ETV Bharat / science-and-technology

'ఐఫోన్‌ కెమెరాలో ఆ కంపెనీ సెన్సర్లు వాడుతున్నాం'.. సీక్రెట్ చెప్పేసిన టిమ్‌ కుక్‌

author img

By

Published : Dec 18, 2022, 3:35 PM IST

సాధారణంగా యాపిల్‌ కంపెనీ తమ ఉత్పత్తుల సంబంధించి సాంకేతికతను గోప్యంగా ఉంచుతుంది. అంతేకాదు.. వాటిలో ఉండే ఫీచర్ల గురించి సైతం పెద్దగా ప్రచారం చేయదు. అయితే దానికి భిన్నంగా యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ ఐఫోన్‌కు సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు.

tim cook reveals that apple is using sonysensors for iphones
యాపిల్ ఐఫోన్ కంపెనీ

యాపిల్ ఐఫోన్ అనగానే ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట ధర ఎంత? అని! అవును, అందులో ఫీచర్ల గురించి వాకబు చేసేవారికంటే.. ఫోన్ ధరెంత అని ప్రశ్నించేవారే ఎక్కువ. ఇందుకు కారణం లేకపోలేదు. ఆండ్రాయిడ్ ఫోన్‌ ఫీచర్ల గురించి చెప్పినంతగా.. ఐఫోన్‌ ఫీచర్ల గురించి యాపిల్ ప్రస్తావించదు. అంతేకాదు ఐఫోన్లలో ఉపయోగించే సాంకేతికత, ఇతర ముఖ్యమైన విడిభాగాల గురించి ఎక్కువగా గోప్యతను పాటిస్తుంది. అయినప్పటికీ, ఎక్కువ మంది ఐఫోన్‌ అంటేనే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కెమెరాల విషయానికొస్తే.. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలో 64 ఎంపీ, 108ఎంపీ కెమెరాలు ఇస్తే.. ఐఫోన్‌లో మాత్రం 12 ఎంపీ కెమెరాలు మాత్రమే ఉంటాయి. కానీ, ఫొటోల నాణ్యతలో మాత్రం ఐఫోన్‌తో తీసిన ఫొటోలే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఐఫోన్ కెమెరాల్లో ఉపయోగించే సెన్సర్లు. వీటికి సంబంధించి కీలక విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌ కుక్ వెల్లడించారు.

యాపిల్ ఐఫోన్‌లలో గత పదేళ్లుగా సోనీ కంపెనీ కెమెరా సెన్సర్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా జపాన్‌లోని కుమామోటోలో సోనీ కంపెనీని సందర్శించిన ఆయన అక్కడ సోనీ కెమెరా సెన్సర్ల పనితీరు గురించి తెలుసుకుంటున్న ఫొటోను ట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. "ఐఫోన్‌ కెమెరాల్లో ప్రపంచలోనే గొప్ప సెన్సర్లు అమర్చేందుకు గత పదేళ్లుగా సోనీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం. వీటిని రూపొందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది విడుదల చేయబోతున్న ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లలో సోనీ కంపెనీ అభివృద్ధి చేసిన ఇమేజ్‌ సెన్సర్‌ ఉపయోగించనున్నారు. ఇది తక్కువ కాంతిలో కూడా ముఖాన్ని.. వెలుతురులో ఉన్నట్లుగా క్యాప్చర్‌ చేస్తుందట. కాంతి పెరిగినా.. ఓవర్‌ ఎక్స్‌పోజర్‌ను తగ్గించి ముఖాన్ని క్లియర్‌గా క్యాప్చర్‌ చేస్తుందని సోనీ కంపెనీ చెబుతోంది.

యాపిల్‌ కంపెనీ ప్రతి మూడేళ్లకు ఒకసారి తన ప్రొడక్ట్స్‌ను రీ-డిజైన్‌ చేస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్‌ 15 సిరీస్‌లో ప్రో మ్యాక్స్‌కి బదులు అల్ట్రా వేరియంట్‌ను పరిచయం చేస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. ఐఫోన్ 15 అల్ట్రాలోనే యాపిల్ కంపెనీ టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్‌ను పరిచయం చేయనుందట. ఇప్పటివరకు యాపిల్ డివైజ్‌లకు ఛార్జింగ్‌ కోసం లైట్నింగ్ పోర్ట్‌ ఇస్తోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఒకే తరహా ఛార్జర్‌ విధానాన్ని పలు కంపెనీలు పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు ఇస్తున్న టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్ట్‌నే యాపిల్‌ డివైజ్‌లకు ఇవ్వనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.