తెలంగాణ- చత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతమైన పెసర్లపాడులో నిన్న జరిగిన ఎన్కౌంటర్ భూటకమని మావోయిస్టులు స్పష్టం చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా- తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న పోలీసు బలగాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మావోయిస్టు నేత ఆజాద్ లేఖలో హెచ్చరించారు.
ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల వక్రబుద్ధికి త్వరలో గుణపాఠం చెబుతామంటూ లేఖలో పేర్కొన్నారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టుల దళంపై దాడి జరిగిందన్నారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లతో పార్టీని నిర్మూలించలేరన్నారు. ఈ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ చేపట్టాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
Encounter At Telangana- Chhattisgarh Border : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
Maoists Died At Charla : చర్ల మండలానికి 25 కి.మీ. దూరంలో కుర్ణవల్లి - పెసర్లపాడు అటవీప్రాంతంలో 6 గం. నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు చెప్పారు.
ఘటనాస్థలిలో 5 తుపాకీలు, మావోయిస్టులకు సంబంధించిన కొంత సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం రోడ్డు మార్గం ద్వారా ట్రాక్టర్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు వరంగల్ నుంచి ఫోరెన్సిక్ వైద్యనిపుణులు భద్రాచలం వస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: