ETV Bharat / city

పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్​

author img

By

Published : Aug 17, 2020, 10:57 PM IST

cm kcr prizes municipal department in a review meet over floods
పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్​

హైదరాబాద్, వరంగల్​తో పాటు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా పురపాలక అధికారులు బాగా పనిచేశారంటూ సీఎం ప్రశంసించారు. వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా.. రాష్ట్రంలో తీసుకున్న చర్యలను కేటీఆర్​ సీఎంకు వివరించారు.

పురపాలక శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్​ అభినందించారు. హైదరాబాద్, వరంగల్​తో పాటు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా అధికారులు బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. వర్షాలు, వరదలపై సమీక్షించిన సీఎం... వరంగల్​లో తలెత్తిన పరిస్థితితో పాటు హైదరాబాద్, కరీంనగర్, ఇతర పట్టణ ప్రాంతాల పరిస్థితిని సమీక్షించారు.

పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నగర, పురపాలికల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపునకు గురైన, ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయం కల్పించినట్లు వివరించారు.

వరంగల్ నగరంలో 4,750 మందిని సహాయక శిబిరాలకు తరలించామని సీఎంకు నివేదించారు. రాష్ట్రంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న 1,898 ఇళ్లను గుర్తించి, అందులో నివసిస్తున్న వారిని కూడా శిబిరాలకు తరలించామని కేటీఆర్ చెప్పారు. రెండేళ్ల క్రితం నుంచి హైదరాబాద్ నగరంలో విపత్తు స్పందన దళం పనిచేస్తోందని, అందులోని 339 మంది సుశిక్షితులైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అవసరమైన చర్యలు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్​.. సీఎంకు తెలిపారు. పూర్తి స్థాయిలో ఎక్విప్​మెంట్ కలిగిన 50 వాహనాలు కూడా ఉంటాయని.... హైదరాబాద్ తరహాలోనే దళాలను వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లోనూ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా సిద్ధంగా ఉండేలా డీఆర్ఎఫ్ తయారైందని, వాటికి తోడు మాన్​సూన్​ ఎమర్జెన్సీ బృందాలను కూడా అన్ని నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి, తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

విపత్తుల సమయంలో పురపాలకశాఖ అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి అభినందించారు. ఇతర దేశాలు, దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ప్రకృతి విపత్తుల సమయంలో అనుసరించే వ్యూహాన్ని అధ్యయనం చేసి రాష్ట్రానికి అనుగుణమైన విపత్తుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరులో ప్రొఫెషనలిజం కనిపించాలని సీఎం ఆకాంక్షించారు.

ఇవీచూడండి: ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీని అభినందించిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.