ETV Bharat / sitara

అవును మేం విడిపోతున్నాం: చైతూ, సమంత ప్రకటన

author img

By

Published : Oct 2, 2021, 3:42 PM IST

Updated : Oct 2, 2021, 5:04 PM IST

NagaChaitanya and Samantha
సమంత చైతన్య

ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు చైతూ, సమంత.

అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధానికి తెరపడింది. తాము ఇద్దరం విడిపోతున్నట్లు పరస్పరం అధికారికంగా ప్రకటించారు. ఎంతో చర్చించి ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు సామాజిక మాద్యమాల వేదికగా ఇరువురు వెల్లడించారు. 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం గోవాలో ఒక్కటైన ఈ జంట.. 'ఏం మాయ చేశావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం', 'మజిలి' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్​గా పేరున్న చైతన్య సమంత జంట విడిపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

NagaChaitanya and Samantha
సమంత, చైతన్య

తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్న చైతన్య, సమంత.. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందన్నారు. అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని వీరిద్దరూ.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్​లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.

2010లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 2017లో అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లికి ముందు ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో కలిసిన నటించిన సామ్ -చైతన్య.. పెళ్లి తర్వాత మజిలి చిత్రంలో భార్యభర్తలుగా నటించారు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకొని నిజమైన భార్యభర్తల అనుబంధానికి అద్దం పట్టింది. 2020 వరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వివాహ బంధం లాక్ డౌన్ కు ముందు అనూహ్య మలుపు తిరిగింది.

అక్కడే మొదలైంది!

ట్విట్టర్ ఖాతాలో సమంత తన పేరు పక్కనున్న అక్కినేని ఇంటిపేరును తొలగించి ఎస్ అక్షరం మాత్రమే ఉంచడం వల్ల సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలను ఖండించలేదు. ఆ తర్వాత నుంచి సమంత చైతూకు దూరంగా ఉండటం, ఒంటరిగానే తిరుమల దర్శనానికి వెళ్లిరావడం, ఇటీవల చైతూ నటించిన 'లవ్ స్టోరీ' విడుదల ప్రచారంలో సమంత ఊసే ఎత్తకపోవడం వల్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నారన్న ప్రచారానికి బలం చేకూర్చాయి.

అదే కారణమా?

'సూపర్ డీలక్స్' చిత్రంతోపాటు 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో సమంత తన పరిధికి మించి నటించడం చైతూకు నచ్చలేదనే ప్రచారం జరిగింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. అలా చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవలు.. విడాకుల వరకు దారి తీసినట్లు సమాచారం.

ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటించగా.. చైతన్య తన తండ్రితో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో నటిస్తున్నాడు.

Last Updated :Oct 2, 2021, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.