ETV Bharat / city

Rosaiah political career: యాభై ఏళ్లకుపైగా రాజకీయ ప్రస్థానం.. రోశయ్య సేవలు అద్వితీయం..

author img

By

Published : Dec 4, 2021, 3:57 PM IST

Rosaiah political career as a congress leader so long from 1968
Rosaiah political career as a congress leader so long from 1968

Rosaiah political career: రాజకీయ కురువృద్ధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా.. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న రోశయ్య.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా కొనసాగారు. కాంగ్రెస్‌ సీఎంలందరి వద్ద రోశయ్య పలు కీలక శాఖలు నిర్వహించారు.

యాభై ఏళ్లకుపైగా రాజకీయ ప్రస్థానం.. రోశయ్య సేవలు అద్వితీయం..

rosaiah passed away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఉదయం 8.20 గంటలకు రోశయ్య మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. అమీర్‌పేట్‌లోని నివాసంలో రోశయ్య భౌతికకాయాన్ని ఉంచారు. రోశయ్య భౌతికకాయానికి ప్రముఖులు, బంధువులు నివాళులర్పిస్తున్నారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు.

నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు..

Rosaiah political career: 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ చదివారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడుగా.. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య.. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.

రోశయ్య నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు

  • 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు
  • 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ
  • 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు
  • 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
  • 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
  • 2004, 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
  • 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత..

Rosaiah as finance minister: ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.

గౌరవ డాక్టరేట్..

Doctorate to raosaiah: 2007లో రోశయ్యకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. 2018 ఫిబ్రవరి 11న లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడుగా పేరుతెచ్చుకున్న రోశయ్య....నిబద్ధత, సౌమ్యత, విషయ స్పష్టతతో సేవలు అందించారు. ఆంధ్ర ఉద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పరిచయం ఏర్పడింది.

మూడు రోజుల పాటు సంతాపదినాలు..

Rosaiah funerals: రేపు ఉదయం వరకు తన సొంత నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉంటుంది. ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం ఉంచనున్నారు. మ.12.30 గంటలకు గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్​ నేత కేవీపీ తెలిపారు. రోశయ్య మృతిపట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు రోజులు సంతాప దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.