్ర సందర్భంగా తొలి రోజు జరిగే పూజా కార్యక్రమం, బహిరంగ సభకు లోకేశ్‌ అత్తామామలు వసుంధర, బాలకృష్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు హాజరు కానున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకుని: లోకేశ్‌ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుపతి నుంచి ర్యాలీగా కుప్పం బయల్దేరారు. చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల మీదుగా ఆయన కాన్వాయ్‌ సాగింది. వందల మంది కార్యకర్తలు ర్యాలీగా లోకేశ్‌ వెంట వచ్చారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి వెంట ఉన్న మండల కేంద్రాలు, పట్టణాల మీదుగా వెళ్తే టీడీపీ శ్రేణుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆలస్యం అవుతుందని భావించిన లోకేశ్‌.. బైపాస్‌ మీదుగానే వాహనశ్రేణి వెళ్లేలా చూడాలని సూచించారు.

పలమనేరు దాటాక కుప్పం- క్రిష్ణగిరి జాతీయ రహదారిలో కొందరు కార్యకర్తలు కాన్వాయ్‌ను ఆపడంతో ఆయన అభివాదం చేశారు. ఫిబ్రవరిలో మరోసారి వస్తానని మాటిచ్చారు. సాయంత్రం 5.42 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ మహిళలు హారతులతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.30 గంటలకే కుప్పం రావాల్సి ఉండగా కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో సుమారు 3 గంటల జాప్యం జరిగింది.

అనంతరం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలు, ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో ఆయన మాట్లాడారు. భారీగా తరలివచ్చిన యువత లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వారందరితో ఓపికగా మాట్లాడి.. గంటకుపైగా ఫొటోలు దిగారు. పలువురిని పేర్లతో పలకరించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు.

వేదికపై 300 మంది కూర్చునేలా: శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభలో.. వేదికపై 300 మంది నాయకులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుప్పం నాయకులు కలిపి మొత్తం 300 మంది వేదికపై ఉండనున్నారు. బహిరంగసభ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు టీడీపీ నాయకులే 400 మంది వాలంటీర్లను మోహరించారు. వీరికితోడు అదనంగా మరో 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండనున్నారు. బహిరంగ సభలో నారా లోకేశ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగిస్తారని టీడీపీ వర్గాల సమాచారం.

400 రోజులూ లోకేశ్‌ వెంటే వాలంటీర్లు : లోకేశ్‌ పాదయాత్ర జరగనున్న 400 రోజులూ ఆయన వెంట 400 మంది వాలంటీర్లు ఉండనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలను గుర్తించిన తెలుగుదేశం అధినాయకత్వం.. వారిని వాలంటీర్లుగా నియమించింది. వీరి కోసం లోకేశ్‌ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్‌ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అక్కడే భోజన ఏర్పాట్లూ చేశారు. వీరికి ఎలాంటి లోటూ రాకుండా చూసుకునే బాధ్యతను చిత్తూరు జిల్లాలోని తెలుగు యువత నాయకులు, కార్యకర్తలకు అప్పగించారు.

పాదయాత్ర జరిగే 400 రోజులూ కాన్వాయ్‌లోనే లోకేశ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పక్కనే వాలంటీర్లు బస చేస్తారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు దిగినా ఆయనను రక్షించడానికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పాదయాత్ర, బహిరంగ సభ వద్ద 500 మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది.

ఏఎస్పీ జగదీశ్‌, పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షణ సాగనుంది. లోకేశ్‌ వెంట మాజీ మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, నాయకులు బి.వి.రాముడు, పట్టాభి, బీసీ జనార్దనరెడ్డి, వంగలపూడి అనిత ఉన్నారు.

లక్ష్మీపురం ఆలయం సెంటిమెంటు : కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో కొలువైన ప్రసన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో టీడీపీ కార్యక్రమాలను ప్రారంభించడాన్ని సెంటిమెంటుగా కొనసాగిస్తున్నారు. గతంలో అనేక దఫాలు చంద్రబాబు కుప్పం పర్యటనలు, నామినేషన్లు, ర్యాలీలకు సంబంధించి వరదరాజస్వామి సన్నిధిలో పూజల తర్వాతే కార్యక్రమాలను ప్రారంభించడాన్ని ఆనవాయితీగా చేపట్టారు.

గతంలో పలుమార్లు కుప్పంలో పర్యటించిన లోకేశ్‌.. ఎన్నికల ప్రచారాలు, గ్రామ పర్యటనలనూ లక్ష్మీపురంలో పూజలతోనే ప్రారంభించారు. శుక్రవారం యువగళం పాదయాత్రనూ వరదరాజస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం.. లక్ష్మీపురం నుంచి ప్రారంభిస్తున్నారు.

పని చేయని ఫ్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లు : ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకుడు కుప్పం వస్తారంటే ఫ్లెక్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లు బిజీ బిజీగా ఉంటాయి. ఏమైందో ఏమో.. రెండు రోజులుగా కుప్పంలో ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌లేవీ పని చేయలేదు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు వాడకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారులు దాడులు చేస్తారన్న సమాచారంతో ప్రింటింగ్‌ పనులు చేయలేకపోయామని యజమానులు చెబుతున్నారు.

నాడు అధినేత.. నేడు యువ నేత : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం.. పార్టీ పరంగా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేదికగా నిలుస్తోంది. గతంలో పార్టీ పరంగానూ.. టీడీపీ పాలనలోనూ రాష్ట్ర స్థాయిలో అమలు చేసిన అనేక కార్యక్రమాలకు చంద్రబాబు కుప్పంలోనే శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పంలో ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘వస్తున్నా మీకోసం’ పేరిట పాదయాత్ర చేపట్టిన ఆయన కుప్పంలో ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు.

కుప్పంలో ర్యాలీ ప్రారంభించి 45 కిలోమీటర్ల మేర బుల్లెట్‌ నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ పటిష్ఠతతోపాటు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని ప్రయోగాలకు నిలయంగా మార్చారు. ‘శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, నీరు- మీరు, నీరు- చెట్టు’ తదితర కార్యక్రమాలను కుప్పంలోనే ప్రారంభించారు. బిందు సేద్యం పథకాన్ని 1999లో ముఖ్యమంత్రిగా ఆయన తొలుత కుప్పంలోనే అమలుచేసి.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.