సైబర్​ క్రైమ్​లో డబ్బు పోగొట్టుకున్నారా, అవి తిరిగి పొందొచ్చు తెలుసా

author img

By

Published : Aug 25, 2022, 11:52 AM IST

Cyber portal

Cyber portal సైబర్​ నేరస్థుల దోపిడీ వల్ల ఖాతాల్లో డబ్బు మాయమైందని బాధపడుతున్నారు. ఏం బాధపడకండి. ఎందుకంటే తిరిగి ఆ డబ్బు తమ అకౌంట్​లలో జమ అవుతుంది. ఎలా అనుకుంటున్నారా అయితే దీనికి అందరూ చేయవలసిన ఒకేఒక్క పని సైబర్​ పోలీసులు తీసుకువచ్చిన పోర్టల్​లో వివరాలు నమోదు చేయడం. ఇంతకీ ఎలా చేయాలి.

Cyber portal: బ్యాంకు అధికారుల్లా, కస్టమర్‌ కేర్‌ ప్రతినిధుల్లా మాట్లాడి మీతోనే మీ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఈ-వ్యాలెట్‌ల వివరాలు చెప్పించుకుని సైబర్‌ నేరస్థులు రూ.లక్షలు కాజేస్తున్నారు. వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ అధికారులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బాధితులు నిందితులకు బదిలీ చేసిన నగదు వివరాలను 24గంటల్లోపు టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసిన తర్వాత https://cybercime.gov.in పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తే వెంటనే బాధితుల ఖాతాల్లోకి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా నిర్విరామంగా నెట్‌వర్క్‌ పనిచేస్తోంది. దీంతోపాటు ఇక్కడ పట్టుపడిన నేరస్థుల వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడా నేరాలకు పాల్పడి ఉంటే హైదరాబాద్‌ నుంచి పీటీ వారెంట్‌ ద్వారా తీసుకెళ్లేందుకు సహకరిస్తున్నారు. దీంతో ఎక్కువకాలం వారు జైళ్లలో ఉండేలా చేస్తున్నారు. బీహార్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సైబర్‌ ముఠాలున్నాయి. వీరిని జైళ్లకు పంపడం ద్వారా అక్కడున్న ఇతర నేరస్థులకు భయం కలగడంతోపాటు తాత్కాలికంగా నేరాలు కాస్త తగ్గుతాయని భావిస్తున్నారు.

24 గంటల్లోపు ఫోన్‌ చేస్తే.. సైబర్‌ నేరస్థుల బారిన పడిన బాధితులు 24 గంటల్లోపు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పాలి.

ఆతర్వాత సైబర్‌ పోర్టల్‌లో వివరాలన్నీ నమోదు చేయాలి. బ్యాంక్‌ ఖాతా లావాదేవీల పత్రాన్ని దానికి జతపర్చాలి. నిమిషాల వ్యవధిలో మీ ఫిర్యాదు నమోదు చేశాము ఫలానా ఠాణాకు వెళ్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారంటూ ఈ-మెయిల్‌, చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది.

బాధితుడి వివరాలను సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ అధికారులు ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం ఇస్తారు. పోలీస్‌ అధికారులు బాధితుల ఫిర్యాదును ధ్రువీకరించిన వెంటనే బ్యాంకుల నోడల్‌ అధికారులు సైబర్‌ నేరస్థులు వినియోగించిన ఖాతా ఏ బ్యాంక్‌లో ఉంటే ఆ ఖాతాలో సొమ్మును స్తంభింపజేసి బాధితుల ఖాతాలోకి తిరిగి జమ చేయిస్తారు.

ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు.. 4 నెలల్లో 90 మంది నేరస్థులను అరెస్ట్‌ చేశాం. వీరు సుమారు రూ.76 లక్షలు కాజేశారు. మూడు కమిషనరేట్ల పరిధుల్లో సైబర్‌ నేరస్థులు ఎక్కడ నేరం చేసినా వారి ఫోన్‌ నెంబర్లు, బ్యాంక్‌ ఖాతాలు విశ్లేషించి అవి సరిపోలితే వెంటనే అందరికీ సమాచారమిస్తున్నాం. ఒక కేసులో బెయిల్‌ పిటిషన్‌ వేసేలోపు ఇతర కమిషనరేట్ల పోలీసులు పీటీ వారెంట్లతో నిందితులను అరెస్ట్‌ చూపిస్తున్నారు. ఇలా 42 మంది సైబర్‌ నేరస్థులు రిమాండ్‌ ఖైదీలుగా 3 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. వారు జైల్లో ఉండడం వల్ల నేరాలు తగ్గాయి. - కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ సైబర్‌క్రైమ్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.