ETV Bharat / crime

అన్నప్రాసనకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..!

author img

By

Published : Jul 24, 2022, 10:48 AM IST

అన్నప్రాశనకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..!
అన్నప్రాశనకు వెళ్లొస్తూ అనంతలోకాలకు..!

Accident in Annamayya District : లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.

ACCIDENT in Annamayya District : వాళ్లిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తెతో పాటు 3 నెలల క్రితమే పుట్టిన కుమారుడితో సంతోషంగా ఉన్నారు. కానీ విధి వక్రించింది. కుమారుడికి అన్నప్రాలన చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఆటో ప్రమాదం.. ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది.

ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి, పెంచలమ్మకు సాయి (8) అనే కుమార్తె, కుమారుడు (3 నెలలు) ఉన్నారు. పెంచలమ్మ తన కుమారుడి అన్నప్రాశన కోసం కుమార్తె, కుమారుడిని తీసుకుని ఆటోలో ఓబులవారిపల్లెలోని పుట్టింటికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు పెంచలమ్మ, ఆమె పిల్లలతో పాటు.. తల్లి ఆకుల పెద్ద వెంకట సుబ్బమ్మ, పొరుగింట్లో ఉండే వెంకట తులసమ్మ ఆటోలో రైల్వేకోడూరు బయల్దేరారు.

మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెంచలమ్మ కుమార్తె సాయి, కుమారుడు, తల్లి వెంకట సుబ్బమ్మ (55), వెంకట తులసమ్మ (34) అక్కడికక్కడే మరణించారు. ఆటోడ్రైవరు బాలకృష్ణ (34), పెంచలమ్మకు (30) తీవ్ర గాయాలు కావడంతో వారిని 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందారు. భార్యా పిల్లల మృతి విషయం తెలిసి ఆమె భర్త గుండెలవిసేలా రోదించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.