ETV Bharat / sports

Ind Vs NZ World Cup : కివీస్​తో కీలక పోరు.. ఈ ముగ్గురు మొనగాళ్లను అడ్డుకుంటారా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 1:59 PM IST

Ind Vs NZ World Cup
Ind Vs NZ World Cup

Ind Vs NZ World Cup : 2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. పాయింట్ల పట్టికలో టాప్​ పొజిషన్​లో ఉన్న టీమ్ఇండియా ఆదివారం (అక్టోబర్‌ 22న) న్యూజిలాండ్​తో తలపడనుంది. రానున్న మ్యాచ్​ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలబాలాలు, కొన్నేళ్లుగా భారత్‌పై కివీస్ ఎలా ఆధిపత్యం చలాయించిందో ఓ లుక్కేద్దాం.

Ind Vs NZ World Cup : 2023 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. వరుస విజయాలను తమ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో టాప్​ పొజిషన్​లో ఉన్న టీమ్ఇండియా ఆదివారం (అక్టోబర్‌ 22న) న్యూజిలాండ్​తో తలపడనుంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను ఎదుర్కోవడం భారత్‌కు కొద్దిగ సవాలుతో కూడుకున్న పనే. అయితే కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్‌ ఆధిపత్యం చలాయించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్‌.. భారత్‌కు షాకిచ్చిన విషయాన్ని క్రికెట్​ లవర్స్ ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. రానున్న మ్యాచ్​ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలబాలాలు, కొన్నేళ్లుగా భారత్‌పై కివీస్ ఎలా ఆధిపత్యం చలాయించిందో ఓ లుక్కేద్దాం.

World Cup 2023 Team India: వరుస విజయాలతో టీమ్‌ఇండియా బలంగానే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా మన ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లీ, కేఎల్ రాహుల్​ సూపర్​ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే అఫ్గాన్‌పై సెంచరీ చేసిన హిట్​మ్యాన్​.. పాక్‌పై కూడా భారీ ఇన్నింగ్స్​ను ఆడాడు. బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లోనూ అర్ధ శతకం సాధించాడు.

మరోవైపు కోహ్లీ.. పాక్‌ మ్యాచ్​ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో రాణించాడు. బంగ్లాదేశ్‌పై ఓ సెంచరీ కూడా బాదాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్​ ఆడుతూ జట్టుకు స్కోర్​ విలువైన స్కోర్​ అందిస్తున్నాడు. రానున్న మ్యాచ్​లో ఈ ముగ్గురు మొనగాళ్లు రాణిస్తే ఇక కివీస్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. గిల్, శ్రేయస్ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. ఆడినంతలో వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో వీరు కూడా టాప్‌గేర్‌లోకి వస్తే భారత్ బ్యాటింగ్‌కు ఇక తిరుగుండదు.

లోయర్‌ ఆర్డర్‌లో జడేజా ఎలాగూ ఉండనే ఉన్నాడు. గాయం కారణంగా హార్దిక్ కివీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడం అనేది భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. ఇక, బౌలింగ్‌లో బుమ్రా,కుల్‌దీప్‌,జడేజా యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ సిరాజ్ జట్టు విజయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా సమష్టిగా రాణిస్తే ఇక కివీస్‌ను చిత్తు చేయడం కష్టతరమైన పనేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఆ జోరుకు అడ్డు కట్ట వేసేనా?
2015, 2019లో వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. న్యూజిలాండ్​ తన కప్‌ కలను సాకారం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ప్రపంచకప్‌లోనైనా ఆ లోటును తీర్చుకోవాలని కివీస్‌ కసిగా ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీదుంది. విల్ యంగ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, లాథమ్, ఫిలిప్స్‌లతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్ స్ట్రాంగ్​గా ఉంది. వీరంతా కూడా మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లే.

చాప్‌మన్‌, మిచెల్ శాంట్నర్‌ కూడా తమ ఇన్నింగ్స్​తో మెరుపులు మెరిపిస్తున్నారు. రచిన్ రవీంద్ర, కాన్వే ఇప్పటికే సెంచరీలు బాదారు. విల్ యంగ్, ఫిలిప్స్‌, డారిల్ మిచెల్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో మ్యాట్‌ హెన్రీ, శాంట్నర్‌, ఫెర్గూసన్‌ అదరగొడుతున్నారు. ప్రస్తుతం శాంట్నర్ 11 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ ఎక్కువగా వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.

కివీస్​తో మన భారత్​..
2003 ప్రపంచకప్‌లో సౌరభ్‌ గంగూలీ నాయకత్వంలోని భారత జట్టు.. కివీస్‌ను ఓడించింది. తొలుత న్యూజిలాండ్‌ను 146కే ఆలౌట్‌ చేసిన టీమ్​ఇండియా.. ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 56 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అలా ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై భారత్‌కిదే ఆఖరి విజయం. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు.

ఆ ఒక్కటి తప్ప..
2007లో నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో గెలుపొందడం గమనార్హం. క్రెయిగ్ మెక్మిలాన్‌ (44), తొలుత మెక్‌కల్లమ్‌ (45), జాకబ్ ఓరమ్ (35) రాణించడం వల్ల కివీస్‌ 190 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ లక్ష్యఛేదనలో భారత్ విఫలమైంది. ఓపెనర్లు గంభీర్ (51), సెహ్వాగ్ (40) శుభారంభం అందించినప్పటికీ మిగతా బ్యాటర్లు రాణించకపోవడం వల్ల లక్ష్యానికి 10 పరుగుల దూరంలోనే ఓటమిపాలైంది. అప్పుడు స్పిన్నర్ డానియల్ వెటొరీ (4/20) టీమ్‌ఇండియాను దెబ్బకొట్టాడు.

2016 టీ20 ప్రపంచకప్‌లోనూ కివీస్‌ చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో అదరగొట్టి ప్రత్యర్థి జట్టుని 126/7కే కట్టడి చేసినప్పటికీ.. బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ 79 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కోహ్లీ (23), ధోనీ (30), అశ్విన్ (10) మినహా మిగతా బ్యాటర్లందరూ రెండంకెల స్కోర్​ను సాధించలేకపోయారు. శిఖర్‌ ధావన్ (1), రోహిత్‌ (5), యువరాజ్‌ సింగ్ (4), సురేశ్ రైనా (1), హార్దిక్ పాండ్య (1), జడేజా (0) ఘోరంగా విఫలమయ్యారు.

ఒక్క రనౌట్​ వల్ల..
2019 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అయితే ఆ తర్వాత ఇరు జట్లు సెమీస్‌లో తలపడ్డాయి కానీ ఆ మ్యాచ్​లో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కానీ ఈ లక్ష్యఛేదనలో భారత్ 221 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (1), రోహిత్ (1), కోహ్లీ (1) వరుసగా పెవిలియన్ బాటపట్టడం వల్ల 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక రవీంద్ర జడేజా (77), ధోనీ (50) పోరాడినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. జట్టు స్కోరు 208 వద్ద జడేజా ఔటైనా ధోనీ క్రీజులో ఉండటం వల్ల టీమ్‌ఇండియా అభిమానులు గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. అయితే, 216 పరుగుల వద్ద ధోనీ కూడా రనౌట్‌గా వెనుదిరగడం వల్ల భారత్‌ విజయావకాశాలు ఆవిరయ్యాయి. ధోనీ రనౌట్‌ కావడంతో దేశంలో ఉన్న కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెలు బద్దలైనంత పనైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ (డబ్ల్యూటీసీ)ను మొట్టమొదటి సారి 2019-21 మధ్య నిర్వహించారు. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు 'గద'ను ట్రోఫీగా బహుకరిస్తారు. అయితే తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 249, రెండో ఇన్నింగ్స్‌లో 140/2 స్కోరు చేసింది. ఇక

2021 టీ20 ప్రపంచకప్‌లోనూ కివీస్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియాను 110 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇలా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఆధిపత్యం చలాయించిన కివీస్‌ను.. ఈ సారైనా ఓడించి ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ODI World Cup 2023 : ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మ్యాచ్​... 4658 వన్డేల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!

ODI World Cup 2023 Players Injuries : సెమీస్​ రేసులో భయపెడుతున్న ఆటగాళ్ల గాయాలు.. జట్లకు పెద్ద షాక్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.