ETV Bharat / sports

'రాయుడు జట్టులో ఉంటే ప్రపంచకప్ గెలిచే వాళ్లం'

author img

By

Published : Aug 23, 2020, 6:47 AM IST

we would have won the tournament If he was part of World Cup squad Suresh Raina on India batsman
'జట్టులో అతడుండి​ ఉంటే ప్రపంచకప్​ గెలిచేవాళ్లం'

2019 ప్రపంచకప్​ భారత జట్టులో మిడిలార్డర్ సమస్యపై​ టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా స్పందించాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడిని ఎంపిక చేసి ఉంటే సెమీస్​లో ఓటమి ఎదురయ్యేది కాదని అభిప్రాయపడ్డాడు.

2019 ప్రపంచకప్‌ కోసం 4వ స్థానంలో ఆడించేందుకు ఎవరిని ఎంచుకోవాలా? అని సెలక్షన్‌ కమిటీ పడ్డ తర్జనభర్జన అంతా ఇంతా కాదు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడినే ఎన్నుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. రాయుడిని పక్కన పెట్టడంపై సెలక్షన్‌ కమిటీ తీవ్ర విమర్శలకు గురైంది. అనంతరం సమాధానమిస్తూ ఆల్‌రౌండర్‌ అయిన విజయ్‌ శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడని ఎమ్మస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయంపై తీవ్రంగా కలత చెందిన అంబటి రాయుడు దీనిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆట కోసం 'త్రీడీ' అద్దాలతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ మధ్యే వీడ్కోలు పలికిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్​ రైనా సెలక్షన్‌ కమిటీ నిర్ణయంపై తాజాగా స్పందించాడు. 4 స్థానంలో రాయుడినే తీసుకుని ఉండాల్సిందిగా పేర్కొన్నాడు. రాయుడు జట్టులో ఉంటే ప్రపంచకప్‌ గెలిచేవాళ్లమని అన్నాడు.

"రాయుడే జట్టులో ఉండాలని కోరుకున్నా. అతడు ప్రపంచకప్‌లో ఆడేందుకు ఏడాదిన్నర కాలం పాటు తీవ్రంగా కష్టపడ్డాడు. ఎన్నో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. 4వ స్థానంలో రాయుడు ఉత్తమ ఆటగాడు. అతడు ప్రపంచకప్‌లో భాగమైతే భారత్‌ ఆ టోర్నమెంట్‌ గెలిచేది. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో అతడు ఉత్తమంగా బ్యాటింగ్​ చేస్తున్నాడు."

- సురేశ్​ రైనా, టీమ్ఇండియా మాజీ ఆల్​రౌండర్​

మిడిలార్డర్‌లో ఆడేందుకు ఎంచుకున్న విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌ ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. మిడిలార్డర్‌లో రాణించకపోవడమే న్యూజిలాండ్‌తో సెమీస్‌లో భారత్‌ ఓటమికి కారణమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.