TS RAINS: భారీ వర్షాలు.. ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన జనజీవనం

author img

By

Published : Aug 30, 2021, 8:18 PM IST

rains in telangana

రాష్ట్రంలో రెండురోజులుగా ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాకపోకలు స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం కుర్రారం వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. చెరువులు మత్తడి పోస్తుండగా వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రంలో రెండురోజులుగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల జిల్లాల్లో వరద ఉద్ధృతికి వాగులు పొంగాయి. సిద్దిపేట జిల్లాలో మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బస్వాపూర్ వంతెన పైనుంచి నీరు దూకుతుండగా.. హన్మకొండ- సిద్దిపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రవాహంలో చిక్కుకోగా స్థానికులు డ్రైవర్‌ను రక్షించారు. గతేడాది లారీతో సహా డ్రైవర్ గల్లంతై మృతి చెందారు. నంగునూరు మండలంలో 14.65 సెంటీమీటర్ల వర్షం పడింది. శనిగరం ప్రాజెక్ట్ నిండుకుండలా మారి మత్తడి పోస్తోంది. వరద ప్రవాహం కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్‌లోకి చేరుతోంది. శనిగరం ప్రాజెక్ట్ మత్తడి శిథిలావస్థకు చేరుకోగా.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోయ తుమ్మెద వాగు, శనిగరం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

వరద మధ్యలో చిక్కుకుపోయిన బస్సు

సిరిసిల్లలో గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య ఉన్న వంతెనపై వరదలో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా భయంతో కేకలు వేశారు. చివరకు స్థానికులు వారందరిని రక్షించారు.

హైదరాబాద్​లో గత నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​ బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, నారాయణ గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో విడతలవారీగా వర్షం కురిసింది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పంప్​ హౌస్​ జలమయం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలోని పాతచెరువుకు గండి పడింది. సమీపంలోని ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. చెరువు నీరు గౌరవెల్లి రహదారి పైనుంచి ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు కట్ట బుంగకు మరమ్మతులు చేస్తుండగానే కట్ట తెగిపోయింది. మల్లారం సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్రంలోకి వర్షం నీరు చేరింది. పంప్‌ హౌస్, విద్యుత్ నియంత్రికలు నీట మునిగాయి. ఫలితంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సిద్దిపేట, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో చెరువులు మత్తడిపోస్తున్నాయి. హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు నిండుకుండలా మారింది. చెరువు ప్రమాద స్థాయిని మించి అలుగు పోస్తుంది. గౌరవెల్లి, రామవరం ప్రధాన రహదారిపై 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్‌ కోతిరాంపూర్, ఆటోనగర్, గణేశ్‌నగర్‌, తిరుమలనగర్‌లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మొక్కజొన్న పంట నేల వాలింది. జమ్మికుంట హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.

ఇద్దరు గల్లంతు

యాదాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట మండలాల్లో భారీ వర్షం పడింది. ఆలేరు పురపాలక భవనం చుట్టూ వర్షపునీరు చేరింది.. ఆలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. 12వ వార్డులో కాలనీలో ఇళ్లలోకి వరద చేరింది. ఆలేరు- కొలనుపాక మార్గంలో రాకపోకలు స్తంబించాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు యువతుల గల్లంతయ్యారు. యువతులు సింధూజ, బిందు ఇటుకాలపల్లి నుంచి కుర్రారం వెళ్తుండగా వరద ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయారు. వీరిలో సింధుజ మృతదేహం లభ్యమైంది. యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పనులకు ఆటకం కలిగించాయి. కొండపై నూతనంగా నిర్మాణం చేపడుతున్న క్యూకాంప్లెక్స్‌లోకి నీరు చేరింది.

రాకపోకలకు అంతరాయం

నల్గొండ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. మునుగోడు, మునుగోడు- చండూర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొరటికల్ వాగు, చండూర్ మండలంలోని బంగారిగడ్డ, శిర్దేపల్లి చెరువులు అలుగుపోస్తున్నాయి. శిర్ధపల్లి వాగులో ముగ్గురు యువకులు చిక్కుకోగా.. చండూర్ పోలీసులు కాపాడారు. బొడంగిపర్తి, కొరటికల్ వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్‌లో వరద రోడ్డు పైనుంచి ప్రవహిస్తోంది. బంగారిగడ్డ చెరువు అలుగు పారుతుండగా జాలరులు చేపలు పడుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలంలో చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. తురకగూడెంలో ఇళ్లలోకి నీరు చేరింది. నిడమనూరులో నల్లచౌట చెరువు అలుగు పోయగా బంకాపురం మార్గంలో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అనుముల మండలం పేరూర్‌లో వంద ఎకరాల వరి పొలం నీట మునిగింది.

దేవరకొండ మండలంలోని మైనంపల్లి వాగు ఉప్పొంగడంతో.. సమీప బుడ్డతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా పట్టణానికి వెళ్లే పరిస్థితి లేదని స్థానికులు వాపోయారు. గతంలో ఇద్దరు గర్భిణిలు.. సరైన మార్గం లేక ఆస్పత్రికి వెళ్లేందుకు వసతి కరవై మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

కారు గల్లంతు ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

వికారాబాద్ జిల్లాలోను నిన్నరాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. మోమిన్​పేట-మర్పల్లి మండలాల మధ్య తిమ్మాపూర్ వద్ద రాత్రి పెళ్లి కారు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతైన వారిలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి అక్క మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో చిన్నారి ఆచూకి ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో కారు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.

మరోవైపు జిల్లాలో పెద్దేముల్ మండలం మన్సాన్‌పల్లి వాగు పొంగుతుండగా హైదరాబాద్- తాండూర్ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. థరూర్ మండలం వాగు ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. తాండూర్ సమీపంలోని కాగ్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాలాల మండలం కోటవాళ్లు వాగు ఉప్పొంగుతోంది. భారీ వర్షాలతో పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. రహదారులు ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పునరావాస ప్రాంతాలకు తరలింపు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీళ్లలో మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొందివాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అప్రమత్తమైన మున్సిపల్​ అధికారులు ఎన్టీఆర్ నగర్, సాయినగర్ కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి: bus gets stuck in flood: వరదే కదా.. ఏం కాదులే అనుకున్నాడు..

కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.