ETV Bharat / international

విపత్తు నామ సంవత్సరంలో.. నోబెల్​ 'శాంతి' ఎవరికి?

author img

By

Published : Oct 7, 2020, 8:57 PM IST

Updated : Oct 7, 2020, 9:02 PM IST

Nobel Peace Prize
విపత్తు నామ సంవత్సరంలో... నోబెల్​ శాంతి బహుమతి ఎవరికి ?

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు-వివాదాలు.. చాలా సందర్భాల్లో వెనుకబడ్డ ప్రజాస్వామ్యం.. మరోవైపు వాతావరణ మార్పులు.. ఇన్ని విపత్తుల నేపథ్యంలో.. ప్రతిష్ఠాత్మక నోబెల్​ శాంతి బహుమతి ప్రపంచానికి కొత్త ఊపిరులూదనుంది. శుక్రవారం ప్రకటించనున్న ఈ అవార్డుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈసారి ఎవరెవరు పోటీలో ఉన్నారు? ఎవరికి ఈ పురస్కారం దక్కనుంది?

పెరిగిపోతున్న భూతాపంపై పోరాడుతున్న యువ కార్యకర్త నుంచి అగ్రరాజ్య అధినేత వరకూ ఎంతోమంది ఈ ఏడాది నోబెల్​ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారంగా పేరుగాంచిన నోబెల్​ అవార్డు అందుకోవటానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం.. నార్వేయన్​ నోబెల్​ కమిటీ పురస్కార విజేతను ప్రకటించనుంది.

ఈ ఏడాది.. 318 మంది అభ్యర్థులు.. నోబెల్​ శాంతి బహుమతి అందుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో 211మంది వ్యక్తులు ఉండగా.. 107 సంస్థలు నామినేషన్ దక్కించుకున్నాయి. సెలక్ట్​ గ్రూప్​తో పాటు.. న్యాయనిపుణులు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా విజేతను ఎంపిక చేయనున్నాయి. పురస్కార విజేత విషయంలో పూర్తి గోప్యత పాటిస్తారు.

పోటీలో ప్రముఖులు...

ఈ ఏడాది పోటీలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, స్వీడన్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్​బర్గ్, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఫిబ్రవరి 1 నాటికే నామినేషన్ల పర్వం ముగిసినందున... కొవిడ్​-19తో పోరులో ముందుండి పని చేస్తున్న.. ఫ్రంట్​లైన్​ వర్కర్లకు పోటీకి అవకాశం లేకుండా పోయింది.

ఈ ఏడాది నోబెల్​ శాంతి బహుమతికి ప్రధాన పోటీదారులు.

గ్రెటా థన్​బర్గ్

greta
గ్రెటా థన్​బర్గ్
  • పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాధినేతలతో పోరాటం చేస్తున్న ఈ స్వీడిష్​ బాలిక.. ఆంతర్జాతీయంగా మన్ననలు అందుకున్నారు.
  • భూతాపం, వాతావరణ మార్పుల గురించి తీవ్ర అందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రెటాకు.. పురస్కారం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
  • పర్యావరణ పరిరక్షణ పోరుకు నోబెల్​ బహుమతితో మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.

డొనాల్డ్​ ట్రంప్​

  • వరసగా రెండో ఏడాది నోబెల్​ శాంతి బహుమతి కోసం పోటీ పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.
  • ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య శాంతి నెలకొల్పిన ఘనత తనకే చెందుతుందని, శాంతి పురస్కారానికి అన్ని విధాల అర్హుడునని ఆయన భావిస్తున్నారు.
  • ఉత్తర-దక్షిణ కొరియాల మధ్య సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు నోబెల్ నామినేషన్​ దక్కింది.
  • మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకుగానూ.. వచ్చే ఏడాది సైతం ట్రంప్​ నోబెల్​ శాంతి బహుమతికి నామినేట్​ అయ్యే అవకాశాలున్నాయి.
    trump
    డొనాల్డ్​ ట్రంప్​
  • అయితే, ట్రంప్​... ప్యారిస్​ ఒప్పందం సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు వచ్చేయటం, ఇరాన్​తో కయ్యం వంటి అంశాలు చేటు చేసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

అలెక్సీ నావల్నీ

  • రష్యాలో పుతిన్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న అలెక్సీ నావల్నీ.. ఈ పురస్కారం దక్కించుకునే అవకాశాలు కొట్టి పారేయలేం.
  • అవినీతికి వ్యతిరేకంగా ఆయన సంస్థ స్థాపించి చేస్తున్న పోరాటం.. నోబెల్​ నామినేషన్​ దక్కేలా చేసింది.
    navalny
    అలెక్సీ నావల్నీ
  • ప్రస్తుతం విష ప్రయోగానికి గురైనట్లు అనుమానిస్తున్న రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు.

ఇల్హాం తోటి

  • హంకాంగ్​-చైనాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త, వీగర్​ ముస్లిం ఇల్హాం తోటి కూడా నోబెల్​ శాంతి బహుమతికి పోటీ పడుతున్నారు.
  • వీగర్​ ముస్లీంల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆయనకు.. 2014లో చైనా జీవిత ఖైదు విధించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ... నోబెల్​ శాంతి పురస్కారం పోటీలో ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఆరోగ్యంపై చేస్తున్న కృషికి నామినేషన్ లభించింది.
  • అయితే కరోనా నేపథ్యంలో సంస్థ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అవార్డు దక్కే అవకాశాలు సన్నగిల్లాయి.
    un
    ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఐక్యరాజ్య సమితి

  • ఈ ఏడాది నోబెల్​ శాంతి పురస్కారం ఐక్యరాజ్య సమితికి దక్కే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
  • మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపేందుకు, ప్రపంచ శాంతి స్థాపనకు 75ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ సంస్థ విజయవంతగా పని చేస్తోంది.
  • అలాగే, యూఎన్​ నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమంలో భాగంగా 85దేశాల్లో పేదల కోసం పనిచేస్తున్నారు.
    un
    ఐక్యరాజ్య సమితి

మరికొంత మంది...

వీరితో పాటు.. సుడాన్​, సొమాలియా, లిబియా వంటి దేశాల్లో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ఒక వ్యక్తి కంటే.. సంస్థ అవార్డు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న విజేతలకు.. 10మిలియన్ల క్రోనాల (1.1 మిలియన్ డాలర్లు) రివార్డు లభిస్తుంది. అలాగే బంగారు పతకాన్ని డిసెంబర్​ 10న నార్వే రాజధాని ఓస్లోలో జరగనున్న వేడుకలో అందజేస్తారు. కరోనా కారణంగా ఈ ఏడాది కార్యక్రమం నిబంధనల మధ్యే జరగనుంది.

Last Updated :Oct 7, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.