ETV Bharat / sports

ఇంగ్లాండ్​ 2.0తో బుమ్రా సేన ఢీ.. గెలిస్తే చరిత్రే.. కానీ..!

author img

By

Published : Jul 1, 2022, 5:30 AM IST

ind vs eng
ind vs eng test series 2022

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది. ఈ కీలక పోరులోనూ గెలుపొంది గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్‌ కైవసం చేసుకోవాలని, ఇంగ్లీష్‌ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని టీమ్​ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌.. చివరి టెస్టులో నెగ్గి సిరీస్‌ సమం చేయాలని పట్టుదలగా ఉంది.

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా అప్పట్లో వాయిదా పడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచినా, మ్యాచ్‌ డ్రాగా ముగిసినా సిరీస్‌ భారత్ వశమవుతుంది. ఇంగ్లాండ్‌ గెలిస్తే సిరీస్‌ డ్రాగా ముగుస్తుంది. 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఫాస్ట్‌ బౌలర్‌ భారత టెస్టు జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. తద్వారా కపిల్‌దేవ్‌ సరసన జస్‌ప్రీత్‌ బుమ్రా నిలవనున్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా భారత టెస్టు జట్టుకు 36వ కెప్టెన్‌ కావడం గమనార్హం.

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు భారత్‌కు కీలక సవాలే. బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్ గాయం కారణంగా దూరమవడం.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారినపడటం.. కోహ్లీ, పూజారా ఫామ్‌ లేమి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రోహిత్‌, కేెఎల్ రాహుల్‌ గైర్హాజరీలో శుభమన్‌ గిల్‌తో కలిసి ఛతేశ్వర్‌ పుజారా లేదా హనుమ విహారీ భారత ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. అసలైన పోరులోనూ సత్తా చాటాలని భారత్‌ కోరుకుంటోంది. మిడిల్‌ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌కు అండగా ఉన్నారు. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించనున్నాడు.

ఆశలన్నీ బౌలర్లపైనే: టీమ్‌ఇండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్‌ దళంపైనే ఆధారపడ్డాయి. అప్పుడు భారత బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్‌, ఓవల్‌ మ్యాచ్‌లను సొంతం చేసుకుంది. ప్రధాన పేసర్లు.. జస్​ప్రీత్ బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 18, మహ్మద్‌ సిరాజ్‌ 4 మ్యాచ్‌ల్లో 14, మహ్మద్‌ షమి 3 మ్యాచ్‌ల్లో 14, శార్దూల్‌ ఠాకూర్‌ 2 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

పటిష్ఠంగా ఇంగ్లాండ్: మరోవైపు ఇంగ్లాండ్‌ గతవారమే న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి జోరుమీదుంది. న్యూజిలాండ్‌తో చివరి టెస్టులో ఆడని సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ స్థానంలో ఎంపికైన శామ్ బిల్లింగ్స్‌‌కి కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, కెప్టెన్‌ స్టోక్స్‌లతో ఇంగ్లాండ్‌ మిడిలార్డర్‌ దుర్భేద్యంగా ఉంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ లీచ్‌, సీనియర్‌ పేసర్‌ బ్రాడ్‌, యువ సంచలనం మాథ్యూ పోట్స్‌లతో బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది. గతేడాది భారత జట్టుతో నాలుగు టెస్టులు ఆడిన ఇంగ్లాండ్‌ జట్టుకు ఇప్పటి టీమ్‌కు పోలికే లేదు. ఇంగ్లిష్‌ జట్టులో కెప్టెన్‌తో సహా ఏడుగురు మారారు. అప్పుడు ఆడిన జో రూట్‌, ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో, జేమ్స్‌ అండర్సన్‌ మాత్రమే ఐదో టెస్టులో ఆడనుండటం గమనార్హం.

గెలిస్తే చరిత్రే!: 2007 తర్వాత.. ఇంగ్లాండ్​పై ఇంగ్లాండ్​లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్​ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం టీమ్​ ఇండియాకు ఉంది. చివరి టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా ఇది సాధ్యం అవుతుంది. ఇక భారత్ చివరి టెస్టు​ ఆడుతున్న బర్మింగ్​హామ్​లో టీమ్​ ఇండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్​ కూడా గెలవలేదు. మొత్తం 7 ఆడగా.. ఒకటి డ్రా చేసుకొని, ఆరింట్లో ఓడింది. ఈ మ్యాచ్​లో గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే!

ఇదీ చూడండి: కోహ్లీ vs అండర్సన్‌.. ఇదే చివరి పోరు! ఇప్పటివరకు పైచేయి అతడిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.