ETV Bharat / city

AP CM Jagan: ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుంది

author img

By

Published : Jun 23, 2021, 10:11 PM IST

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. కనీసం ఒక ఏడాది పాటు.. ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో నాణ్యమైన అంతర్జాల సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.

JAGAN REVIEW
ముఖ్యమంత్రి జగన్

ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. పిల్లలకు హై ఎండ్‌ స్కిల్స్‌ నేర్పించాలంటూ అధికారులను ఆదేశించారు. హై ఎండ్‌ స్కిల్స్‌ నేర్పే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం.. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో ఐటీ రంగానికీ విశాఖ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైజాగ్​ను నాణ్యమైన విద్యకు కేంద్రంగా చేయాలంటూ.. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని తీసుకురావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. కనీసం ఒక ఏడాది పాటు.. ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలని స్పష్టం చేశారు. ఏడాది తర్వాత సంస్థకు ప్రోత్సాహకాల చెల్లింపులు ఉంటాయని వివరించారు.

వర్క్‌ఫ్రం హోం కార్యాచరణ బలోపేతానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో నాణ్యమైన అంతర్జాల సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తాం. డిసెంబర్‌ కల్లా 4 వేల గ్రామాలకు అంతర్జాల సేవలకు చర్యలు తీసుకుంటాం. ఏడాది చివరి కల్లా డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు చేస్తాం. వాటి ఏర్పాటుకు భూములు గుర్తించాలి. అందుకు ప్రణాళికను సిద్ధం చేయాలి.

-ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

ఇదీ చదవండీ: Lucky stone: జ్యోతిష్కుడి మ్యాజిక్కు.. దొంగలే కాదు పోలీసులూ అవాక్కు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.