'మల్లేశం', 'కాంచివరం' తరహాలో చేనేత కళాకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ యువ దర్శకుడు విజయ్ కుమార్ బడుగు రూపొందించిన చిత్రం 'తమసోమా జ్యోతిర్గమయ'. విశాల్ క్రియేషన్స్ పతాకంపై తడక రమేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆనంద్ రాజ్, శ్రావణిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. పోచంపల్లి చుట్టుపక్కల పరిసరాల్లోనే పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా 'తమసోమా జ్యోతిర్గమయ' పోస్టర్ను ఆవిష్కరించిన చిత్ర బృందం.. 2001 నుంచి 2014 మధ్యకాలంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లిలో నేత కార్మికుల జీవన స్థితిని తమ చిత్రంలో చూపించబోతున్నట్లు తెలిపింది. వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.