ETV Bharat / sitara

హీరో, దర్శకుడు రెడీ.. కావాల్సింది హీరోయిన్లే!

author img

By

Published : Jul 21, 2021, 7:30 AM IST

.
.

తెలుగు స్టార్ హీరోలు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అచ్చొచ్చిన డైరెక్టర్లతో కొందరు, కొత్త దర్శకులతో మరికొందరు చిత్రాలు చేస్తున్నారు. అయితే హీరోయిన్​ విషయంలో మాత్రం ఇంకా వెదుకులాట కొనసాగుతూనే ఉంది.

మా సినిమా స్క్రిప్టు దశలో ఉంది. మా సినిమా సెట్స్‌పై ఉంది, లేదంటే నిర్మాణానంతర పనుల్లో ఉందనే మాటలు చిత్ర పరిశ్రమలో తరచూ వినిపించేవే. అలా హీరోయిన్ల ఎంపిక కసరత్తుల్లో ఉండే సినిమాల జాబితా కూడా చాంతాడంత. కథలు సిద్ధంగా ఉంటాయి. హీరోలూ పచ్చజెండా ఊపేస్తారు. ఎప్పుడంటే అప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాత ఎదురు చూస్తుంటాడు. కానీ హీరోయిన్ ఎంపికే ఎంతకీ పూర్తవ్వదు. అలా జోడీ కుదరక నెలలు నెలలు వాయిదాలు పడే సినిమాలు ఎక్కువే.

ఒక సినిమాకు కథానాయిక ఎంపిక పూర్తయితే తప్ప కలయిక కుదిరినట్టు కాదు. హీరోకు తగిన జోడీ అనిపించాలి. వెనక విజయాలు.. ప్రేక్షకుల్ని ఆకర్షించే గ్లామర్‌ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సదరు హీరోయిన్‌ను ఎంపిక చేస్తే ఆ ప్రాజెక్ట్‌కు క్రేజ్‌ వస్తుందో లేదో లెక్కలేసుకోవాలి. ఇలా కథానాయికల ఎంపిక వెనక ఎన్నెన్నో సమీకరణలు ఉంటాయి. పారితోషికం.. కాల్షీట్ల సర్దుబాటు సంగతులు సరే సరి! కథానాయికను ఖరారు చేయకుండానే కొన్ని సినిమాలు పట్టాలెక్కుతాయంటే కారణం అదే. ఏటా వందల సంఖ్యలో కొత్త కథానాయికలు పరిశ్రమకు వస్తుంటారు. కానీ వాళ్లలో స్టార్‌ హోదాకు చేరుకునేవాళ్లు ఒకరిద్దరే. అందుకే స్టార్‌ సినిమాలకు నాయికల ఎంపిక అనేది కత్తిమీద సాములా మారింది. చిత్రసీమలో కార్యకలాపాలు ఊపందుకోగానే వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి పలు చిత్రబృందాలు. బాలకృష్ణ, ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌, గోపీచంద్‌ తదితరుల చిత్రబృందాలు ప్రస్తుతం నాయికల ఎంపికపైనే కసరత్తులు చేస్తున్నాయి.

* 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. అందులో హీరోయిన్​గా కియారా అడ్వాణీ, పూజా హెగ్డేల్లో ఒకరు ఖాయం అని తెలుస్తోంది. మరి ఆ ఒక్కరు ఎవరనేది ఇంకో వారంలో ఖరారయ్యే అవకాశాలున్నాయి.

ntr
ఎన్టీఆర్

* పవన్‌కల్యాణ్‌ - హరీశ్​ శంకర్‌ కలయికలో రూపొందనున్న సినిమాకూ నాయిక ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ఒకట్రెండు వారాల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

pawankalyan
పవన్​కల్యాణ్

* రామ్‌చరణ్‌ -శంకర్‌, చిరంజీవి - మోహన్‌రాజా, చిరంజీవి - బాబీ, మహేశ్​బాబు-త్రివిక్రమ్‌ల కాంబినేషన్​లో రూపొందుతున్న చిత్రాలూ ఇంకా హీరోయిన్ల పేర్లను అధికారికంగా ఖరారు చేయలేదు. ఇవి పట్టాలెక్కే సమయానికి, అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా తుదినిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో కొన్ని చిత్రబృందాలు కనిపిస్తున్నాయి.

* బాలకృష్ణ కోసం ముగ్గురు నాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్‌ సినిమాలో వీళ్లే ఉండొచ్చని ఇద్దరు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. త్వరలోనే పట్టాలెక్కనున్న దీని కోసం త్రిష, తమన్నా, శ్రుతిహాసన్‌ తదితర సీనియర్‌ భామల పేర్లను పరిశీలిస్తున్నారు. మరి అవకాశం ఎవరికి సొంతం అవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు.

balakrishna
నందమూరి బాలకృష్ణ

* గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. ఈ సినిమా బృందం కూడా హీరోయిన్ అన్వేషణలోనే ఉంది. 'ఇస్మార్ట్‌...' భామ నభా నటేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఆమెనే ఖాయమా లేక మరొకరిని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

gopichand
గోపీచంద్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.