తండ్రి చాటు తనయుడిగానే పరిశ్రమకు పరిచయమైన హీరో రామ్చరణ్ తేజ్. మెగా వారసుడిగా భారీ అంచనాల మధ్య సినీ రంగ ప్రవేశం చేశాడు. చిరంజీవిలా డ్యాన్స్ చేయగలడా? ఆయనలా నటించగలడా? ఆ గ్రేస్ ఉందా? అని మొదటి సినిమాతోనే పోల్చి చూడటం మొదలు పెట్టినా... మోయలేనంత అంచనాల భారం తనపై ఉన్నా... తొలి చిత్రం 'చిరుత'తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. డ్యాన్స్, నటన, ఈజ్లో తన ప్రతిభను ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
'చిరుత'తో
అగ్రహీరో చిరంజీవి, సురేఖ దంపతులకు 1985 మార్చి 27న జన్మించాడు చరణ్. చిన్నప్పట్నుంచే తండ్రి సినిమాల్ని చూస్తూ డ్యాన్స్పై మక్కువ పెంచుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 2007లో 'చిరుత'తో వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాలోనే చక్కటి పరిణతిని ప్రదర్శించిన రామ్చరణ్ 'ఉత్తమ నూతన నటుడి'గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అతడ్ని వరించింది.
'ఆర్.ఆర్.ఆర్' లో అల్లూరిలా
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరిగా రామ్చరణ్ కొనసాగుతున్నాడు. పుష్కరకాలంగా హీరోగా ప్రయాణం చేస్తున్న ఇతడు.. ప్రస్తుతం 14వ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' చేస్తున్నాడు. 'మగధీర' తరువాత రామ్చరణ్- రాజమౌళి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మీసం మెలేశాడు.
రెండో చిత్రంతోనే రికార్డుల వేట
ఆ తరువాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చేశాడు. ఆ చిత్రంతో చరణ్ పేరు ఇతర భాషల్లోనూ మార్మోగిపోయింది. ఆ ఏడాది ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డుతో పాటు.. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రంతో బలమైన మాస్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
'ఆరెంజ్' విఫలమైనా.. 'రచ్చ'తో మళ్లీ
2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'ఆరెంజ్' చేశాడు. ఆ చిత్రం పరాజయం పాలైనప్పటికీ, చరణ్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు లభించాయి. 2011లో సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' చేశాడు. భారీ ఓపెనింగ్స్ను సాధించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 2013లో వి.వి వినాయక్ దర్శకత్వంలో 'నాయక్', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి 'ఎవడు' సినిమాల్లో నటించాడు. ఆ తరువాత 'జంజీర్'తో హిందీకి పరిచయమయ్యాడు. తెలుగులోనూ ఆ చిత్రం 'తుఫాన్'’ పేరుతో విడుదలైనా... పెద్దగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.
నటరూపాన్ని చాటిన 'రంగస్థలం'
2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే', 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో 'బ్రూస్ లీ' చిత్రాలు చేశాడు. ఆ రెండు చిత్రాలు కూడా మిశ్రమ స్పందననే తీసుకొచ్చాయి. 2016లో వచ్చిన 'ధృవ'తో మరోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చరణ్, 2018లో వచ్చిన ‘రంగస్థలం’తో తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం పలు రికార్డుల్ని తిరగరాసింది. చివరగా వచ్చిన 'వినయ విధేయ రామ' పరాజయం ఎదురైనా మరొక ఘన విజయమే లక్ష్యంగా 'ఆర్.ఆర్.ఆర్' కోసం రంగంలోకి దిగాడు.
నిర్మాణంలోనూ..
రామ్చరణ్ కేవలం కథానాయకుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా విజయాల్ని అందుకున్నాడు. తన తండ్రి రీ ఎంట్రీ చిత్రం 'ఖైదీ నంబర్ 150'ని స్వయంగా నిర్మించాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసిన ఆయన చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాని కూడా అందులోనే నిర్మించాడు.
పెళ్లి ప్రస్థానం..
2012 జూన్ 12న అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మనుమరాలు ఉపాసన కామినేనిని రామ్ చరణ్ వివాహమాడాడు. ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా బిజీ బిజీగా కొనసాగుతున్నాడు.
అవంటే ఎంతో ఇష్టం..
గుర్రపు స్వారీని అమితంగా ఇష్టపడే చరణ్, ప్రస్తుతం హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఓనరుగా కొనసాగుతున్నాడు. ఆయనకి హైదరాబాద్ శివార్లలో ఓ ఫాం హౌస్ ఉంది. అందులో రకరకాల జంతువుల్ని పెంచుతుంటాడు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా అక్కడికి కుటుంబంతో పాటు వెళ్లి పెంపుడు జంతువులతో కలిసి సేద తీరుతుంటారు. తన శ్రీమతి ఉపాసన బహుమతిగా ఇచ్చిన బ్రాట్ కుక్కపిల్ల అంటే చరణ్కి ఎంతో మక్కువ. విదేశాలకి వెళ్లినప్పుడు ఆ కుక్కపిల్లని మిస్ కాకూడదనే ఉద్దేశంతో, బ్రాట్ ఫొటోలతో ముద్రించిన లగేజీ బ్యాగులని తనతో తీసుకెళ్తుంటాడు చరణ్.
ఇదీ చదవండి: బాబాయ్ దారిలో అబ్బాయి.. రూ.70 లక్షలు విరాళం
ఇదీ చదవండి: వారి కోసం మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం