ETV Bharat / city

POCSO: ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తే పోక్సో చట్టం ప్రయోగం

author img

By

Published : Jul 8, 2021, 6:07 AM IST

చిన్నారులను భౌతికంగా వేధించడం, వారిపై అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రయోగిస్తున్న పోక్సో చట్టాన్ని (లైంగికదాడుల నుంచి చిన్నారుల రక్షణ) (POCSO) సైబర్ నేరస్థులపైనా పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఆన్​లైన్​లో వేధింపులు పెరగడం వల్ల పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీ చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్లు మాత్రమే శిక్ష ఉండగా... పోక్సో చట్టం ప్రకారం గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కఠిన శిక్షలతో విద్యార్థులు, పిల్లలపై సైబర్ నేరాలు కనిష్ఠ స్థాయికి చేరుతాయని పోలీసులు భావిస్తున్నారు.

pocso act
pocso act

ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తే పోక్సో చట్టం ప్రయోగం

ఆన్‌లైన్‌లోనూ చిన్నారులపై వేధింపులు పెరగడంతో ఐటీ చట్టంతో పాటు పోక్సో చట్టాన్ని పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఐటీ చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్లు మాత్రమే శిక్ష ఉండగా... పోక్సో చట్టం ప్రకారం గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇటీవల ట్విట్టర్​లో చిన్నపిల్లలపై చిత్రీకరించిన వీడియోలున్నాయన్న సమాచారంతో.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు దిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం.. 9 రోజుల క్రితం ట్విట్టర్​పై ఐటీ చట్టంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆ వీడియోలు సహచరులకు పంపుతా..

ఓ వెబ్‌సైట్‌లో సికింద్రాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడికి.. 24 ఏళ్ల అహ్మద్ పరిచయమయ్యాడు. బాలుడి చిత్రాలను తీసుకొని అశ్లీల వీడియోలుగా మార్ఫింగ్ చేసి 50 వేలు ఇవ్వకపోతే మీ సహచరులకు పంపుతానని బెదిరించాడు. కంగారుపడిన బాలుడు తండ్రికి చెప్పగా.. వెంటనే ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

విద్యార్థుల ట్రాప్​..

ఆన్‌లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులకు సైబర్ నేరస్థులు టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకుంటున్నారు. మెట్రో నగరాలు, పట్టణాల్లో ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులను ట్రాప్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో క్లాసులు వింటున్నప్పుడు కొందరు విద్యార్థులు.. క్రీడల వెబ్ సైట్లు తెరవడం, మొబైల్ యాప్‌ల ద్వారా ఆటలు ఆడుతున్నప్పుడు.. వారి ఫోన్‌ నంబర్లు, ఈ - మెయిల్ అడ్రస్​ తీసుకుంటున్నారు. బహుమతులు ఇస్తామంటూ వారి ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి.. అశ్లీల వీడియోలు తయారు చేస్తున్నారు. అనంతరం డబ్బులివ్వాలంటూ బెదిరిస్తున్నారు.

ఈ తరహా కేసులు గత ఏడాది దిల్లీలో 164 కేసులు, ఈ సంవత్సరం 74 కేసులు నమోదయ్యాయి. ముంబయిలో గత ఏడాది 128 కేసులు నమోదుకాగా.. ఈ సంవత్సరం 62 నమోదయ్యాయి. బెంగళూరులో గత ఏడాది 96 కేసులు నమోదుకాగా.. ఈ సంవత్సరం 41 కేసులు రిజిస్ట్రర్​ అయ్యాయి. చెన్నైలో గత సంవత్సరం 68 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది 32 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​ లో 2020లో 46 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఆరుగురు నేరస్థులను పోక్సో చట్టం కింద జైలుకు పంపించారు.

ఆన్‌లైన్ తరగతుల్లో వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులను కటకటాల్లోకి పంపిస్తున్నారు. చెన్నైలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు.. ఆన్‌లైన్ క్లాసులో ఇద్దరు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్... సైబర్ నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఆదేశించారు.

ఇదీచూడండి: RTC: మహిళల భద్రతకు పెద్దపీట.. ఆ సమయం దాటితే ఆపాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.