ETV Bharat / city

Water Disputes: జల్​శక్తి శాఖ గెజిట్​కు ఏపీ సై.. పోరాడాలన్న సీఎం కేసీఆర్​

author img

By

Published : Jul 16, 2021, 10:57 PM IST

Water Disputes: జల్​శక్తి శాఖ గెజిట్​కు ఏపీ సై.. ఇంకా తేల్చుకోని తెలంగాణ
Water Disputes: జల్​శక్తి శాఖ గెజిట్​కు ఏపీ సై.. ఇంకా తేల్చుకోని తెలంగాణ

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుంచి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయని జల్​శక్తి శాఖ తేల్చిచెప్పింది. గురువారం రాత్రి వివరాలు తెలుపుతూ.. గెజిట్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కార్​ స్వాగతించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నదీ జలాల​ అంశంపై పార్లమెంట్​ వేదికగా పోరాటం చేయటంతో పాటు గెజిట్​పై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ రాష్ట్రం వారు వద్దంటే.. ఆ రాష్ట్రం వారు కావాల్సిందే అంటారు..! మీ ప్రాజెక్టులు అక్రమమని ఈ ప్రభుత్వం ప్రకటన చేస్తే... కాదు కాదు మీ ప్రాజెక్టులే అక్రమ నిర్మాణాలంటూ మరో ప్రకటన. విద్యుదుత్పత్తి అపాలని ఏపీ సర్కార్​.. ఆపేదే లేదంటూ తెలంగాణ..! అధికార పార్టీ నేతలే కాదు.. ప్రతిపక్ష పార్టీల నేతలు ఫైర్​ అయ్యారు. ఏపీ మంత్రులు మాట్లాడితే.. తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రులు మాట్లాడితే... ఏపీ మంత్రులు, అధికార పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. పోలీసుల పహారాతో ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి..! ఇదీ గత కొన్నాళ్లుగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం..! తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను కూడా ఆశ్రయించింది. ఇలా వాటర్​ వార్​ జరుగుతున్న క్రమంలో... కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్​ను కూడా జారీ చేసింది. మరీ జల్​శక్తి శాఖ ఇచ్చిన గెజిట్​ ఏంటీ..? ఈ నోటిఫికేషన్​పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..?

ఒక్క నది.. నాలుగు రాష్ట్రాలు..

కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపొతల పథకం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమని.. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లెవనెత్తింది. కాదు.. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని.. ఏపీ సర్కార్ గళమెత్తింది. సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తేల్చిచెబుతోంది.

లేఖాస్త్రాలు

కానీ తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించటంతో పాటు వెంటనే ఆపేయాలని కోరింది. రాయలసీమ ఎత్తిపోతలు ఒక్కటే కాకుండా, ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించాలని కృష్ణా బోర్డుని ఏపీ జలవనరుల శాఖ కోరింది. ఈ పరిశీలనపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ లేఖలు కూడా రాసింది. అదే సమయంలో కమిటీని నియమించి, రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలనకు సిద్ధమయిన కేఆర్ఎంబీ ఛైర్మన్ వైఖరిని ఏపీ తప్పుబట్టింది. ఛైర్మన్‌ని తొలగించాలని కూడా జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఇలా నడుస్తున్న వ్యవహరంలో శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం.. విద్యుదుత్పత్తిని కొనసాగించటం కొత్త వివాదానికి దారి తీసింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. విద్యుదుత్పత్తిని చేపట్టడం సరికాదంటూ తెలంగాణ సర్కార్​పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ అంశాలపై ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జల్​శక్తి శాఖ మంత్రికి లేఖలు రాశారు. తక్షణమే తెలంగాణ చర్యలను ఆపాలని జగన్ కోరారు.

వివాదంలో కీలక మలుపు

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో కేంద్ర జల్​శక్తిశాఖ.. రంగంలోకి దిగింది. కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై 71 ప్రాజెక్టులూ.. ఆయా బోర్డుల అధీనంలోకి వెళ్తాయని పేర్కొంటూ గెజిట్​ను విడుదల చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయని స్పష్టం చేసింది. వచ్చే అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్‌ మనీ కింద డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా.. వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్​లో ప్రస్తావించటం ఆసక్తికరం.

అన్యాయం జరగనివ్వకూడదు : కేసీఆర్

తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ, ఏజీ, అదనపు ఏజీలు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్‌పై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదని తెరాస పార్లమెంటరీ భేటీలో ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారుతో రాష్ట్రానికి నష్టం జరిగితే న్యాయపరంగా కూడా పోరాడతామని సీఎం స్పష్టం చేశారు.

స్వాగతించిన ఏపీ

కేంద్ర జల్​శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తమ హక్కులను కాపాడుతుందని ఏపీ జలవనరుల శాఖ అభిప్రాయపడింది. గెజిట్​ను స్వాగతిస్తున్నామని ఆ శాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. నోటిఫికేషన్‌లోని చిన్న చిన్న తప్పిదాలున్నాయని.. వాటిని సరి చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నోటిఫై చేస్తే ఒక రకమైన లాభం.. చేయకుంటే మరో రకమైన లాభం ఉంటుందని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

అనుబంధ కథనాలు:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.