ETV Bharat / sports

హాంకాంగ్​తో మ్యాచ్​.. ఆరేళ్ల తర్వాత కోహ్లీ అలా

author img

By

Published : Sep 1, 2022, 11:17 AM IST

kohli asia cup 2022
కోహ్లీ ఆసియా కప్ 2022

హాంకాంగ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ఆటతీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తాజా మ్యాచ్​లో విరాట్​ బౌలింగ్​, బ్యాటింగ్​కు సంబంధించిన వీడియోలను చూడటంతో పాటు అతడు సాధించిన రికార్డును తెలుసుకుందాం.

ఆసియా కప్‌ 2022లో భాగంగా హాంకాంగ్​తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించడం ద్వారా టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రస్తుత సారథి రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ఓ వరల్డ్‌ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్​ కెరీర్‌లో 31వ అర్ధశతకం సాధించి.. హిట్​మ్యాన్​ పేరిట ఉన్న అత్యధిక హాఫ్‌సెంచరీల(అంతర్జాతీయ టీ20ల్లో) రికార్డును సమం చేశాడు. రోహిత్‌ 134 మ్యాచ్‌ల్లో 31 హాఫ్‌ సెంచరీలు సాధించగా.. కోహ్లి 101 మ్యాచ్‌ల్లోనే 31 హాఫ్‌ సెంచరీల మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన టాప్‌-5 ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్​ల​తర్వాతి స్థానాల్లో బాబర్‌ ఆజామ్‌ (27), డేవిడ్‌ వార్నర్‌ (23), మార్టిన్‌ గప్తిల్‌ (22) ఉన్నారు.

ఇక ఇదే మ్యాచ్​లో రోహిత్‌ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసి ఔటైన రోహిత్‌ ప్రస్తుతానికి 134 మ్యాచ్‌ల్లో 3520 పరుగులు స్కోర్‌ చేశాడు. రోహిత్‌ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్‌ వెటరన్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (3497), మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ (3402) ఉన్నారు.

కోహ్లీ బౌలింగ్​.. ఇదే మ్యాచ్​లో కోహ్లీ బౌలింగ్‌ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత అతడు బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు. హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన కోహ్లీ.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇ‍చ్చాడు.

కోహ్లి బౌలింగ్‌కు అతడి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విరాట్​ టీ20ల్లో చివరగా 2016 ఆసియాకప్‌లో బౌలింగ్‌ చేశాడు. ఇప్పటి వరకు 101 టీ20లు ఆడిన కోహ్లి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

కోహ్లీ ఫిదా.. సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌కి 'టేక్‌ ఏ బౌ' చెప్పాడు. ఈ ఘటన ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో ఆడిన మ్యాచ్‌లో చోటుచేసుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 192/2 భారీ స్కోరు సాధించింది. అనంతరం హాంకాంగ్ 152/5కే పరిమితమైంది. దీంతో 40 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (68*) కీలక పాత్ర పోషించాడు.

ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ (21) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా.. కేఎల్ రాహుల్ (36) మాత్రం ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ పెవిలియన్‌కు చేరే సమయానికి టీమ్‌ఇండియా స్కోరు 94/2 (13 ఓవర్లకు). హాంకాంగ్‌ బౌలర్లు కాస్త పొదుపుగానే బౌలింగ్‌ చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా నెమ్మదిగానే తన ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం తీసుకొన్నాడు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్ మాత్రం మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలిసి కేవలం ఏడు ఓవర్లలోనే మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించారు.

మరీ ముఖ్యంగా భారత ఇన్నింగ్స్‌లోని చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం చేశాడు. మొత్తం నాలుగు సిక్సర్లతో సహా 26 పరుగులను రాబట్టాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్‌ ఆరు సిక్సర్ల రికార్డును అందుకొంటాడని అభిమానులు భావించారు. అయితే, హాంకాంగ్‌ బౌలర్‌ హరూర్‌ అర్షద్‌ తెలివిగా స్లో బౌన్సర్‌ను విసిరాడు. సూర్యకుమార్‌ ఆ బంతిని కొట్టేందుకు ప్రయత్నించినా బ్యాట్‌కు తాకలేదు. మరుసటి బాల్‌ను కూడా స్లో బౌన్సర్‌గా సంధించాడు. ఈ సారి మాత్రం సూర్యకుమార్‌ లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదాడు. ఇక చివరి బంతికి షాట్‌కు ప్రయత్నించినా రెండు పరుగులే లభించాయి. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. దీంతో ఇన్నింగ్స్‌ ముగిశాక సూర్యకుమార్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. ఈ వీడియోను స్పోర్ట్స్‌ ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఆ వీడియోను మీరూ వీక్షించండి.

ఇదీ చూడండి: భారత్​-హాంకాంగ్​ మ్యాచ్​.. స్టేడియంలో క్రికెటర్​ లవ్​ ప్రపోజల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.