ETV Bharat / city

ప్రతి ప్రాణాన్నీ కాపాడాలి.. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి: కేసీఆర్‌

author img

By

Published : Aug 18, 2020, 6:14 AM IST

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి.. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ, అతి భారీ వర్ష సూచన ఉన్న దృష్ట్యా.. అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని.. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు.

cm kcr
cm kcr

వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువులు నిండాయని, అన్ని జలాశయాల్లో నీరు వస్తోందని... ఇప్పటి వరకు పరిస్థితి అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాబోయే మూడు, నాలుగు రోజులు చాలా ముఖ్యమని.. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం... అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 19 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో వానలు, వరదలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిపై... ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రహదారులు –భవనాలు తదితర శాఖలకు చెందిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

మరింత అప్రమత్తంగా...

గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి నదులకు... నీరందించే క్యాచ్ మెంట్ ఏరియా కలిగిన ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నందున.. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి.. పరిణామాలను అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయా ప్రాంతాల్లో.. చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్.. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి... ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వరదల ఉద్ధృతి ఎక్కువున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు.

రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండి.. అలుగు పోస్తున్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన ఫలితంగా చెరువు కట్టలు పటిష్ఠంగా తయారయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున... చెరువులకు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఎంత విపత్తు వచ్చినా సరే ప్రాణనష్టం జరగవద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడడమే అత్యంత ప్రధానమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. వాతావరణం బాగా లేనందున ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ముంపు ప్రమాదం ఉన్నా.. వెంటనే అధికార యంత్రాంగానికి సమాచారం అందించాలి. కూలి పోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలో.. ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. వరద నీరు రోడ్లపైకి వస్తున్న చోట.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.

- సీఎం కేసీఆర్

సహాయక శిబిరాలు ఏర్పాటు చేయండి

గోదావరి నదికి భారీ వరద వచ్చే అవకాశం ఉందని.. ఏటూరు నాగారం, మంగపేట మండలాలతో పాటు పరీవాహక ప్రాంతంలో ఉండే ముంపు గ్రామాలను, ప్రాంతాలను గుర్తించాలని సీఎం తెలిపారు. వరద వల్ల భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున.. పట్టణంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని, శిబిరాల్లో అందరికీ కావాల్సిన వసతి, భోజనం ఏర్పాటు చేయాలని చెప్పారు. కొవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలని అన్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. అధికారులు ఎక్కడికక్కడే ఉండి తమ ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించాలని సీఎం తెలిపారు.

బాగా పని చేశారు

వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై.. వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు ప్రతి రోజు అన్ని పట్టణాలు, గ్రామాల నుంచి తాజా పరిస్థితిపై నివేదిక తెప్పించుకొని.. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందించాలని సీఎం చెప్పారు. ప్రస్తుతం అవసరమైన చర్యలు తీసుకుంటూనే... భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అనుసరించాల్సిన శాశ్వత వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు.. రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా పురపాలకశాఖ బాగా పనిచేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. వరంగల్‌లో తలెత్తిన పరిస్థితితో పాటు.. హైదరాబాద్, కరీంనగర్, ఇతర పట్టణ ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు. పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ వివరించారు.

వ్యూహాన్ని రూపొందించండి

రాష్ట్ర వ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపునకు గురైన, ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయం కల్పించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి హైదరాబాద్ నగరంలో విపత్తు స్పందన దళం పనిచేస్తోందని.. అందులోని 339 మంది సుశిక్షితులైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ తరహాలోనే దళాలను వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోకూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విపత్తుల సమయంలో పురపాలకశాఖ అద్భుతంగా పనిచేస్తోందని... ముఖ్యమంత్రి అభినందించారు. అన్ని పట్టణాల్లోనూ పురపాలక శాఖ, పోలీసులతో కలిసి.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేసి విపత్తు జరిగిన వెంటనే రంగంలోకి దిగేలా సిద్ధం చేయాలని అన్నారు. ఇతర దేశాలు, దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో అనుసరించే వ్యూహాన్ని అధ్యయనం చేసి.. రాష్ట్రానికి అనుగుణమైన విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలి

అన్ని నదుల వద్ద ఫ్లడ్ ట్రాక్ షీట్ తయారు చేయాలన్న సీఎం.. నదుల్లో నీటి ప్రవాహం ఎక్కువైతే జరిగే పరిణామాలను అంచనా వేయాలని చెప్పారు. గతంలో నదులు పొంగి ప్రవహించినప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తిందో.. ట్రాక్ రికార్డు ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వానలు, వరదలు సంభవిస్తే ఏమి చేయాలనే విషయంలో.. ఆంధ్రప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే వ్యవహరించారని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు, ఏర్పాట్లు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, విపత్తులు వచ్చినా.. వాటిని పరిగణలోకి కూడా తీసుకోలేదని అన్నారు.

తెలంగాణ ధృక్పథంలో విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. శాశ్వత ప్రాతిపదికన జరిగేలా వరద నిర్వహణా విధానాన్ని తయారు చేయాలి. వర్షాకాలంలో సంభవించే అంటు వ్యాధులు, ఇతరత్రా వ్యాధుల విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలి. కేవలం ఈ ఒక్క సంవత్సరానికే కాకుండా.. ప్రతి వానాకాలంలో వైద్య పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సరైన వ్యూహం రూపొందించి, అమలు చేయాలి. రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూములు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయాలి. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వచ్చినా స్వీకరించి, తక్షణం సహాయం అందించాలి.

- సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.