ETV Bharat / city

ఏపీలో రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

author img

By

Published : May 4, 2021, 5:32 PM IST

బుధవారం మధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఏపీలో కర్ఫ్యూ అమలుకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని మంత్రి పేర్ని వెల్లడించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని.. తర్వాత వాహనాలను పూర్తిగా నిలిచిపోతాయని వివరించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని.. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2024 - 25 నుంచి పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. ఉచిత పంటల బీమా, మత్స్యకార భరోసా, రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ, బీసీల రిజర్వేషన్లు, ప్రైవేటీ వర్శిటీలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

cabinet meet update
cabinet meet update

ఏపీలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు, ఆటోలు నడపకూడదని నిర్ణయించింది. ఉదయం 11 గంటల వరకే కళాశాలలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి పేర్ని నాని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేశామని.. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ సైతం అందిస్తున్నామని వివరించారు. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10 వేలు పరిహారం అందిస్తున్నామని... నాటుపడవలపై వేటకు వెళ్లే అందరికీ మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13న రైతుభరోసా తొలివిడత జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. రూ.4,050 కోట్లు విడుదల చేస్తామని.. 54 లక్షల మందికి లబ్ధి పొందునున్నారని వెల్లడించారు.

'2020 ఖరీఫ్ ఉచిత పంటలబీమాను ఈ నెల 8న జమ చేయాలని నిర్ణయించాం. మత్స్యకార భరోసా కింద ఈ నెల 18న రూ.10 వేలు చెల్లిస్తాం. నాటుపడవలు, తెప్పల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు పథకం వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నాం'- పేర్నినాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి

ఏడో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ అమలు కోసం సీబీఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. 2024-25 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారని చెప్పారు.

ఈ రెండేళ్లలో సర్కారు బడుల్లో 6.12 లక్షల మంది పెరిగారు. 44,639 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నాం. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,860 కోట్లు తీసుకునేందుకు ఆమోదం తెలిపాం. ఎయిడెడ్ పాఠశాలలను అప్పగిస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ వర్సిటీ చట్టంలో మార్పు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకంది. ప్రైవేట్‌ వర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీకి నిర్ణయించాం. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌కు చెందిన ఆస్తులు అమూల్‌కు లీజుకు ఇవ్వడంతో పాటు.. వచ్చే ఏడాదికి అన్ని గ్రామాలకు అమూల్ విస్తరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రకాశం పాల ఉత్పత్తి సంస్థ అప్పులు తీర్చడం పునరుద్దరణకు రూ.69 కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేసింది. - పేర్నినాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి

గౌరవ వేతనాలు పెంపు...

ఎ-కేటగిరీ ఆలయాల్లోని అర్చకుల గౌరవ వేతనం రూ.15 వేలు.. బి-కేటగిరీ ఆలయాల్లోని అర్చకుల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి 10 వేలు, మౌజమ్ లకు 3 వేల నుంచి 5 వేలు, పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. 176 మండలాల్లో పీహెచ్ సీలు ఏర్పాటు 511 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్ సీలు) ఉండేలా చర్యలు తీసుకోవాలని.. రెండు పీహెచీసీలకు కలిపి నలుగురు డాక్టర్లు ఉండాలని నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.