ETV Bharat / sports

ఇన్​స్టాగ్రామ్​​లో గంగూలీని అన్​ఫాలో చేసిన కోహ్లీ.. కారణం అదేనా?

author img

By

Published : Apr 17, 2023, 8:50 PM IST

virat instagram controversy
virat instagram controversy

సౌరభ్ గంగూలీ విరాట్​ కోహ్లీల మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. గత శనివారం దిల్లీ క్యాపిటల్స్, ​రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్​లో దాదా-విరాట్​ల మధ్య నడుస్తోన్న వివాదం స్పష్టంగా కనిపించింది.

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​​ విరాట్​ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీల వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా విరాట్​ కోహ్లీ తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో గంగూలీని అన్​ఫాలో చేశాడు. దీనిపై సోషల్​ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శనివారం గంగూలీ చేసిన దానికి.. కోహ్లీ ప్రతీకార చర్యగా ఇలా చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజా ఇన్​స్టాగ్రామ్​ పరిణామంతో అభిమానుల సందేహాలు మరింత బలపడ్డాయి. ఏదేమైనా వీరిద్దరి మధ్య గొడవ.. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని పలువురు క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్​ జరిగింది. మ్యాచ్​ అయిపోయాక ఇరు జట్లు కరచాలనం చేసుకునేందుకు మైదనంలోకి వచ్చాయి. ఈ క్రమంలో రెండు టీమ్స్​ షేక్​ హ్యాండ్స్​ ఇస్తున్న సమయంలో విరాట్​- సౌరభ్​ ఇద్దరూ దూరంగా వెళ్లిపోయారు. గంగూలీ దగ్గరికి వచ్చిన సమయంలో కోహ్లీ.. దిల్లీ కోచ్‌ పాంటింగ్‌తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ కోహ్లీని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు. అయితే వారిద్దరూ కావాలనే ఇలా చేశారా అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో వారిద్దరి మధ్య ఇంకా కోల్డ్​ వార్​ నడుస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

మ్యాచ్ మధ్యలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫీల్డింగ్ చేస్తుండగా విరాట్ కోహ్లీ.. దాదావైపు కోపంగా ఓ లుక్ ఇచ్చాడని అభిమానులు ఓ ఫొటోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాదా పట్ల విరాట్​ ప్రవర్తించిన తీరును కొందరు విమర్శిస్తుంటే.. కోహ్లీ ఫ్యాన్స్​ మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

గొడవకు అసలు కారణం...
టీ20 ప్రపంచకప్ 2021​ అనంతరం విరాట్.. టీ20 ఫార్మాట్​ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. కానీ 2023 వన్డే ప్రపంచ కప్​ దాకా కెప్టెన్​గా కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అప్పట్లో తెలిపాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్​లో ఒకే జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఎందుకంటూ.. బీసీసీఐ విరాట్​ను తప్పించి రోహిత్​కు పగ్గాలు అప్పగించింది. అదే ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సీరీస్​ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు.

కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు కోహ్లీకి ముందుగానే చెప్పినట్లు అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్​ గంగూలీ పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కోహ్లీ అన్నాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా సీరీస్​కు ముందు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కోహ్లీ పేర్కొనడం క్రీడా వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో దాదా కోహ్లీల మధ్య వివాదానికి బీజం పడినట్లైంది.

గతంలో గంభీర్​తో వాగ్వాదం..
వివాదాలు విరాట్​కు కొత్తేం కాదు. సాధారణంగా కోహ్లీ గ్రౌండ్​లో అగ్రెసివ్​గా కనిపిస్తాడు. 2013 ఐపీఎల్​ ఆరో సీజన్​లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో రజత్ భాటియా కలగచేసుకొని వారిద్దరినీ ఆపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.