ETV Bharat / crime

ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

author img

By

Published : Apr 22, 2022, 7:06 AM IST

Woman Rape in Vijayawada
Woman Rape in Vijayawada

Woman Rape in Vijayawada : విజయవాడ పోలీసుల అంతులేని నిర్లక్ష్యం... ఓ మానసిక వికలాంగురాలి సామూహిక అత్యాచారానికి కారణమైంది. కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ చుట్టూ తిరిగి మొత్తుకున్నా... ఖాకీలకు కనికరం కలగలేదు. చివరికి వారే స్వయంగా వెళ్లి బిడ్డను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనాస్థలికి వెళ్లేసరికి కన్నబిడ్డపై జరుగుతున్న ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా విలపించారు. పోలీసుల స్పందన కొరవడటం వల్లే అరాచకం జరిగిపోయిందని వాపోయారు.

ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Woman Rape in Vijayawada : నిత్యం జనంతో రద్దీగా ఉండే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన ఓ యువతి (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 30 గంటలపాటు ఆమె పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ ఇరుకు గదిలో బంధించి దాడికి పాల్పడ్డారు. అప్పటి వరకూ ఇంటి వద్దనున్న తమ కుమార్తె కనిపించట్లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లగా.. స్పందించకుండా సాయంత్రం రావాలంటూ తిప్పి పంపించేశారు. చివరిసారిగా ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని ఆధారమిచ్చినా సరే వెంటనే చర్యలు చేపట్టలేదు.

ఆలస్యంగా స్పందించి బాధితురాలు ఎక్కడుందో తెలుసుకున్నా.. ఆమెను రక్షించటానికి వెళ్లలేదు. బాధితురాలి కుటుంబసభ్యులే అక్కడికి వెళ్లి బిడ్డను కాపాడుకోవాల్సి రావడం, అప్పటికీ బాధిత యువతిపై లైంగిక దాడి జరుగుతుండటం పోలీసుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ఈ స్థాయి ఘోరం కొనసాగి ఉండేది కాదు.

30 గంటలపాటు నరకం
విజయవాడ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. ఈ నెల 19వ తేదీ రాత్రి ఆమె ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన దారా శ్రీకాంత్‌ (26) ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని పెస్ట్‌ కంట్రోల్‌ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే శ్రీకాంత్‌ విధులకెళ్లే సమయంలో తనతో పాటు ఆ యువతిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పెస్ట్‌ కంట్రోల్‌ విభాగానికి కేటాయించిన ఇరుకు గదిలో ఆమెను ఆ రాత్రంతా బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం ఆసుపత్రిలోనే ఆమెను వదిలేసి తాను ఇంటికెళ్లిపోయాడు. ఎటెళ్లాలో తెలియక ఆ ప్రాంగణంలోనే అయోమయంగా తిరుగుతున్న ఆమెపై ఆసుపత్రిలో పనిచేసే ఒప్పంద కార్మికుడు చెన్న బాబురావు (23), అతని స్నేహితుడు జోరంగుల పవన్‌కల్యాణ్‌ (23) కన్ను పడింది. వారిద్దరూ ఆమెను మరోమారు ఇరుకుగదిలో నిర్బంధించి అత్యాచారానికి తెగబడ్డారు.

...

కుమార్తె కనిపించట్లేదని ఫిర్యాదిస్తే..సాయంత్రం రావాలన్నారు..
19వ తేదీ రాత్రి 8 గంటల నుంచి కుమార్తె కనిపించకపోవటంతో బాధితురాలి తల్లిదండ్రులు వాంబే కాలనీ, సమీప ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవటంతో 20వ తేదీ ఉదయం 11 గంటలకు నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె అదృశ్యమవటానికి కొంత సమయం ముందు ఒక సెల్‌ నంబరు నుంచి ఫోన్‌ వచ్చిందంటూ పోలీసులకు చెప్పారు. దాని ఆధారంగానైనా తమ కుమార్తె ఎక్కడుందో కనుక్కోవాలని ప్రాథేయపడ్డారు. వెంటనే స్పందించాల్సిన పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారు. తాము ఇప్పుడేం చేయలేమని, సాయంత్రం వచ్చి కలవాలని చెప్పి బాధితురాలి కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల్ని అక్కడి నుంచి పంపించేశారు. సాయంత్రం మరోమారు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. వారు అంతకు ముందు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ నిందితుడు దారా శ్రీకాంత్‌ది అని గుర్తించి అతణ్ని పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. బాధిత యువతిని తనతోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లానని, అక్కడే వదిలేశానని అతను పోలీసులకు చెప్పాడు.

తల్లిదండ్రుల కళ్ల ముందే ఘోరం
నిందితుడు శ్రీకాంత్‌ విచారణలో చెప్పిన సమాచారం ఆధారంగా బాధిత యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ తమ కుమార్తె కోసం గాలిస్తుండగా... జోరంగుల పవన్‌కల్యాణ్‌ అనే యువకుడు ఆ యువతిపైన లైంగిక దాడికి పాల్పడుతూ కనిపించాడు. కన్నబిడ్డపై తమ కళ్ల ముందే జరుగుతున్న ఆ ఘోరాన్ని చూసి తట్టుకోలేక బాధిత కుటుంబసభ్యులు.. కన్నీరుమున్నీరయ్యారు. పవన్‌ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని విచారించగా తన కంటే ముందు చెన్న బాబురావు కూడా బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పటంతో ఈ అమానుష చర్య మొత్తం బయటపడింది.

అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం
అత్యంత హేయమైన ఈ ఘటనలో పోలీసులు తొలి నుంచీ తీవ్ర నిర్లక్ష్యం కనబరిచారు. బాధితురాలి తల్లిదండ్రుల తమ కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు ఇచ్చినా వెంటనే పట్టించుకోలేదు. చివరిసారిగా ఫలానా నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చిందంటూ క్లూ కూడా అందించినా సత్వరం చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించారు. బాధిత యువతిని ఆసుపత్రి ప్రాంగణంలోనే వదిలేసి వచ్చేశానని ఒక నిందితుడు చెప్పినా సరే.. ఆమెను రక్షించేందుకు వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లలేదు. కుటుంబసభ్యులే వెళ్లి ఆమెను సంరక్షించుకోవాల్సి వచ్చింది. దిశ యాప్‌లో ఫిర్యాదు చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ఆదుకుంటామని పదే పదే ప్రభుత్వం నుంచి పోలీసులు వరకూ ప్రకటనలు ఇస్తుంటారు. అలాంటిది ఓ బాధితురాలి కుటుంబ సభ్యులే నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించలేదు. వెంటనే స్పందించి నిందితుడు శ్రీకాంత్‌ను పట్టుకుని ఉంటే.. మిగతా ఇద్దరి బారిన పడకుండా బాధిత యువతి బయటపడేది. పోలీసుల నిర్లక్ష్యం ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారానికి కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పోలీసుస్టేషన్‌ బయట బాధితుల ఆందోళన.. లోపలికి వెళ్లిన వైకాపా ఎమ్మెల్సీ
ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలంటూ తెదేపా నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకుడు పోతిన మహేష్‌, సీపీఎం నాయకుడు సీహెచ్‌.బాబూరావు, ఇతర సంఘాల నాయకులు నున్న పోలీసుస్టేషన్‌ బయట ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్సీ ఎండి.రుహుల్లా అక్కడికి వచ్చారు. బాధిత కుటుంబసభ్యుల వైపు కన్నెత్తి చూడకుండా నేరుగా పోలీసుస్టేషన్‌లోకి వెళ్లిపోయారు. ‘అత్యాచారం చేసిన నిందితులకు అండగా నిలిచేందుకే రుహుల్లా వచ్చారా? వైసీపీ ప్రభుత్వం బాధితులను కాపాడాలని చూస్తోందా?’ అంటూ బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ‘రుహుల్లా గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేందుకే తాను పోలీస్‌స్టేషన్‌కు వచ్చానంటూ రుహుల్లా మీడియాతో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు తరలించారు.

ముగ్గురు నిందితుల అరెస్టు
యువతిపై అత్యాచారానికి పాల్పడిన వాంబేకాలనీకి చెందిన దారా శ్రీకాంత్‌, సీతారాంపురం ప్రాంతానికి చెందిన చెన్నా బాబూరావు, వించిపేటకు చెందిన జోరంగుల పవన్‌కల్యాణ్‌లను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా తెలిపారు. విజయవాడ దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ వి.వి.నాయుడిని ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నియమించినట్టు వివరించారు. బాధితురాలికి పరిహారం అందేలా చూస్తామని పేర్కొన్నారు. తొలుత అదృశ్యం ఘటనగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత అత్యాచార సెక్షన్లను జోడించారు.

బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ నేరస్థుల్ని జాప్యం లేకుండా అదుపులోకి తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటాకు సూచించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.