ETV Bharat / international

ఉక్రెయిన్​లో అంధకారం.. ఇది ట్రైలర్ మాత్రమేనన్న రష్యా.. భారత్ ఏమందంటే?

author img

By

Published : Oct 10, 2022, 8:50 PM IST

russia ukraine war
russia ukraine war

ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. 24 మంది గాయపడ్డారు. ఈ దాడులపై ఉక్రెయిన్​, రష్యా దేశాల అధ్యక్షులు సహా భారత్ సైతం స్పందించింది.

నాలుగు నెలల విరామం తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ బాంబు మోతలతో దద్దరిల్లింది. క్రిమియా-రష్యాను కలిపే కెర్చ్‌వంతెన పేల్చివేతలో ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీస్‌విభాగం హస్తముందని పుతిన్‌ ఆరోపించిన తర్వాత ఈ దాడులు మొదలయ్యాయి. రష్యా ఏకంగా 83 క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటిలో 40కి పైగా క్షిపణులను ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను కూడా ఈ దాడుల్లో రష్యా ఉపయోగించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. రష్యా క్షిపణులు కీవ్‌లో పలు చోట్ల భారీ విధ్వంసం సృష్టించాయి. కీవ్‌ మధ్యలో ఉన్న షెవ్చెంకో ప్రాంతంలో పేలుళ్లు చోటు చేసుకున్నట్లు కీవ్‌ మేయర్‌ విటాలి వెల్లడించారు.

షెవ్చెంకో చారిత్రక పాత నగరం. అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం సమీపంలో కూడా క్షిపణి దాడి జరిగినట్లు ఆ దేశ ఇంటీరియర్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్‌ నేషనల్‌ యూనివర్శిటీ ప్రధాన భవనానికి సమీపంలో ఒక పేలుడు చోటు చేసుకుంది. మౌలిక సదుపాయాలు, బిజీగా ఉండే కూడళ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాల లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి

కీవ్‌లో ఒక చోట జరిగిన క్షిపణి దాడిలో 8 మంది మరణించగా మరో 24 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. క్షిపణి దాడులు ఉక్రెయిన్‌ ధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజినికోవ్‌ వెల్లడించారు. కీవ్‌లో కొత్తగా నిర్మించిన పాదచారులు నడిచే వంతెనపై కూడా ఓ క్షిపణి పడింది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఈ వంతెన పేలుడు కారణంగా ధ్వంసమైంది. కీవ్‌లో ఒక మైదానంపై కూడా క్షిపణులు పడ్డాయి. కీవ్‌తో పాటు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని లివివ్‌, జైటోమిర్‌, టెర్నోపిల్‌.. మధ్య ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్, డెనిప్రో నగరాలపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా, తూర్పున ఉన్న ఖార్కివ్‌లోనూ ఈ క్షిపణి దాడులు జరిగాయి. ఖార్కివ్‌లో రష్యా క్షిపణి దాడులకు భయపడ్డ ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు

ఉక్రెయిన్​లో విద్యుత్​ అంతరాయం: రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. లివివ్‌లో విద్యుత్‌, వేడి నీటి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ వ్యవస్థలు సహా కీలకమైన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులు చేసినట్లు లివివ్‌ మేయర్‌ ఆండ్రీ సడోవి వ్యాఖ్యానించారు.

ఉగ్రవాద చర్యన్న పుతిన్​:
కాగా, క్రిమియా కెర్చ్ వంతైనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. పేలుడును ఓ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఉక్రెయన్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలు రూపొందించి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. టర్కిష్ స్ట్రీమ్ పైప్ లైన్​ను కూడా పేల్చివేసేందుకు ఉక్రెయిన్ యత్నిస్తోందని ఆరోపించారు.

ముందుంది అసలు సంగతి!
ఉక్రెయిన్​పై ప్రస్తుతం చేసిన దాడులు ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమేనని హెచ్చరికలు జారీ చేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు. మరోవైపు, ఉక్రెయిన్​ పరిస్థితిపై చర్చించేందుకు జీ7 దేశాలు సమావేశం కానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏడు దేశాల ప్రతినిధులు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ సైతం పాల్గొంటారని కూటమి పేర్కొంది.

'ఉక్రెయిన్​ను నాశనం చేయాలనుకుంటున్నారు':
ఉక్రెయిన్‌ను ఈ భూమిపై లేకుండా తుడిచి పెట్టాలని రష్యా భావిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. తమ దేశం రక్తమోడుతోందన్న జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్‌ మొత్తం వైమానిక దాడుల సైరన్లు మోగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జపొరిజియాలో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలను మాస్కో బలగాలు హత్య చేశాయన్న ఆయన.. డెనిప్రో, కీవ్‌లకు పనులకు వెళ్లే వారిని కూడా చంపారని విమర్శించారు. రష్యా క్షిపణి దాడుల్లో దురదృష్టవశాత్తు కొందరు మరణించారని.. మరికొందరు గాయపడ్డారని జెలెన్‌స్కీ వెల్లడించారు.

"మేము ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. డజన్ల కొద్ది క్షిపణులు, రాకెట్లు.. డ్రోన్లు మాపై నిరంతరాయంగా దాడి చేస్తున్నాయి. వారికి (రష్యా బలగాలు) రెండు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఉక్రెయిన్‌లో విద్యుత్ సౌకర్యాలను ధ్వంసం చేయడం.. కీవ్‌.. క్మెల్‌టిస్నీ ప్రాంతాలను కైవసం చేసుకోవడం. ఉక్రెయిన్‌ దక్షిణాన భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారు. మా విద్యుత్‌వ్యవస్థను నాశనం చేయాలనుకుంటున్నారు. కానీ అవి నెరవేరడం లేదు. అమాయక ప్రజలే లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ హాని కలిగించాలని చూస్తున్నారు. కానీ మేము ఉక్రేయినియన్లం. ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. ఒకరిని ఒకరం నమ్ముతాం. రష్యా నాశనం చేసిన ప్రతి దానిని పునరుద్ధరించుకుంటాం. ఇప్పుడు తాత్కాలికంగా విద్యుత్‌సరఫరాకు అంతరాయాలు ఉండవచ్చు. కానీ భవిష్యత్తులో ఎలాంటి అంతరాయం ఉండదు. మేం విజయం సాధిస్తాం."
-జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

దాడులపై స్పందించిన భారత్​: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాలను తక్షణమే విరమించి దౌత్యపర చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దాడుల తీవ్రత పెరగడం ఎవరికీ మంచిది కాదని ఉద్రిక్తతలు తగ్గించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఉక్రెయిన్‌లో మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెరగడంపై.. భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోదని ఆయన అన్నారు. అన్ని దేశాల సారభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విధానంలో భారత్‌ స్ధిరంగా ఉంటుందని బాగ్చీ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.