ETV Bharat / city

TELANGANA PROJECTS: భారీ వర్షాలతో పలు ప్రాజెక్టులకు జలకళ

author img

By

Published : Aug 30, 2021, 11:00 PM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలసిరిని సంతరించుకుంటున్నాయి. వరద ఉద్ధృతికి అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు.

telangana PROJECTS
telangana PROJECTS

రాష్ట్రం సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టులు, జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. వరద ఉద్ధృతిని అంచనా వేస్తూ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద..

గోదావరి ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 24,150 క్యూసెక్కులు వస్తోంది. 8 గేట్లు ఎత్తి 24,960 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 7,500 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టంతో శ్రీరాం సాగర్​ జలాశయం కళకళలాడుతోంది.

కరీంనగర్ జిల్లాలో దిగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. మోయతుమ్మెద వాగు నుంచి 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రిజర్వాయర్​లోకి చేరుతోంది. దిగువ మానేరు ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి 9,953 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం 4 గేట్ల ద్వారా 25,278 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 697.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. కడెం జలాశయం పూర్తి నీటి నిల్వ 7.60 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.86 టీఎంసీలగా ఉంది. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 5,852 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి... 6,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.7 అడుగులు కాగా.. ప్రస్తుతం 358.65 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది.

మూసీ ప్రాజెక్టుకు..

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 14,808 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 19,647 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 643.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు 6 గేట్లు 5 అడుగులు మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి ఇలానే కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మూసీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నిండుకుండలా జంట జలాశయాలు

ఎగువున కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్​లో జంట జలాశయాలయిన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2,500 క్యూసెక్కుల నీరు.. హిమాయత్‌సాగర్‌లోకి వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,762.85 అడుగులు ఉంది. హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం 1,763 అడుగులకు చేరితే గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఉస్మాన్‌సాగర్‌లోకి 2,200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787.65 అడుగులుగా ఉంది.

ఇదీచూడండి: TS RAINS: భారీ వర్షాలు.. ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన జనజీవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.