మెదక్ జిల్లా రామాయంపేట శివారులో జాతీయ రహదారి 44పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న చెరుకు ట్రాక్టర్ను వెనుక నుంచి వస్తున్న బైక్ ఢీ కొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బిక్కనూర్ గ్రామానికి చెందిన ధర్మేంద్ర సింగ్, జీత్ కౌర్ దంపతులు బాలానగర్లోని ఫంక్షన్కి వెళ్లి తెల్లవారుజామున తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చెరుకు లోడుని తీసుకెళ్తున్న ట్రాక్టర్ పాడైపోగా దానిని రహదారిపై నిలిపివేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ధర్మేంద్ర.. చీకట్లో ట్రాక్టర్ని గమనించలేదు. దీంతో వేగంగా వచ్చి ట్రాక్టర్ను ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. భార్యకి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆమెను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరో పదినిమిషాల్లో ఇంటికి తిరిగి వెళ్తారనే సమయంలో ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: మత్తు ఉచ్చులో విద్యార్థులు... కిక్కు కోసం బానిసలు