ETV Bharat / jagte-raho

మత్తు ఉచ్చులో విద్యార్థులు... కిక్కు కోసం బానిసలు

author img

By

Published : Dec 3, 2020, 10:28 AM IST

శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు.. మత్తుకు బానిసలుగా మారుతున్నారు. సరదాకి కొందరు.. కిక్కు కోసం మరికొందరు మత్తు ఉచ్చులో పడుతున్నారు. ఏపీలోని విజయవాడ నగరంలో టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. డబ్బుకోసం దళారులు యువతను నాశనం చేస్తున్నారు. ఒక్క రోజులోనే 58 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. సంబంధిత కళాశాలలకు పోలీసులు నోటీసులిచ్చారు. విద్యార్థుల భవిష్యత్​ను కాలరాస్తున్న మత్తు రక్కసిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

మత్తు ఉచ్చులో విద్యార్థులు...కిక్కు కోసం బానిసలు
మత్తు ఉచ్చులో విద్యార్థులు...కిక్కు కోసం బానిసలు

ఏపీలోని విజయవాడ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతుంది. డబ్బుకోసం దళారులు విద్యార్థులకు మత్తు మైకం కమ్మిస్తున్నారు. మంచి మార్కులతో ఇంటర్‌ విద్యను పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాడో విద్యార్థి. ఎక్కువ సమయం ఒంటరిగా గదిలో ఉండటం..కళాశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నాడని తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. తండ్రి లేనప్పుడు తల్లి, సోదరిపై దురుసుగా ప్రవర్తించేవాడు. టీనేజ్‌ ప్రవర్తన అనుకుని కౌన్సిలింగ్‌కు తీసుకెళ్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సీనియర్ల నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం అలవాటుచేసుకున్నాడు ఆ విద్యార్థి. పాన్‌షాపు, ఆటోవాలాల నుంచి వీరికి గంజాయి అందేవి. చివరికి మత్తుపదార్థాలు తానే అమ్మేస్థితికి వెళ్లిపోయాడు. అతని గదిలో వెతికితే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి.

ఎవరితోనూ చెప్పుకోలేక..

మరొక విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. బంధువులకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మనే కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఒక్కగానొక్క కొడుకు ప్రవర్తనలో మార్పు చూసి ఆమె కంగారు పడింది. మానసిక సమస్య అనుకుని కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అసలు విషయం తెలిసింది. క్రీడా మైదానంలో కొందరితో పరిచయం ఏర్పడింది. వారికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో.. ఈ బాలుడికి అలవాటైంది. ఈ విషయం తెలిసి తల్లి బాధ పడుతుండటంతో అబ్బాయిలో తప్పు చేశాననే భావన ఏర్పడింది. ఎవరితోనూ చెప్పుకోలేక.. అలవాటు మార్చుకోలేక తప్పు చేశాననే భావనతో లోలోపల మదనపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.

మత్తుకు బాసినలు అవుతున్న మైనర్లు..

విజయవాడ నగరంలో మత్తు రక్కసి కోరలు చాస్తుంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భవిష్యత్​ను అంధకారంలో పడేస్తుంది. తాజాగా టాస్క్​ఫోర్స్ పోలీసులు చేసిన తనిఖీల్లో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముక్కు పచ్చలారని విద్యార్థులకు సరదా పేరుతో అలవాటు చేసి మత్తులో ముంచేస్తున్నారు. దళారులు నగదు కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. పాన్​షాపులు, పాఠశాల పరిసరాల్లో ఉండే నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి విక్రయానికి అడ్డాలుగా మార్చుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి రవాణా అవుతున్న గంజాయిని కొందరు విద్యార్థులే విక్రయిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్​లోని ఓ పాన్ షాపుపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. దుకాణంలో గంజాయి సేవించేందుకు వినియోగించే పేపర్, ఖాళీ గొట్టాలను విక్రయిస్తున్నారు. వీటిని దుకాణదారులు ప్రత్యేకంగా గోవా, హైదరాబాద్​ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో గంజాయి సేవిస్తున్న మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిపంపారు. సంబంధిత పాఠశాలలు, కళాశాలలకు నోటీసులిచ్చారు. 8 మంది గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గంజాయి అక్రమరవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని టాస్క్​ఫోర్స్ ఏడీసీపీ చెబుతున్నారు. మాదక ద్రవ్యాలకు యువతులు సైతం బానిసలుగా మారుతున్నారని గుర్తించారు.

మత్తు మత్తులో అసాంఘిక కార్యక్రమాలు

చిన్న వయసులోనే పిల్లలు ఉత్సుకతతో మత్తు పదార్థాల సేవనం మొదలుపెడుతున్నారని మానసిక వైద్య నిపుణులు డా.రాధిక రెడ్డి తెలిపారు. ఆ తర్వాత దానికి బానిసలవుతున్నారన్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి అలవాటు ఉండటం, పిల్లల్ని మత్తుపదార్థాల వైపు దారిమళ్లిస్తున్నారని తెలిపారు. ఒకసారి బానిసైతే చాలా దుష్ప్రభావాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దొంగతనాలకు పాల్పడటం, దురుసు ప్రవర్తన, చివరికి డ్రగ్స్‌ అమ్మడం వరకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ముందే నివారణ చర్యలు చేపట్టడం చాలా అవసరమని వైద్య నిపుణులు చెపుతున్నారు. చాలామంది ఆల్కహాలు, గంజాయికి బానిసలుగా మారి డీ అడిక్షన్ కేంద్రాలకు వస్తున్నారని తెలిపారు. ఇటీవల విద్యార్థులు గంజాయి సేవిస్తున్న కేసులు తరచుగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంజాయి ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతుందని.. ఆ మత్తు పదార్థం సేవించగానే సైకోగా మారే అవకాశాలుంటాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.

గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. అక్రమార్కులు నూతన పద్ధతుల్లో రవాణా కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై నిఘా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 'అవినీతి జరిగిందని.. ఎందుకు రుజువు చేయలేకపోయారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.