ETV Bharat / crime

కోట్ల విలువచేసే ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ... ఎందుకంటే?

author img

By

Published : Mar 15, 2022, 6:58 PM IST

Enforcement Directorate
ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్

Enforcement Directorate News: ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సర్వోమాక్స్ సంస్థతో పాటు అక్రమంగా ఎపిడ్రిన్ తయారు చేసిన డీఆర్ఐ అధికారుల కోట్ల విలువచేసే ఆస్తులను అటాచ్ చేశారు. నిందితులు కాజేసిన డబ్బుతో పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

Enforcement Directorate News: సర్వోమాక్స్ సంస్థకు చెందిన రూ.13.5కోట్లను, అక్రమంగా ఎపిడ్రిన్ తయారు చేసిన కేసులో రూ.1.6కోట్ల విలువ చేసే ఆస్తులను మంగళవారం ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

బ్యాంకులను మోసం చేసిన కేసులో...

సర్వోమాక్స్ డైరెక్టర్లు అవసరాల వేంకటేశ్వర్​రావు, చంద్రశేఖర్​రెడ్డి పేరు మీద ఉన్న 15 స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.402కోట్ల రుణాలు తీసుకున్న నిందితులు వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించి సొంత అవసరాలకు ఉపయోగించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో 2018 ఫిబ్రవరి 2న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం అవసరాల వేంకటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఎపిడ్రిన్ తయారీ కేసులో...

అక్రమంగా ఎపిడ్రిన్ తయారు చేసిన కేసులో నిందితులకు చెందిన 16 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులు తమిళనాడు, తెలంగాణలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనికి పాల్పడిన డీఆర్ఐ అధికారులు నాగరాజు, సత్యనారాయణ, రాజుపై కేసు నమోదు చేశారు. డీఆర్ఐ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు ఎపిడ్రిన్​ను విక్రయించడం ద్వారా 5.2కోట్ల రూపాయలను సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బుతో నిందితులు పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిని అటాచ్ చేశారు.

ఇదీ చదవండి:CM KCR Statements: వీఆర్​ఏలు, ఫీల్డ్​ అసిస్టెంట్లకు గుడ్​న్యూస్​.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.