ETV Bharat / city

AP RAINS: ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. రహదారులు జలమయం

author img

By

Published : Aug 21, 2021, 10:33 AM IST

మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు(rains in ap) కురుస్తున్నాయి. కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా వారం రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

AP RAINS, AP WEATHER UPDATE
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు, ఏపీ వాతావరణ నివేదిక

ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు(rains) కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. పట్టణంలోని రహదార్లు జలమయమయ్యాయి. ఈపురుపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో కూడా భారీ వర్ధం నమోదైంది.

తడిసిముద్దైన నగరం

విజయవాడ నగరం తడిసిముద్దవుతోంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాలలో భారీగా వానపడుతోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కాలువల నీరు, చెత్తాచెదారాలు రహదారులపైకి వస్తుండడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ రోడ్డు, బెంజిసర్కిల్‌, పటమట, ఆటోనగర్‌, కానూరు ప్రాంతాల్లో కాలువల నుంచి నీరు బయటకొచ్చి రోడ్లపై పారుతుండడంతో.. తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. మొగల్రాజపురం, చుట్టు గుంట, భవానీపురం తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేందుకు జనం అవస్థలు పడుతున్నారు. వన్‌టౌన్‌ సహా ఇతర లోతట్టు ప్రాంతాలు, కాలనీల చుట్టూ వాన నీరు నిలిచింది. విజయవాడ చుట్టుపక్కల కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, గన్నవరం తదితర మండలాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది.

రాకపోకలకు అంతరాయం

కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా చెన్నై-కోల్‌కతా రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కేసరపల్లి, గౌడపేట, సావరగూడెంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గన్నవరం-ఆగిరిపల్లి ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. గొల్లనపల్లి వద్ద పోలవరం కాల్వపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

పిడుగుపాటు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీ సమీపంలో తాటి చెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు పిడుగుపడిన చెట్టును చూసేందుకు తరలి వచ్చారు.

వారం రోజుల పాటు అధిక వర్షాలు...

మహారాష్ట్రలోని విదర్భతో పాటు.. పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ.. 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉన్నట్లు.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో.. ఒకటీ రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చేవారం రోజుల పాటు.. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.

ఇదీ చదవండి: TIGER WANDERING: రహదారిపై పెద్దపులి సంచారం.. వీడియో తీసిన వాహనదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.