ETV Bharat / crime

Drugs Smuggling in Telangana : తెలంగాణలో 'మత్తు' విలయం.. స్మగ్లర్‌ టోనీ అరెస్టుతో కదిలిన డ్రగ్స్ డొంక

author img

By

Published : Jan 21, 2022, 6:50 AM IST

Drugs Smuggling in Telangana : డ్రగ్ స్మగ్లర్ టోనీ అరెస్టుతో రాష్ట్రంలో మరోసారి మత్తుమందుల తుట్టె కదిలింది. గతేడాది రాష్ట్రంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన మత్తుమందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా.. ఇంకా పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది దీనికి నాలుగైదు రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్మగ్లర్‌ టోనీతో పాటు మరికొందరి అరెస్టుతో డ్రగ్స్ డొంక కదలింది. మిగతా సరఫరాదారులపైనా రాష్ట్ర పోలీసులు నిఘా ఉంచారు. త్వరలోనే వారినీ పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

Drugs Smuggling in Telangana
Drugs Smuggling in Telangana

అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్ టోనీ అరెస్ట్‌: సీపీ ఆనంద్‌

Drugs Smuggling in Telangana : రాష్ట్రంలో మత్తుమందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాడకందారులు పెరగడంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు రాష్ట్రంపై కన్నేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా డ్రగ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న టోనీతో పాటు మరికొందరిని హైదరాబాద్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో మరోమారు డ్రగ్స్‌ తుట్టె కదిలింది. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకోగా, పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది ఇంతకు నాలుగైదు రెట్లు ఉంటుందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.

2013లో తాత్కాలిక వీసాపై ముంబయికి వచ్చిన టోనీ.. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటూ డ్రగ్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. టోనీకి స్టార్‌య్ అనే అంతర్జాతీయ డీలర్.. ఓడల ద్వారా సరుకు పంపిస్తున్నట్లు గుర్తించాం. వాటిని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నాడు. నగరంలో 13 మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్‌ను విక్రయించారు. రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసే నిరంజన్ జైన్‌ సైతం డ్రగ్స్ తీసుకున్నారు. నిరంజన్‌ జైన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. చాకచక్యంగా వ్యవహరించి టోనీతో పాటు 9 మందిని అరెస్టు చేశాం.

--- సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ సీపీ

ఉత్పత్తికీ స్థావరంగా..

Drug Smuggler Tony Arrest : రసాయన మాదకద్రవ్యాల ఉత్పత్తికీ హైదరాబాద్‌ స్థావరంగా మారింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో 2020 డిసెంబరు నెలలో డీఆర్‌ఐ అధికారులు ఇలాంటి కర్మాగారాన్ని కనుగొని మూడువేల కిలోలకు పైగా మెఫెడ్రన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులోనూ హైదరాబాద్‌ శివార్లలోని మత్తుమందుల కర్మాగారంలో సోదాలు చేసి, రూ.47 కోట్ల విలువైన రసాయన మత్తుమందులు, రూ.50 కోట్ల విలువైన ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాచారం పారిశ్రామికవాడలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కూడా ఇలాంటి కర్మాగారాన్నే స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో డీఆర్‌ఐ అధికారులు రూ.5.5 కోట్ల విలువైన 14 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పండుతున్న గంజాయి అటు బెంగళూరు, ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్‌, దిల్లీ, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు తెలంగాణ మీదుగానే సరఫరా అవుతోంది.

సాంకేతిక పరిజ్ఞానంతో ఎత్తుగడలు

Drugs Supply in Telangana : సాంకేతిక పరిజ్ఞానం పెరగడం మత్తుమందుల విక్రయానికి వరంలా మారింది. టోనీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యవస్థ ఉంది. అతడు ఇంటర్నెట్‌ ఫోన్‌ వాడుతుండడంతో ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. డ్రగ్స్‌ వ్యాపారం కోసం ఇతడు పలు యాప్‌లతో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని, ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు.

ఎవరికివారే..

Smuggler Tony Supplies Drugs in Telangana : మత్తుమందుల నియంత్రణలో వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం లేదు. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన కేంద్ర సంస్థ ఎన్‌సీబీకి సిబ్బంది, సరైన కార్యాలయం లేవు. రాష్ట్ర ఆబ్కారీశాఖ ఎంతసేపూ మద్యం అమ్మకాలపైనే దృష్టి పెడుతోంది. పోలీసుశాఖ ఏదైనా సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మత్తుమందులపై దర్యాప్తు చేస్తోంది. డీఆర్‌ఐ ప్రధాన బాధ్యత అక్రమ దిగుమతులు, ఎగుమతులను అడ్డుకోవడం. ఇది కూడా తగిన సమాచారం ఉంటే తప్ప మత్తుమందులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల సరఫరాదారులను కట్టడి చేయలేకపోతున్నారు.

అడ్డా.. హైదరాబాద్‌

Drugs Smuggling in Telangana 2021 : రాష్ట్రంలో మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. టోనీ వద్ద మత్తుమందులు కొనుగోలు చేసి పట్టుబడిన తొమ్మిది మంది కూడా చాలాకాలంగా మాదకద్రవ్యాల సరఫరాలో చురుగ్గా పాల్గొంటున్నట్లు భావిస్తున్నారు. టోనీ అనుచరులు 15 మందికిపైగా ఉన్నారని వెల్లడైనా పోలీసులు ఇప్పటివరకు 9 మంది ఆచూకీ మాత్రమే తెలుసుకోగలిగారు. గత ఏడాది డీఆర్‌ఐ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా నుంచి వచ్చిన రూ.121 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు 20 వేల కిలోల గంజాయి పట్టుబడడం గమనార్హం. అత్యధికంగా రాచకొండ పోలీసులు 5779 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఇదంతా స్థానిక వినియోగానికి నిర్దేశించిందేనని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.