ETV Bharat / sports

సత్తా చాటిన సింధు.. క్వార్టర్స్​కు పూజా రాణి

author img

By

Published : Jul 28, 2021, 4:45 PM IST

Updated : Jul 28, 2021, 5:27 PM IST

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స 2020

టోక్యో ఒలింపిక్స్​లో ఆరో రోజు భారత్​కు మిశ్రమ ఫలితాలు లభించాయి. హాకీలో మహిళల జట్టు పరాజయం చెందగా.. బ్యాడ్మింటన్​లో సింధు ఆశలు రేకెత్తిస్తోంది. ఆర్చరీలో దీపికా ఫర్వాలేదనిపించింది. మొత్తంగా ఆరో రోజు ఫలితాలు ఇవే..

టోక్యో ఒలింపిక్స్​ ఆరో రోజు భారత బృందం నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల హాకీ జట్టు గ్రేట్​ బ్రిటన్​ చేతిలో పరాజయం పాలైంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో తరుణ్​దీప్​ రాయ్​, ప్రవీణ్​ జాదవ్​ కథ ముగిసింది. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. బాక్సింగ్ 75కేజీల విభాగంలో పుజా రాణి క్వార్టర్​ ఫైనల్​కు అర్హత సాధించింది.

ఒలింపిక్స్​లో బుధవారం ఫలితాలు ఇవే..

హాకీలో పరాభవం..

  • డిఫెండింగ్​ ఛాంపియన్​ గ్రేట్​ బ్రిటన్​తో జరిగిన మ్యాచ్​లో భారత మహిళల హాకీ జట్టు చెత్తగా ఓడింది. దీంతో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది రాణీ రాంపాల్ సేన. ప్రత్యర్థి జట్టులో హన్నా మార్టిన్​ (2వ, 19వ నిమిషం), లిలీ ఓస్లీ (41న నిమిషం), గ్రేస్​ బాల్స్డాన్​ (57వ నిమిషం) గోల్స్​ నమోదు చేశారు. భారత్ తరఫున షర్మిలా దేవి (23వ నిమిషం) మాత్రమే గోల్​ సాధించింది. నాకౌట్​ స్టేజీకి క్వాలిఫై కావాలంటే వచ్చే రెండు మ్యాచ్​లను తప్పనిసరిగా గెలవాలి రాంపాల్ సేన. ఇప్పటికే మూడు మ్యాచ్​లను ఓడిన భారత్​కు ఇది కష్టమనే చెప్పాలి. నెదర్లాండ్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో 1-5తో ఓడిన భారత్​.. జర్మనీతో మ్యాచ్​లో 0-2తో పరాజయం చవిచూసింది. ఇక తదుపరి మ్యాచ్​ శుక్రవారం ఐర్లాండ్​తో జరగనుంది.

ఆర్చరీ..

  • ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్​దీప్​ రాయ్​ తొలి రౌండ్​లో విజయం సాధించాడు. ఉక్రెయిన్​ ఆటగాడు ఓలెక్సీ హన్​ బిన్​తో జరిగిన మ్యాచ్​లో 6-4తో గెలుపొందాడు. అప్పటివరకు బాగానే ఆడిన తరుణ్​దీప్​ తదుపరి రౌండ్​లో తేలిపోయాడు. ఇటలీకి చెందిన షన్నీ ఇటే చేతిలో 6-5తో ఓడిపోయాడు.
  • మరో ఆటగాడు ప్రవీణ్​ జాదవ్​ కూడా అచ్చం ఇలాగే తొలి మ్యాచ్​లో గెలిచి.. తదుపరి రౌండ్​లో పరాజయం పాలయ్యాడు. దీంతో ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరి కథ ముగిసింది.
  • మహిళల వ్యక్తిగత విభాగంలో ఆర్చర్ దీపికా కుమారి ఫర్వాలేదనిపించింది. తొలుత భూటాన్​ అథ్లెట్ కర్మాపై 6-0తో, తదుపరి రౌండ్​లో అమెరికా ప్లేయర్​ ఫెర్నాండెజ్​పై 6-4తో గెలుపొందింది. ఫలితంగా ఎలిమినేషన్​ రౌండ్ ఆఫ్-8కు అర్హత సాధించింది.

సింధు ముందడుగు..

  • భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు ప్రి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​లో హంగ్​కాంగ్​ ప్లేయర్​ చెయింగ్​పై 21-9, 21-16తో గెలుపొందింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని ఎక్కడ కోలుకోలేకుండా చేసింది సింధు. సింధు తన తదుపరి మ్యాచ్​లో డెన్మార్క్​ ప్లేయర్​ మియా బ్లిచ్​ఫెల్డ్ట్​తో తలపడనుంది.

క్వార్టర్స్​కు పూజా..

  • మహిళల 75కేజీల విభాగంలో భారత బాక్సర్​ పూజారాణి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. అల్జీరియాకు చెందిన ఇచ్రక్​ చైబ్​పై 5-0తో గెలుపొంది నాకౌట్​కు అర్హత సాధించింది.

రోయింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన

  • ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్‌ సెమీ ఫైనల్‌ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు. కానీ వారి ఆటతీరును అందరూ ప్రశంసిస్తున్నారు. పురుషుల స్కిఫ్‌ (సెయిలింగ్‌)లో కేసీ గణపతి, వరుణ్‌ టక్కర్‌ జోడీ మూడు రేసుల్లో 18, 17, 19 స్థానాల్లో నిలిచింది. మొత్తంగా 18వ స్థానం సాధించారు.

ఇదీ చదవండి: Olympics: వాటిని అధిగమించి 'టోక్యో' గెలిచింది!

Last Updated :Jul 28, 2021, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.