పెరిగిపోతున్న భూతాపంపై పోరాడుతున్న యువ కార్యకర్త నుంచి అగ్రరాజ్య అధినేత వరకూ ఎంతోమంది ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారంగా పేరుగాంచిన నోబెల్ అవార్డు అందుకోవటానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. నార్వేయన్ నోబెల్ కమిటీ పురస్కార విజేతను ప్రకటించనుంది.
ఈ ఏడాది.. 318 మంది అభ్యర్థులు.. నోబెల్ శాంతి బహుమతి అందుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో 211మంది వ్యక్తులు ఉండగా.. 107 సంస్థలు నామినేషన్ దక్కించుకున్నాయి. సెలక్ట్ గ్రూప్తో పాటు.. న్యాయనిపుణులు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విజేతను ఎంపిక చేయనున్నాయి. పురస్కార విజేత విషయంలో పూర్తి గోప్యత పాటిస్తారు.
పోటీలో ప్రముఖులు...
ఈ ఏడాది పోటీలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్వీడన్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఫిబ్రవరి 1 నాటికే నామినేషన్ల పర్వం ముగిసినందున... కొవిడ్-19తో పోరులో ముందుండి పని చేస్తున్న.. ఫ్రంట్లైన్ వర్కర్లకు పోటీకి అవకాశం లేకుండా పోయింది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారులు.
గ్రెటా థన్బర్గ్
![Nobel peace prize to be announced on Friday amid crisis situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9102555_2.jpg)
- పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాధినేతలతో పోరాటం చేస్తోన్న ఈ స్వీడిష్ బాలిక.. ఆంతర్జాతీయంగా మన్ననలు అందుకున్నారు.
- భూతాపం, వాతావరణ మార్పుల గురించి తీవ్ర అందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రెటాకు.. పురస్కారం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
- పర్యావరణ పరిరక్షణ పోరుకు నోబెల్ బహుమతితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్
![Nobel peace prize to be announced on Friday amid crisis situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9102555_3.jpg)
- వరసగా రెండో ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీ పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
- ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య శాంతి నెలకొల్పిన ఘనత తనకే చెందుతుందని, శాంతి పురస్కారానికి అన్ని విధాల అర్హుడునని ఆయన భావిస్తున్నారు.
- ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు నోబెల్ నామినేషన్ దక్కింది.
- మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకుగానూ.. వచ్చే ఏడాది సైతం ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
- అయితే, ట్రంప్... ప్యారిస్ ఒప్పందం సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు వచ్చేయటం, ఇరాన్తో కయ్యం వంటి అంశాలు ఆయనకు చేటు చేసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
అలెక్సీ నావల్నీ
![Nobel peace prize to be announced on Friday amid crisis situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9102555_1.jpg)
- రష్యాలో పుతిన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న అలెక్సీ నావల్నీ.. ఈ పురస్కారం దక్కించుకునే అవకాశాలు కొట్టి పారేయలేం.
- అవినీతికి వ్యతిరేకంగా ఆయన సంస్థ స్థాపించి చేస్తున్న పోరాటం.. నోబెల్ నామినేషన్ దక్కేలా చేసింది.
- ప్రస్తుతం విష ప్రయోగానికి గురైనట్లు అనుమానిస్తున్న రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు.
ఇల్హాం తోటి
- హంకాంగ్-చైనాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త, వీగర్ ముస్లిం ఇల్హాం తోటి కూడా నోబెల్ శాంతి బహుమతికి పోటీ పడుతున్నారు.
- వీగర్ ముస్లీంల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆయనకు.. 2014లో చైనా జీవిత ఖైదు విధించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
![Nobel peace prize to be announced on Friday amid crisis situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9102555_4.jpg)
- ప్రపంచ ఆరోగ్య సంస్థ... నోబెల్ శాంతి పురస్కారం పోటీలో ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఆరోగ్యంపై చేస్తున్న కృషికి నామినేషన్ లభించింది.
- అయితే కరోనా నేపథ్యంలో సంస్థ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అవార్డు దక్కే అవకాశాలు సన్నగిల్లాయి.
ఐక్యరాజ్య సమితి
![Nobel peace prize to be announced on Friday amid crisis situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9102555_5.jpg)
- ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఐక్యరాజ్య సమితికి దక్కే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
- మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు, ప్రపంచ శాంతి స్థాపనకు 75ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ సంస్థ విజయవంతగా పని చేస్తోంది.
- అలాగే ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగంగా 85దేశాల్లో పేదల కోసం పనిచేస్తోంది.
మరికొంత మంది...
వీరితో పాటు.. సుడాన్, సొమాలియా, లిబియా వంటి దేశాల్లో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ఒక వ్యక్తి కంటే.. సంస్థ అవార్డు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న విజేతలకు.. 10మిలియన్ల క్రోనాల (1.1 మిలియన్ డాలర్లు) రివార్డు లభిస్తుంది. అలాగే బంగారు పతకాన్ని డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో జరగనున్న వేడుకలో అందజేస్తారు. కరోనా కారణంగా ఈ ఏడాది కార్యక్రమం నిబంధనల మధ్యే జరగనుంది.