సమస్త శక్తుల పోరాటంతోనే రాష్ట్రంలో 16 ప్రజాసంఘాలపై ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేత సాధ్యమైందని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) స్పష్టం చేసింది. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు ఏడాది కాలం పాటు 16 ప్రజాసంఘాలపై ప్రభుత్వం విధించిన అణచివేత.. మూడు నెలల తిరగకముందే ఎత్తివేసిందని పేర్కొంది. ఈ మేరకు ప్రజాస్వామికి పౌర హక్కుల రక్షణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మధ్య రీజినల్ బ్యూరో ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఓ లేఖను విడుదల చేసింది.
సీఎస్కు లేఖ
భీమా కోరేగావ్ ఘటన అనంతరం సామాజిక రాజకీయ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు బనాయిస్తూ 16 ప్రజాసంఘాలపై ఏడాది పాటు నిషేధం విధించిందని మధ్య రీజినల్ బ్యూరో మావోయిస్టు అధికారి ప్రతినిధి ప్రతాప్ లేఖలో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఎస్ఐఏ(జాతీయ నిఘా సంస్థ).. సోదాలు నిర్వహించిందని చెప్పారు. 64మందిపై కేసు నమోదు చేసిందన్నారు. దీనిని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు రచయితలు, కళాకారులు, మేధావులు.. చట్ట రహిత నిషేధాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర సీఎస్కు లేఖ రాశారని వివరించారు. వారి చొరవతోనే 3నెలలలోపే నిషేధం ఎత్తివేసిందని లేఖలో వెల్లడించారు.
భీమా కోరేగాం తప్పుడు కేసులో విచారణలో ఉన్న సామాజిక రాజకీయ కార్యకర్తలందరినీ జైలులోనే చంపడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని ప్రతాప్ లేఖలో ఆరోపించారు. దీని ద్వారా దేశంలో ఎంతటి నిరంకుశ పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడాలని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దళిత బంధుపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ