Bought Bike with Rupee coins: ఏపీలోని విశాఖ గాజువాకలో నివాసముంటున్న సింహాద్రి అలియాస్ సంజు యూట్యూబర్. అందరి యువకుల్లాగే అతడికీ ఓ బైక్పై మోజుండేది. అదే హీరో కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్ ఎక్స్పల్స్ 4వీ. ఎలాగైనా కొనుక్కోవాలని డబ్బులు పోగు చేసుకుంటూ వచ్చాడు. లక్షా 60 వేల రూపాయలతో బైక్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందరిలా డబ్బు చెల్లిస్తే కిక్కేముందని భావించిన సింహాద్రి... ఈ మొత్తాన్ని రూపాయి నాణేలతోనే చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
Youtuber Simhadri: షోరూం యజమాని తెలిసిన వ్యక్తే కావడంతో... ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించాడు. అలాగే బ్యాంకులను సంప్రదించి నాణేలు సమకూర్చుకున్నాడు. ఇలా మొత్తం లక్షా 60 వేల రూపాయి నాణేలతో నింపిన సంచులతో షోరూంకి చేరుకుని... కలల బైక్ను సొంతం చేసుకున్నాడు. సింహాద్రితోపాటు అతడి స్నేహితులతో ఉన్న చిరకాల పరిచయం వల్లే... నాణేలు తీసుకుని బైక్ అమ్మక తప్పలేదని షోరూం యజమాని అలీఖాన్ తెలిపారు. నాణేల లెక్కింపు తమ సిబ్బందికి సవాల్తో కూడుకున్న పనేనంటూ నవ్వేశారు. రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు ఆలోచన రెండేళ్ల క్రితం వచ్చిందని సింహాద్రి అంటున్నాడు.
సవాల్తో కూడుకున్న పనే అయినప్పటికీ... కష్టపడి అనుకున్నది సాధించానని సంతోషంగా చెబుతున్నాడు. రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారని... సింహాద్రి, బైక్ షోరూం యజమాని అలీఖాన్ చెబుతున్నారు.
"సింహాద్రి స్నేహితులు చాలా మంది నా షోరూంలో ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. గత ఏడాదిన్నరగా సింహాద్రి నాతో ఎక్స్పల్స్ 4వీ కొనుగోలు చేస్తానని చెప్పారు. కానీ అది మొత్తం రూపాయి నాణేలతోనే అన్నారు. నిజాయతీ కస్టమర్లు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాణేలు తీసుకుని అమ్మాం. ఎంతైనా ఈ నాణేలు లెక్కించడం మా సిబ్బందికి కష్టమైన పనే." -అలీఖాన్, షోరూం యజమాని
"ఇది చాలా కష్టమైన పని. నేను రూపాయి నాణేలతో బైక్ కొంటానని అడగడంతో అలీఖాన్ ఒప్పుకొన్నారు. కొన్ని నాణేలు నేను దాచి ఉంచాను. మిగిలినవి బ్యాంకుల ద్వారా సాధించాను. తెలుగు రాష్ట్రాల్లో ఇలా రూపాయి నాణేలతో బైక్ కొనడం ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. చాలా శ్రమించి నా కలల బైక్ సొంతం చేసుకున్నాను." -సింహాద్రి, యూట్యూబర్
ఇదీ చదవండి: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం