ETV Bharat / crime

ఒక కేసు పట్టుకుంటే వంద బయటపడ్డాయ్‌

author img

By

Published : Aug 30, 2022, 9:28 AM IST

హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గత నెల 5న పదకొండు మంది సైబర్‌ నేరస్థులను అరెస్ట్‌ చేశారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లను రిడీమ్‌ చేస్తామంటూ ఫోన్లు చేసి మోసాలకు పాల్పడ్డారనేది వారిపై అభియోగం. తెలంగాణలో ఈ ముఠాపై 18 కేసులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశవ్యాప్తంగా 100 కేసుల్లో వీరి ప్రమేయమున్నట్లు వెల్లడైంది. ముఠా పూర్వాపరాలను సైబర్‌క్రైమ్‌ అనాలిసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం(సైకాప్స్‌) టూల్‌ ద్వారా విశ్లేషించడంతో ఇది సాధ్యమైంది.

ఒక కేసు పట్టుకుంటే వంద బయటపడ్డాయ్‌
ఒక కేసు పట్టుకుంటే వంద బయటపడ్డాయ్‌

తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం(సీఐ సెల్‌) ఐజీ రాజేశ్‌ ఆధ్వర్యంలో ఎస్పీ దేవేందర్‌సింగ్‌ గతేడాది జులైలో సైబర్‌క్రైమ్‌ అనాలిసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం(సైకాప్స్‌) సాఫ్ట్‌వేర్‌ను తెరపైకి తెచ్చారు. ఇప్పుడిది దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల విశ్లేషణకు దిక్సూచిలా మారింది. పలు అవార్డులనూ సొంతం చేసుకుంది. కేంద్ర హోంశాఖ మన్ననలూ పొందడంతో 28 రాష్ట్రాలు దీనికి అనుసంధానమై ఉన్నాయి. సైబర్‌ ముఠాల పూర్వాపరాలను సైకాప్స్‌ ద్వారా పంచుకుంటున్నాయి. 28 రాష్ట్రాలు.. దాదాపు 600 మంది నేరస్థులు.. సుమారు 43 వేల సైబర్‌నేరాలు.. ఏడాది కాలంలో సైకాప్స్‌ విశ్లేషణ ఇది.

వచ్చిన ఫిర్యాదుల విశ్లేషణ.. సైబర్‌ నేరాలకు సంబంధించి బాధితులు 1930(గతంలో 155260) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకూ అవకాశముంది. తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఉంటుంది. దానిని సైకాప్స్‌ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్‌ నేరాల్లో 43వేల కేసుల సమాచారాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేయగలిగారు. దీంతో తమ రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదులతో ప్రమేయమున్న సైబర్‌ నేరస్థుల సమాచారాన్ని అక్కడి పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకొని దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. అలాగే ఆయా రాష్ట్రాల పోలీసులు సైతం ఈ సాఫ్ట్‌వేర్‌లో దర్యాప్తు వివరాల్ని పంచుకుంటున్నారు.

ఫిర్యాదుల్లోని సమాచార క్రోడీకరణ ఇలా.. సైకాప్స్‌ బృందం సైబర్‌నేరాల ఫిర్యాదుల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరిస్తుంది. ఏదైనా సైబర్‌నేరం జరిగినప్పుడు నేరస్థులు ఏ సిమ్‌ నుంచి ఫోన్‌ చేసి మోసానికి పాల్పడ్డారు? ఏ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ని వినియోగించారు? కొల్లగొట్టిన సొమ్మును ఏ బ్యాంకు ఖాతాకు మళ్లించారు? డబ్బులు మళ్లించేందుకు ఏ వ్యాలెట్‌ను వినియోగించారు? ఏ ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేశారు.. తదితర వివరాల్ని సేకరిస్తుంది. ఒకే సిమ్‌ నుంచి లేదా ఒకే మొబైల్‌ హ్యాండ్‌ సెట్‌ నుంచి ఎన్ని నేరాలు జరిగాయో గుర్తించి అవన్నీ ఒకే ముఠా చేసినట్లుగా నిర్ధారిస్తుంది. ఆ ముఠా ఏయే రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడిందో ఆయా రాష్ట్రాలకు సమాచారం అందిస్తుంది.

ఇవీ చూడండి..

2021 నేరాల గణాంకాలు విడుదల, సైబర్ క్రైమ్​లో మనమే టాప్

సైబర్​ క్రైమ్​లో డబ్బు పోగొట్టుకున్నారా, అవి తిరిగి పొందొచ్చు తెలుసా

వరదల్లో కొట్టుకుపోయిన మూడు మృతదేహాలు, మంటల్లో కాలిపోతూనే నదిలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.