ETV Bharat / international

అమెరికాలో ఉత్కంఠ.. ప్రపంచ దేశాల ఆసక్తి!

author img

By

Published : Nov 4, 2020, 9:46 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్​ ట్రంప్​, డెమొక్రాట్​ బైడెన్​ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఫలితాలపై యావత్​ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ట్రంప్​ మరోసారి రావాలని కోరుకుంటుంటే.. మరికొన్ని దేశాలు అధ్యక్ష మార్పు కావాలనుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో ఓలుక్కేద్దాం.

America eletions
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు

అగ్రరాజ్యం అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ..యావత్‌ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని కొందరు కోరుకుంటుండగా మరికొన్ని దేశాలు మాత్రం అధ్యక్షుడి మార్పును కోరుకుంటున్నాయి. అమెరికా ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్‌ ప్రకటించడంతో, బైడెన్‌ కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ కోర్టుకు వెళితే ఫలితం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రిపబ్లికన్‌ ట్రంప్‌, డెమొక్రాట్‌ బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న వేళ ప్రపంచ దేశాలు ఏవిధంగా స్పందిస్తున్నాయో చూద్దాం..

చైనా మీడియా ఆసక్తి..

అమెరికా ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో చైనా వేచిచూసే ధోరణిలో ఉంది. అయితే, అక్కడి అధికారిక మీడియా మాత్రం అమెరికా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా అమెరికా ఎన్నికల తీరును చైనా అపహాస్యం చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడి మార్పును చైనా కోరుకుంటున్నట్లు ఇప్పటికే చైనా పత్రికలు వెల్లడించాయి. ఫలితాల వేళ మరోసారి స్పందించిన చైనా మీడియా.. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా కనిపిస్తున్నాయని ప్రకటించింది. అమెరికా పాలనా సామర్థ్యంలో సమస్యలు ఉన్నాయని.. వీటికి లోతైన సంస్కరణలు అవసరమని గ్లోబల్‌ టైమ్స్‌ తన ఎడిటోరియల్‌లో అభిప్రాయపడింది. అమెరికాలో ఉన్న చైనీస్‌ అమెరికన్లలో 56శాతం మంది బైడెన్‌కే జై కొడుతున్నట్లు వెల్లడించింది. కేవలం 20శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొంది. ఈసారి అమెరికా 'వితౌట్‌ హోప్‌' అంటూ షిన్‌హువా న్యూస్‌ ఏజెన్సీ వ్యాఖ్యానించింది. ఒకవేళ బైడెన్‌ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా కేబినెట్‌ మాజీ సలహాదారుడు డింగ్‌ యిఫాన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

యూరప్‌ తటస్థం..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం యూరప్‌-అమెరికా వాణిజ్య సంబంధాలపై స్వల్ప ప్రభావమే చూపిస్తుందని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టంచేసింది. గడిచిన చాలా ఏళ్లుగా యురోపియన్‌ యూనియన్‌తో అమెరికా స్నేహపూర్వక భాగస్వామిగా లేదని ఫ్రాన్స్‌ ఆర్థికశాఖ చీఫ్‌ బ్రూనో లీ మైరే వెల్లడించారు. ట్రంప్‌ లేదా బైడెన్‌ ఎవరు గెలిచినా ప్రస్తుత వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయడ్డారు. చైనా, ఆసియాతోనే అమెరికా ఎక్కువ సంబంధాలు కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.

'అమెరికా రాజకీయ వ్యవస్థలో ద్వేషం ప్రవేశించింది. ఇకపై కేంద్రీకృత రాజకీయాలు ఉండవని..భిన్న వైఖరుల్లో అమెరికా రాజకీయలు ఉండనున్నాయి' అని జర్మన్‌ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నార్బర్ట్‌ రోట్జెన్ ట్విటర్‌లో వెల్లడించారు. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ కూడా బైడెన్‌కే మద్దతు తెలిపారు. ఇక అమెరికా ప్రజాస్వామ్యం గందరగోళంలో పడిందని, ఎన్నికల తర్వాత నిరసనలు పెల్లుబికే అవకాశం ఉన్నట్లు రష్యా అనుకూల మీడియా పేర్కొంది.

ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌..

ఇక ఇరాన్‌ కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉంది. సొంత ఎన్నికల్లోనే అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడాన్ని ఇరాన్ అగ్రనాయకత్వం తప్పుబట్టింది.

ట్రంప్‌కు జైకొట్టిన బ్రెజిల్‌.. ఆసక్తిగా తిలకిస్తోన్న కెనడా..

అమెరికా ఫలితాల కోసం కెనడియన్లు, నేతలు శ్రద్ధగా టీవీల ముందు కూర్చొని ఉత్కంఠగా చూస్తున్నారు. కెనడా మీడియా మాత్రం దీన్ని రెండో అభిమాన ప్రేక్షక క్రీడ అని అభివర్ణించింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో మాత్రం ట్రంప్‌ అధ్యక్షుడు కావాలని ఇప్పటికే స్పష్టంచేశారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే అమెజాన్‌ అడవుల మీద బ్రెజిల్‌ ఆధిపత్యం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నిశ్శబ్ధంగా చూస్తోన్న మెక్సికో..

అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో కూడా అమెరికా ఫలితాలను శ్రద్ధగా గమనిస్తోంది. ప్రస్తుత ఫలితాలపై స్పందించేందుకు మెక్సికన్‌ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ నిరాకరించారు. పొరుగు దేశ వ్యవహారాల్లో జోక్యం అవసరం లేదని అన్నారు.

హాంగ్‌కాంగ్‌, నైజీరియా మద్దతు..

మరోసారి అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి రావాలని హాంగ్‌కాంగ్‌ కోరుకుంటోంది. తనకు మద్దతు తెలుపుతూ నైజీరియా ప్రజలు వీధుల్లో పరేడ్‌ చేయడం గొప్ప విషయమంటూ ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. హంగేరీ, ఫిలిప్పైన్స్‌, స్లొవేనియా వంటి దేశాలు కూడా ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయి.

భారత్‌లో మిశ్రమం..

అమెరికా ఎన్నికలపై భారత్‌ మిశ్రమంగా స్పందిస్తోంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో కమలా హారిస్‌ ఉండడంతో చాలా ప్రాంతాల్లో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు ట్రంప్‌ అభిమానులు మాత్రం రిపబ్లికన్‌ పార్టీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో భారత్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. అమెరికా చట్టసభల్లో భారతీయులు కూడా ఎక్కువగా ఉండడం, ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకంగా ఉండడంతో యావత్‌ దేశం అమెరికా ఫలితాలపై ఆసక్తిగా గమనిస్తోంది.

ఇలా, అమెరికా అధ్యక్షుడిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆసియా మార్కెట్లలో మిశ్రమంగా స్పందించాయి. జపాన్‌లో మార్కెట్‌ లాభాల్లో పయనించింది. హాంగ్‌కాంగ్‌, షాంఘై, సిడ్నీలలో ట్రేడింగ్‌ కాస్త నిలకడగానే కొనసాగింది. ఎన్నికల ఫలితం రావాల్సి ఉండడంతో మదుపరులు ఆచితూచి స్పందిస్తున్నారు.

ఇవీ చూడండి: అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కు బౌల్డ్​ అయ్యేదెవరు?

ఆ నాలుగు రాష్ట్రాలే ట్రంప్​కు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.