ETV Bharat / city

AP High court on TTD: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం

author img

By

Published : Oct 27, 2021, 12:49 PM IST

AP High court on TTD
తితిదే బోర్డు వివాదంపై హైకోర్టు వ్యాఖ్యలు

తితిదే బోర్డు వివాదంపై ఏపీ హైకోర్టు(AP High court on TTD) కీలక వ్యాఖ్యలు చేసింది. నేర చరిత్ర ఉన్న వారిని బోర్డులో నియమించారన్న పిటిషన్​పై.. ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు(AP High court on TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. తితిదే కార్యనిర్వాహణాధికారికీ నోటీసులివ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మొత్తం 18 మంది సభ్యులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని తెలిపింది.

తితిదే బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్(AP High court on TTD)​ దాఖలు చేశారు. భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌పై న్యాయవాది అశ్వినికుమార్ వాదనలు వినిపించారు. ఎంసీఐ మాజీ ఛైర్మన్‌ డా. కేతన్ దేశాయ్‌ నియామకంపై అశ్వినికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

జంబో మండలి..

తితిదే పాలకమండలి సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు జీవోలు(AP High court on TTD) జారీ చేసింది. ఛైర్మన్‌గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించగా... ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని పేర్కొన్నారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరిలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ధార్మిక సంస్థల సభ్యులు తదితరులు ఉన్నారు. చైర్మన్‌ సహా సభ్యుల పదవీ కాలం దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. తితిదే పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవి ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పాలకమండలిలో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధుల బంధువులు, రాజకీయ సిఫార్సులతో అవకాశం దక్కించుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా

అధికార వైకాపా బాధ్యతలు చూస్తున్న వారితోపాటు కొందరు నేర అభియోగాలున్న వారికీ ఈ జంబో పాలకమండలిలో(AP High court on TTD) చోటు దక్కిందనే ప్రచారం లేకపోలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వారిని సభ్యులుగా, ఆహ్వానితులుగా నియమించారు. పాలక మండలి సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10 మంది, రాష్ట్రం నుంచి ఏడుగురు, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఇద్దరేసి, గుజరాత్‌, పశ్చిమబంగాల్‌, పుదుచ్చేరి నుంచి ఒక్కకొక్కరికి అవకాశం దక్కింది. పాలకమండలి కూర్పు, భారీగా ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ధార్మిక వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

హాస్యాస్పదం

భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారికి మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ఎక్కువ మందికి అవకాశం కల్పించడం సబబేనని ప్రత్యేక ఆహ్వానితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నియామకాలు అపహాస్యపు విధానాలుగా కనిపిస్తున్నాయని.. దీని వల్ల తితిదే వ్యవస్థ హాస్యాస్పదం అవుతుందని విశ్రాంత ఈవోలు పెదవి విరుస్తున్నారు. సభ్యుల సంఖ్య పెరిగితే ఆ భారం తితిదేపైనే పడుతుందని ధార్మిక సంస్థ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ వ్యవస్థల జోక్యం నుంచి ధార్మిక సంస్థలు పూర్తిగా బయటకు రావాలని స్వామి కమలానంద భారతి ఆకాంక్షించారు. తిరుమల ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు.

ఇదీ చదవండి: Huzurabad by elections 2021: హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.