ETV Bharat / international

చైనా, తైవాన్‌ మధ్య యుద్ధ మేఘాలు.. యుద్ధనౌకలు, విమానాలు మోహరించిన డ్రాగన్

author img

By

Published : Apr 8, 2023, 1:31 PM IST

china-taiwan-war-2023-taiwan-war-news-today
2023 చైనా తైవాన్ యుద్ధం

చైనా-తైవాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై కన్నెర్ర చేసిన చైనా ఆ దేశాన్ని అనివైపుల నుంచి దిగ్బంధం చేస్తోంది. భారీగా యుద్ధ నౌకలు, ఫైటర్‌ జెట్లను తైవాన్‌ వైపు మోహరించింది. డ్రాగన్‌ మోహరింపు యుద్ధానికి ముందస్తు చర్యలుగా కనిపిస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఆర్థిక మాంధ్యం అంచున నిలిచిన ప్రపంచ దేశాలకు.. ఇప్పుడు తైవాన్‌పై చైనా రణ నినాదం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రపంచం ఆందోళన పడినట్లే జరుగుతోంది. తైవాన్‌పై చైనా రణ నినాదం చేస్తోంది. తైవాన్‌ అధ్యక్షురాలు సయ్‌ ఇంగ్ వెన్, అమెరికా పర్యటనపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న చైనా.. ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధిస్తోంది. అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌ కార్తీతో సమావేశమైన తైవాన్‌ అధ్యక్షురాలు.. తమది స్వయం పాలిత ప్రజాస్వామ్య దేశమని చేసిన ప్రకటనతో డ్రాగన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే అమెరికా తైవాన్‌ సంబంధాలపై ఆగ్రహంగా ఉన్న జిన్‌పింగ్‌.. తైవాన్‌ చుట్టూ యుద్ధ నౌకలు, పెద్ద సంఖ్యలో ఫైటర్‌ జెట్‌లను మోహరిస్తున్నారు. ఎనిమిది యుద్ధనౌకలు, 42 ఫైటర్‌ జెట్‌లు, తైవాన్‌ సరిహద్దులో మోహరించినట్లు తెలుస్తోంది. 29 యుద్ధ విమానాలు తమ భూభాగంలోకి వచ్చాయని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానాల్లో చెంగ్డు జె-10, షెన్యాంగ్ జె-11, షెన్యాంగ్ జె-16 వంటి అధునాతన జెట్ ఫైటర్లు ఉన్నాయని తైవాన్‌ వెల్లడించింది.

తైవాన్‌ సరిహద్దుల్లో చైనా సైన్యం.. మిలటరీ డ్రిల్స్‌..
చైనా యుద్ధ చర్యలు.. తైవాన్‌పై సైనిక చర్యకు దిగే విధంగా ఉన్నాయని ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా తమ జలాల్లో యుద్ధ నౌకలు, గగనతలం వైపు యుద్ధ విమానాలు, భూతలం వైపు యుద్ధ ట్యాంకులు మోహరించిందని తైవాన్‌ వెల్లడించింది. తైవాన్‌ సరిహద్దుల్లో మూడు రోజుల పాటు చైనా సైన్యం.. మిలటరీ డ్రిల్స్‌ నిర్వహించనున్నట్లు డ్రాగన్ వెల్లడించింది. అధునాతన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ట్యాంకులు సహా డ్రాగన్ సైనిక సత్తాను చాటేలా ఈ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్‌ యుద్ధానికి ముందస్తు సంసిద్ధతతన్న ఆందోళన నెలకొంది.

అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌ కార్తీతో తైవాన్‌ అధ్యక్షురాలి పర్యటన..
చైనా పక్కా ప్రణాళిక ప్రకారమే తైవాన్‌ సరిహద్దుల్లో ఈ డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు.. ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. తైవాన్ జలసంధి సహా తైవాన్‌కు ఉత్తరం, దక్షిణం, తూర్పున వ్యూహాత్మక ప్రాంతాల్లో.. డ్రాగన్‌ ఈ సైనిక విన్యాసాలు చేయాలని ప్రణాళిక రచించింది. తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన మరుసటిరోజే.. చైనా మూడు రోజుల సైనిక విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ ఈ సైనిక విన్యాసాలు చేపడుతోంది.

గతంలోనూ అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్‌లో పర్యటించిన తర్వాత చైనా, తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టి హెచ్చరికలు పంపింది. ఇప్పుడు అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌ కార్తీతో తైవాన్‌ అధ్యక్షురాలి పర్యటనతో.. మరోసారి చైనా-తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి.

తైవాన్ స్వాతంత్ర్యం, వేర్పాటువాద శక్తులు, బాహ్య శక్తుల మధ్య కుట్రని వారికి ఇది తీవ్రమైన హెచ్చరికని చైనా ఆర్మీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తైవాన్ స్వాతంత్ర్యమనే మాటకు.. ఈ అంశంలో విదేశీ శక్తుల జోక్యానికి చోటు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇటు తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. తైవాన్‌ అధ్యక్షురాలు సయ్‌ ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడం వల్ల చైనా ఆంక్షల కొరఢా ఝుళిపించింది. వెన్‌ అమెరికా పర్యటనతో సంబంధం ఉన్న వ్యక్తులపై ప్రయాణ నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు కూడా విధించింది.

సార్వభౌమత్వాన్ని రక్షించడానికి సిద్ధం : తైవాన్‌
తమ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి సిద్ధంగా ఉన్నామన్న తైవాన్‌ రక్షణశాఖ.. క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్‌ చేశామని వెల్లడించింది. తమ భద్రత స్థిరత్వానికి విఘాతం కలిగించే చైనా దుందుడుకు చర్యలను ఖండిస్తున్నట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.