ETV Bharat / opinion

రాహుల్ జోడో యాత్ర సక్సెస్ అయినట్టేనా? ఓట్లు రాలతాయా? నెక్ట్స్ ఏంటి?

author img

By

Published : Jan 29, 2023, 6:12 PM IST

Bharat Jodo Yatra challenge
Bharat Jodo Yatra challenge

సమస్యల సుడిగుండంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజలతో మమేకమయ్యేందుకు చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగియనుంది. కాంగ్రెస్​లో ఈ యాత్ర తెచ్చిన మార్పు ఏంటి? ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో హస్తం ఎలాంటి ఫలితాలు చూసే అవకాశం ఉంది? 2024కు 14 నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ తర్వాతి ప్లాన్ ఏంటి?

వరుస ఎదురుదెబ్బలు.. ఎన్నో పరాజయాలు.. రాజకీయంగా అత్యంత అధమ దశ.. దేశవ్యాప్తంగా డీలా పడ్డ క్యాడర్.. ఇలాంటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికొద్ది గంటల్లో ముగియనుంది. కాంగ్రెస్​కు, ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఈ యాత్ర వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా లేదా అనేది పక్కనబెడితే.. ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు హస్తం పార్టీని వేధిస్తున్నాయి. యాత్ర జరిగినన్ని రోజులూ కాస్తో కూస్తో వార్తల్లో నిలిచిన ఆ పార్టీ.. ఇకపై జాతీయ స్థాయిలో ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

'నెక్ట్స్ ఏంటి?'
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. సుమారు 4వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర ద్వారా ఆయన కాస్త ఇమేజ్ పెంచుకున్నా.. పార్టీలో ఉన్న సమస్యలు మాత్రం సమసిపోలేదు. సంస్థాగతంగా పార్టీ పరిస్థితి ఇదివరకులా అంపశయ్య మీదే ఉంది. సమర్థ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటున్న హస్తం.. ఓటర్లలో విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అధికార భాజపా హిందుత్వ అజెండాను తిప్పికొట్టడమే కాకుండా.. ఓట్లు కురిపించే వ్యూహాలపై పార్టీ కసరత్తు చేయాల్సి ఉంటుంది.

ongress bharat jodo yatra challenges
జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర.. విజయవంతమైందా లేదా అనే విషయం ఎలాగో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది. మొత్తం 9 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికానికి సెమీ ఫైనల్​గా భావిస్తున్న ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రభావం చూపితే.. 'ఫైనల్​'కు అంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితిని చూసి.. విపక్ష కూటమికి నాయకత్వాన్ని అందించడానికి కూడా ప్రాంతీయ పార్టీలు ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుకోగలిగితే.. భాజపాను ఢీకొట్టేది తామేనని కాంగ్రెస్ రుజువు చేసుకోవచ్చు. ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్లు భాజపా వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్సే ఆధారమని చాటి చెప్పినట్లవుతుంది.

"భాజపాను ఎదిరించే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్​పై ఉంది. ఆ పార్టీకి కాస్త మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ క్యాడర్​కు కొత్త ఉత్సాహం లభించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దూకుడుగా ఉన్నారు. బలమైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఇవి భాజపాను అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ 2023లో జరిగే ఎన్నికలను కీలకంగా పరిగణించి ముందుకెళ్లాలి. 'డూ ఆర్ డై' నినాదంతో ఇదే చివరి పోరాటం అనుకోవాలి."
-సంజయ్ ఝా, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి

మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఏడాది ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్​లో కాంగ్రెస్​కు అనుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. క్రమంగా ఈ రాష్ట్రాలపై పట్టు కోల్పోతున్న కాంగ్రెస్.. పుంజుకుంటుందన్న ఆశలు ఆ పార్టీ నేతల్లోనూ ఉండకపోవచ్చు. 2018 ఎన్నికల్లో మిజోరంలో ఐదు సీట్లకే పరిమితమైంది హస్తం. మేఘాలయలో అధికారాన్ని ఎన్​డీఏ కూటమికి కోల్పోయింది. త్రిపుర, నాగాలాండ్​లో ఒక్క సీటూ గెలుచుకోలేక చతికిల పడింది.

ongress bharat jodo yatra challenges
కశ్మీర్​లో భారత్ జోడో యాత్ర

కర్ణాటకలో కాంగ్రెస్​దే హవా?
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి- ఏప్రిల్ మధ్య కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈశాన్యంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. కర్ణాటకలో కాంగ్రెస్​ది కాస్త పైచేయిలా కనిపిస్తోంది. భాజపాతో పోలిస్తే కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో విజయం సాధించి ఈశాన్య రాష్ట్రాల చేదు ఫలితాలను దిగమింగాలని హస్తం పార్టీ ఆశిస్తోంది. ఇకపోతే ఈ ఏడాది చివర్లో కీలకమైన నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

"కర్ణాటక తిరిగి కాంగ్రెస్ చేతికి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ చేయాల్సిందల్లా అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవడమే. రాజస్థాన్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించుకోవాలంటే సచిన్ పైలట్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. ఉన్న అవకాశాలను చంపుకోకపోతే ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను సైతం కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. తెలంగాణ కూడా హస్తం పార్టీకి కీలకమే. ఆ రాష్ట్రంలో ప్రధాన విపక్ష హోదాను భాజపాకు కోల్పోయే ముప్పు ఉంది."
-సంజయ్ ఝా, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి

2024 సార్వత్రికానికి సిద్ధమయ్యేందుకు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేరుగా భాజపాను ఢీకొడుతోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 93 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్రియాశీలంగా ఉండటం ఆ పార్టీకి మంచి పరిణామమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఉత్తర్​ప్రదేశ్, బిహార్, బంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ ముందు ఉన్న ప్రధాన సవాళ్లు. పెద్ద సంఖ్యలో లోక్​సభ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆనవాళ్లే సరిగా లేవు. సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగానూ కనిపించడం లేదు. ఇక గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనైతే పార్టీని సమూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది.

"పార్టీని సుదీర్ఘంగా పలు సమస్యలు వేధించాయి. నాయకత్వ సమస్యకు అధ్యక్ష ఎన్నికల రూపంలో పరిష్కారం దొరికింది. ప్రస్తుతం ఖర్గే పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడం.. భారత్ జోడో యాత్ర ద్వారా సాధ్యమైంది. ఇది ఇంకా కొనసాగాలి. పాదయాత్రలకు పరిమితం కాకూడదు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు 'నెక్ట్స్ ఏంటి?' అనే ప్రశ్న తనకు తాను వేసుకొని సమాధానాలు వెతుక్కోవాలి."
-సంజయ్ ఝా, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి

145 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో పలు విపక్ష పార్టీలు కాంగ్రెస్​కు మద్దతుగా నడిచాయి. తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్), జమ్ము కశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. అయితే, కొన్ని కీలక పార్టీలు యాత్రకు దూరంగా ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిజు జనతా దళ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్.. యాత్రకు దూరంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ భాజపాయేతర, కాంగ్రెస్సేతర కూటమికి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ మూడో కూటమి సాధ్యమవుతుందా? కేసీఆర్ బీఆర్ఎస్ ప్లాన్ అందుకోసమేనా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ongress bharat jodo yatra challenges
జోడో యాత్రలో అభిమానులతో రాహుల్

భారత్ జోడో సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కొత్త కార్యక్రమం అమలు చేస్తోంది. 'హాత్​ సే హాత్ జోడో' పేరుతో కాంగ్రెస్ విభాగాలు తమతమ రాష్ట్రాల్లో యాత్ర చేపడుతున్నాయి. జనవరి 26న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే, ప్రతి ఇంటికీ వెళ్లడం చాలా క్లిష్టమైన పని అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెబుతున్నారు.

అదే సవాల్!
అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. విపక్ష పార్టీ హోదాలో భాజపాను కౌంటర్ చేయడంలో కొంతవరకు సఫలమైందని జవహర్​లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మణీంద్ర నాథ్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన విపక్షంగా కాంగ్రెస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటే పార్టీ మరింత మెరుగవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​కు ఇదే అతిపెద్ద సవాల్ అని విశ్లేషించారు.

ongress bharat jodo yatra challenges
కన్యాకుమారి (తొలి చిత్రం) నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.